సిట్ ముందుకు హరీష్ రావు
x

సిట్ ముందుకు హరీష్ రావు

తనకు నోటీసులు ఇవ్వడం అంతా కూడా రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనన్న హరీష్.


ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సిటి ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన ఈరోజు విచారణకు వెళ్లారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. హరీశ్‌రావు వెంట వచ్చిన న్యాయవాదులను పీఎస్‌ లోపలికి పోలీసులు అనుమతించలేదు. విచారణకు రావాలని సోమవారం సిట్‌ నోటీసులు జారీ చేసింది. జిల్లా పర్యటనలో ఉన్న హరీశ్‌రావుకు కోకాపేటలోని నివాసంలో నోటీసులు అందజేశారు. చట్టాలపై గౌరవంతోనే విచారణకు హాజరయ్యానని హరీశ్‌రావు తెలిపారు.

రెండేళ్లుగా సాగుతున్న కేసు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ నాయకులు వ్యాపారులు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్‌ చేశారన్న ఆరోపణలపై 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన మాజీ ఎస్‌ఐబీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లడంతో దర్యాప్తు కొంతకాలం నిలిచిపోయింది. గత జూన్‌లో ఆయన హైదరాబాద్‌కు రావడంతో విచారణ మళ్లీ వేగం పుంజుకుంది.

డైవర్షన్‌ పాలిటిక్స్‌: హరీష్

విచారణకు ముందు కోకాపేటలో మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు ఈ నోటీసులను డైవర్షన్‌ పాలిటిక్స్‌గా అభివర్ణించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. పిలిచిన ప్రతిసారి విచారణకు హాజరవుతానని భయపడబోనని అన్నారు. గతంలో తనపై నమోదైన కేసులను హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేశాయని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలు ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నలు కొనసాగుతాయని అవినీతి అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read More
Next Story