ఈనాడు రామోజీరావు విజయ ప్రస్థానం 
x
రామోజీరావు : ఇక లేరు

ఈనాడు రామోజీరావు విజయ ప్రస్థానం 

కృష్ణాజిల్లాలో రైతుబిడ్డగా జీవితాన్ని ప్రారంభించిన రామోజీరావు పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఈనాడు పత్రిక,ఈటీవీని ప్రారంభించిన రామోెజీ మీడియా మొఘల్ గా పేరొందారు.


కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16వతేదీన చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన రామోజీరావు రైతుబిడ్డ నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఢిల్లీలో కొన్నాళ్లు పనిచేసిన రామోజీ తిరిగి హైదరాబాద్ కు వచ్చి మార్గదర్శి పేరిట ఛిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించారు.

- నాడు పత్రికలన్నీ విజయవాడ, హైదరాబాద్ నగరాల నుంచి వెలువడే రోజుల్లో 1974వ సంవత్సరం ఆగస్టు 10వతేదీన విశాఖ నగరంలోని సాగర తీరంలో ఈనాడు దినపత్రికను ప్రారంభించి సర్కులేషన్ లో అగ్రగామిగా నిలిపారు.


ఆర్టిస్టుగా ఉద్యోగం నుంచి...
ఢిల్లీలో రామోజీరావు అడ్వర్టటైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.మూడేళ్ల పాటు ఢిల్లీలో ఉద్యోగం చేసిన రామోజీరావు 1962లో తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. 1962లో మార్గదర్శి ఛిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించారు. రామోజీరావు తొలి వ్యాపారం ఛిట్ ఫండ్ కావడం విశేషం.
- 1965వ సంవత్సరంలో కిరణ్ యాడ్స్ అంటూ వాణిజ్య ప్రకటనల ఏజెన్సీని ప్రారంభించారు. 1967-69 ప్రాంతంలో ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం చేశారు. 1969వ సంవత్సరంలో మొదటిసారి వ్యవసాయ సమాచారంతో అన్నదాత పత్రికను ప్రారంభించి దాన్ని విజయవంతంగా నడిపారు.
- 1970లో ఇమేజెస్ పేరిట అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని నెలకొల్పారు. ఇమేజెస్ బాధ్యతలను తన భార్య రమాదేవికి అప్పగించారు.

మీడియా టైకూన్ గా రామోజీరావు

తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించి మీడియా టైకూన్ గా రామోజీరావు నిలిచారు. జిల్లా పత్రికలను ప్రవేశపెట్టి స్థానిక వార్తలను పాఠకులకు అందించిన ఘనత రామోజీరావుకే దక్కింది. రంగుల్లో పత్రికను ముద్రించడంలో మిగతా పత్రికలకు దిక్కూచిగా నిలిచారు.ప్రతీ నిత్యం ఈనాడు అన్ని ఎడిషన్లు, జిల్లా పత్రికలను చదివి, వార్తలపై వ్యాఖ్యలు రాస్తూ ఈనాడును అగ్రస్థానంలోకి తీసుకువచ్చారు. ప్రతీ మూడు నెలలకు ఓ సారి ఈనాడు ఉప సంపాదకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ జర్నలిజంలో వారికి మార్గనిర్దేశనం చేశారు.

పనిలోనే విశ్రాంతి
నిత్యం పనిలోనే విశ్రాంతి అంటూ రోజుకు 18 గంటలు శ్రమించిన రామోజీరావు తన వ్యాపారసంస్థలను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లారు. 20 ఏళ్ల భవిష్యత్ ను ముందే ఊహించి దానికి అనుగుణంగా తన వ్యాపార సంస్థలను ముందుకు తీసుకువెళ్లిన ధీరుడిగా రామోజీ నిలిచారు. కఠోర సాధనతోనే వ్యాపారరంగంలో విజయాలు సాధించారు.

రామోజీ ఫిలింసిటీ
తెలంగాణలోని హైదరాబాద్ నగర శివార్లలో వేలాది ఎకరాల్లో సినిమా షూటింగుల కోసం నిర్మించిన రామోజీ ఫిలింసిటీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. గిన్నిస్ బుక్ రికార్డు ఫిలింసిటీకి దక్కింది. తన సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు కష్టపడి పనిచేయడం నేర్పించిన ధీశాలి.ఈనాడు, ఈటీవీతోపాటు పలు వ్యాపార సంస్థలను నెలకొల్పిన రామోజీరావు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తగా, మీడియా మొఘల్ గా పేరొందారు.

ఎన్నెన్నో వ్యాపార సంస్థలు...
మార్గదర్శి ఛిట్ ఫండ్, రామోజీ ఫిలింసిటీ, ప్రియా పచ్చళ్లు,కలోరమా ప్రింటర్స్, బ్రిసా, న్యూస్ టైమ్, సితార, చతుర, విపుల,తెలుగువెలుగు, బాల భారతం పత్రికలు నడిపారు. ఈటీవీని కన్నడ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, బీహార్ భాషల్లో ప్రసారాలు అందించారు. ప్రియా ఫుడ్స్, కళాంజలి, డాల్ఫిన్ హోటల్స్, ఉషా కిరణ్ మూవీస్ ఇలా పలు సంస్థలను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించారు.
రామయ్య పేరును మార్చుకున్నారు...

మొదట బాల్యంలో రామయ్య అని పిలిచేవారు. ప్రాథమిక పాఠశాలలో చేరినపుడు తన పేరు రామోజీరావు అంటూ చెప్పి తన పేరును తానే పెట్టుకున్నారు.

అవార్డులు...రివార్డులు
రామోజీరావును పలు అవార్డులు వరించాయి. జర్నలిజం, సాహిత్యం, విద్యారంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2016వ సంవత్సరంలో రామోజీకి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఉషా కిరణ్ మూవీస్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి పలు సందేశాత్మక చిత్రాలు తీశారు. సుధాచంద్రన్ నిజజీవిత గాథను మయూరి పేరిట తీసిన సినిమాకు 1986వ సంవత్సరంలో బెస్ట్ ఫీచర్ ఫిలింగా నంది అవార్డు లభించింది.
నంది అవార్డుల వర్షం
1992లో అశ్వనీ సినిమాకు కూడా నంది అవార్డు దక్కింది. 1999 వ సంవత్సరంలో రామోజీరావుకు ఫిలింఫేర్ సౌత్ స్పెషల్ అవార్డు లభించింది. 2001లో తీసిన నువ్వే కావాలి సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలింగా జాతీయ అవార్డు వచ్చింది. 2001,1986 సంవత్సరాల్లో ఈయన తీసిన నువ్వే కావాలి, ప్రతిఘటన చిత్రాలు బెస్ట్ ఫిలింలుగా ఫిలింఫేర్ అవార్డులు ఇచ్చారు. 2000,1985 సంవత్సరాల్లో తీసిన ‘నీ కోసం’, కాంచనగంగా సినిమాలకు నందిఅవార్డులు,2005లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ అవార్డు లభించింది.

అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు
రామోజీరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూ సీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రామోజీ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో చేయాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి ఆదేశాలు జారీచేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ లకు సీఎం ఆదేశాలు పంపించారు. రామోజీ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రముఖులు చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, రేవంత్ రెడ్డి తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు.


Read More
Next Story