రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కమలం వికసించింది


(ది ఫెడరల్‌ ప్రతినిధి, హైదరాబాద్‌)

ఐదింట మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కమలం వికసించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయాన్ని సాధించింది. ఐదో రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం జరుగుతుంది.
మధ్యప్రదేశ్‌లో ఇలా..
మూడు రాష్ట్రాలురాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 116 స్థానాలు మేజిక్‌ ఫిగర్‌ కాగా...బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీజేపీ 160 స్థానాలు గెలిచింది. మరో మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 65 స్థానాల్లో గెలిచింది. మరొక చోట ఆధిక్యంలో ఉంది.
రాజస్థాన్‌లోనూ అదే..
రాజస్థాన్‌లో ఐదేళ్లకు ఓసారి అధికార మార్పిడి ఈసారి కూడా కొనసాగింది. ఆ సాంప్రదాయాన్ని తిరగ రాస్తామని భావించిన కాంగ్రెస్‌ ఆశలకు ఓటర్లు గండికొట్టారు. రాజస్థాన్‌లో మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారం చేజిక్కించుకోవడానికి 100 స్థానాలు అవసరం కాగా...బీజేపీ 115 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌ పార్టీ 70 సీట్లను దక్కించుకుంది.
ఛత్తీస్‌గడ్‌పై కమలం..
ఛత్తీస్‌గఢ్‌లో గెలుస్తుందనుకున్న కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మేజిక్‌ ఫిగర్‌ 46 స్థానాలు కాగా... బీజేపీ 52 సీట్లను గెలిచి మరో రెండింటిలో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ 35 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక సీట్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలిచారు.
సెమీ ఫైనల్‌లో బీజేపీదే హవా
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో 3 రాష్ట్రాలలో స్పష్టమైన మెజారిటీ సాధించడం ద్వారా బీజేపీ పట్టు సాధించింది.


Next Story