
వచ్చే పదేళ్లు ప్రభుత్వం కాంగ్రెస్దే
టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పలు విషయాలు పంచుకున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడప్పుడే కనిపించదని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న పదేళ్లపాటు తమ ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నారు. గాంధీభవన్ వేదికగా జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణకు సాటిలేదన్నారు. ‘‘దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించాం. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించాం. నేను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నాం. యూత్ కాంగ్రెస్, NSUI, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయి. పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దు. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం. రాజకీయాల్లో మీ ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలి. మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి. మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలి. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది’’ అని అన్నారు.