పేదలకు ఇకపై నాణ్యమైన బియ్యం: మంత్రి ఉత్తమ్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కలు బయటపెట్టారు. తన శాఖ తొలి సమీక్ష సమావేశంలో అధికారులు అప్పులను ఆయన ముందుంచారు. ఆ లెక్కలేంటో తెలుసుకుందా..
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తన శాఖ కార్యకలాపాలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్సప్లయిస్ భవన్లో ఆయన తొలి సమావేశం ఇదే.
రానున్న వంద రోజుల్లో..
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపు రూ.500లకు గ్యాస్ సిలిండర్, రైతులకు క్వింటాం ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్. రూ.500కే సిలిండర్ ఇవ్వడం వల్ల ఏటా 3-4 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
‘‘పేదలు తినగలిగే నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తాం. కేంద్రం నుంచి 5కిలోలు, రాష్ట్రం నుంచి కిలో ఇస్తున్నాం. కిలో రూ. 39లకు కొని పంపిణీ చేస్తున్న బియ్యం తినదగినవిగా లేకుంటే పథకం లక్ష్యం నెరవేరదు. ధాన్యం సేకరణ పారదర్శకంగా జరిగేలా చూస్తాం. అమ్మిన రైతు ఖాతాలో వెంటనే డబ్బు జమ చేసేలా చర్యలు తీసుకుంటాం.’’ అని ఉత్తమ్ తెలిపారు. ఒక దశలో రైస్ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పులు.. నష్టం..
‘‘గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ (Civil Supply Corporation) కు నిధులు మంజూరు చేయలేదు. ఫలితంగా అప్పు రూ. 56 వేల కోట్లు మిగిలింది. నష్టం రూ. 11 వేల కోట్లు జరిగింది’’ అని ఉత్తమ్ లెక్క చెప్పారు.