
ప్రకృతిని రక్షిద్దాం…చిత్తడి నేలలను సంరక్షిద్దాం.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రపంచ వ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవంను జరుపుకుంటారు. 1971లో ఇరాన్ దేశంలోని రామ్సార్ నగరంలో చిత్తడి నేలల సంరక్షణ కోసం అంతర్జాతీయ ఒప్పందం కుదిరిన రోజును గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
"చిత్తడి నేలలు నీటి నిల్వలుగా పనిచేస్తాయి. వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచుతాయి. దీనివల్ల తాగునీటి కొరత తగ్గుతుంది. అలాగే వరదల సమయంలో అదనపు నీటిని నిల్వ చేసి, గ్రామాలు, పట్టణాలను రక్షిస్తాయని," ప్రొఫెసర్ బి.వి.సుబ్బారావు ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు.
ప్రకృతి శుద్ధి కేంద్రాల్లా పనిచేసే ఈ నేలలు, నీటిలోని మలినాలు, కాలుష్యాన్ని తగ్గించి నీటిని శుభ్రపరుస్తాయి. కార్బన్ను ఎక్కువగా నిల్వ చేసి వాతావరణ మార్పు ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. అనేక రకాల చేపలు, పక్షులు, మొక్కలు, జంతువులు చిత్తడి నేలలపై ఆధారపడి జీవిస్తాయి. ముఖ్యంగా వలస పక్షులకు ఇవి విశ్రాంతి కేంద్రాలుగా ఉంటాయని ప్రొఫెసర్ సుబ్బారావు చెప్పారు.

