కొత్త మలుపు తిరిగిన నాగార్జున సాగర్ వివాదం
x
నాగార్జున సాగర్

కొత్త మలుపు తిరిగిన నాగార్జున సాగర్ వివాదం

నాగార్జున సాగర్‌ వివాదం కొత్త మలుపు తీసుకుంది. సాగర్‌ ప్రాంతమంతా నివురుగప్పిన నిప్పులా ఉంది.రెండు రాష్ట్రాల వారు ఎవరి వాదన వారు చేస్తున్న నేపథ్యంలో రైట్‌ బ్యాంక్‌ మెయిన్‌ గేటు వద్ద తెలంగాణ బోర్డు పేరు మారిపోయింది. ఇప్పుడది వివాదంగా మారే సూచనలు ఉన్నాయి.


కృష్ణా జలాల వివాదం తలెత్తిన నేపథ్యంలో సాగర్‌ రైట్ బ్యాంక్ ప్రధాన గేటు సమీపంలో ఉన్న కంట్రోల్ రూమ్‌ పేరు మారింది. టీఎస్ ప్రత్యేక రక్షణ దళం అని బోర్డును తొలగించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని బోర్డు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణ బోర్డును తొలగించి దానిపై ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అని రాయించారు.

డిసెంబర్ 6 న ఇరు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం

కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం మరియు నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ,కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై ఈనెల 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారు లతో కేంద్ర జలశక్తి శాఖ వీడియో సమావేశం నిర్వహించనుంది.

ఈ అంశాలపై శనివారం ఢిల్లీ నుండి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ (Debashree Mukherji) వీడియో సమావేశం నిర్వహించారు. అయితే తెలంగాణా సీఎస్ ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారని కావునా ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6 న వీడియో సమావేశం నిర్వహించి అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి ఈసమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు.

అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈనెల 4న సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ కు సూచించారు. అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటి విడుదలను ఆపాలని కోరారు.కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.కావున ఈనెల 6వ తేదీన అన్ని అంశాలపై చర్చించి వివాద పరిష్కారానికి కృషి చేస్తానని అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయవనం పాటించాలని ఆమె పునరుద్ఘాటించారు.

విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరించడం రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. 6 న జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను సమావేశం దృష్టికి తీసుకు వస్తామని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.ఇంకా ఈసమావేశంలో రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

Read More
Next Story