'హనీమూన్ ఫొటోగ్రాఫర్' వెబ్ సిరీస్ రివ్యూ!

క్రైమ్ థ్రిల్లర్లే ఇప్పుడు ఓటీటీని ఏలుతున్నాయి. అవి సీరిస్‌లు కావచ్చు, సినిమాలు కావచ్చు. కంటెంట్ ఏదైనా జానర్ మాత్రం క్రైమ్ థ్రిల్లర్ ఉంటోంది.

Update: 2024-09-29 12:10 GMT

క్రైమ్ థ్రిల్లర్లే ఇప్పుడు ఓటీటీని ఏలుతున్నాయి. అవి సీరిస్‌లు కావచ్చు, సినిమాలు కావచ్చు. కంటెంట్ ఏదైనా జానర్ మాత్రం క్రైమ్ థ్రిల్లర్ ఉంటోంది. చూసే వాళ్లు సైతం వాటికి మంచి రేటింగ్స్ ఇస్తూండటం కలిసి వస్తోంది. ఆ క్రమంలో జియో సినిమా తాజాగా ఓ కొత్త క్రైమ్ థ్రిల్లర్‌ మన ముందుకు తెచ్చింది. అదే 'హనీమూన్ ఫొటోగ్రాఫర్' . టైటిల్‌లో హానీమూన్ ఉండటంతో వెంటనే ఆసక్తి కలుగుతుంది. అలాగే జానర్ మర్డర్, ఇన్విస్టిగేషన్ కావటంతో ఈ సిరీస్‌ను ఇంట్రస్టింగ్‌ గానే చూస్తున్నారు. ఇంతకీ ఆ సీరిస్ కథేంటి, తెలుగువాళ్లు చూడగలిగేదేనా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

బిజినెస్ మెన్ రోమేశ్ ఇరాని (రీతూ రాజ్ సింగ్) ఒక్కగానొక్క కొడుకు అధీర్ (సాహిల్ సలాథియా). అతను తండ్రి మాట కాదని తాను ఇష్టపడ్డ జోయా (ఆపేక్ష)నే పెళ్లి చేసుకుంటాడు. జోయాతో కలిసి మాల్దీవులకు హనీమూన్ వెళ్తాడు. అలాగే ఈ హానిమూన్‌కు తమ వెడ్డింగ్ షూట్‌కి వచ్చిన అంబిక (ఆశా నేగి)ని ఫొటోగ్రాఫర్‌గా పిలుస్తారు. వాళ్లతో పాటు ఆమె మాల్దీవులకు వెళుతుంది. అయితే ఇక్కడ మెలిక ఏమిటంటే… కొత్త పెళ్లి కొడుకు అయిన అధీర్ ... ఫొటోగ్రాఫర్ అయిన అంబికని ఇష్టపడటం మొదలెడతాడు. అతనికి జోయాపై ఇంట్రస్ట్ తగ్గుతోందని అంబికకు అర్థమవుతుంది. అయితే ఆమె దాన్ని సీరియస్‌గా తీసుకోదు.

ఇక అదే అంబికాకి మాల్దీవులలో రేహాన్ (రాజీవ్ సిద్ధార్థ) పరిచయమవుతాడు. ఇద్దరూ ఒకరితో మరొకరు ఇష్టపడటం మొదలెడతారు. ఇది అధీర్ తట్టుకోలేకపోతాడు. మరో పక్క అంబికపై అధీర్ కన్నేసాడనే విషయం జోయాకి కూడా అర్థమైపోతుంది. ఇలా హానీమూన్ గమ్మత్తుగా జరుగుతూంటే… ఒక రోజున తెల్లవారేసరికి బీచ్‌లో అధీర్ శవమై కనిపిస్తాడు. అందరికీ షాక్. ఎవరు అధీర్‌ని చంపారనేది ఇప్పుడు కథలో అసలు విషయమవుతుంది.

ఇక అధీర్ చనిపోయిన దగ్గర నుంచి, రేహాన్ కనిపించకపోవడం అంబికకి డౌట్ వస్తుంది. అలాగే తన భర్త చనిపోవటానికి ముందు రోజు, తామున్న చోట తన మామగారికి అత్యంత సన్నిహితుడైన అరవింద్ కనిపించడం జోయాకి కొత్త డౌట్ కలిగిస్తుంది. ఇదిలా ఉంటే అధీర్ మరణం సహజమైందని కాదని, అతని తల్లి మీనా పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేయిస్తారు.అధీర్ రక్తంలో పాయిజన్ ఉందని తేలుతుంది. తమ కొడుకును ఎవరు మర్డర్ చేశారనేది తేల్చమని అతని తండ్రి రోమేశ్ ఇరాని పోలీస్ డిపార్టుమెంటుపై ఒత్తిడి తెస్తాడు. అప్పుడు ఏమైంది. ఎవరు అధీర్ ని హత్య చేశారు అనేది మిగతా కథ.

ఎలా ఉంది

సీరిస్ మొదటి రెండు ఎపిసోడ్స్ సోసోగా అనిపిస్తాయి. కథ సెటప్ అయ్యి సీరియస్ అయ్యేదాకా పెద్దగా ఏమీ అనిపించదు. ఎప్పుడైతే మెయిన్ క్యారక్టర్ అధీర్ చనిపోతాడో అక్కడ నుంచి మనకు ఆసక్తి మొదలవుతుంది. ఇన్విస్టిగేషన్ పక్రియ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది కానీ కాస్త స్లో పేస్ లో నడుస్తుంది. ప్రతీ పాత్ర మీద అనుమానం వచ్చేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. దాంతో హంతకుడు వీరిలో ఎవరు అనేది చూసేవారికి చివరిదాకా చూసేలా ప్రేరణ ఇస్తుంది. ఈ నేప‌థ్యంలో పోలీసులు అస‌లు నిందితుడిని ప‌ట్టుకోగ‌లిగాడా, మ‌ర్డ‌ర్ వెన‌కాల దాగి ఉన్న చీక‌టి కోణం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ అంశాల‌తో సాగుతుంది. మ‌ర్డ‌ర్ వెన‌కాల ఉన్న స్టోరీ కాన్సెప్ట్, మ‌ర్డ‌ర్ జ‌రిగిన విధానం మంచి ఎమోష‌న్‌ను, థ్రిల్‌ను ఇస్తుంది.అయితే రెగ్యులర్ గా క్రైమ్ కాన్సెప్టులు చూసేవాళ్లకు ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. నేరేషన్ కూడా ఇంకొంచెం ఇంట్రస్టింగ్ గా, గ్రిప్పింగ్ గా నడిపి ఉంటే బాగుండేది.

టెక్నికల్ గా చూస్తే..

ఈ సీరిస్ డార్క్ మిస్టరీ సెటప్ ని అందమైన మాల్దీవుల లొకేషన్స్ సెట్ చేసేందుకు టీమ్ బాగా కష్టపడిందని అర్థమవుతుంది. ఈ కాంట్రాస్ట్ సీరిస్ కు బాగా కలిసి వచ్చింది. కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం ఇంటెన్స్ ని పెంచింది. ఎడిటింగ్ మాత్రం కాస్త పరుగెట్టిస్తే బాగుండును అనిపించింది. ఇక కథా పరంగా చూస్తే క్యారక్టర్ డెవలప్మెంట్ సరిగ్గా జరగలేదు. ట్విస్ట్ లు కూడా చాలా సార్లు మనం చూసినవే కావడం స్క్రిప్ట్ సైడ్ నుంచి మైనస్.

చూడచ్చా

చూసి గుర్తుంచుకునే స్థాయి క్రైమ్ థ్రిల్లర్ అయితే కాదు. ఖాళీగా ఉన్నప్పుడు ఓ లుక్కేయచ్చు. కాలక్షేపంగా పనికొస్తుంది. రెండు మూడు కాస్త ఇబ్బందికరమైన సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీలతో చూడాలనుకుంటే జాగ్రత్త.

ఎక్కడ చూడచ్చు

జియో సినిమాలో తెలుగులో ఉంది

Tags:    

Similar News