మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ రివ్యూ
ఈసారి కన్నప్ప కళ్ళ నుంచి శివుడు ఎలా కనిపించాడు? ఈ కన్నప్ప మన కళ్లకు, మనస్సుకు ఇంపుగానే ఉన్నాడా? అన్నది రివ్యూలో చూద్దాం...;
మనందరికీ తెలిసిన కన్నప్ప కథ — నిరీశ్వరవాది అయిన ఓ వేటగాడు, శివుడి భక్తుడిగా మారే కథ. ఈ గాథను ఎన్నోసార్లు చదివాం, విన్నాం, సినిమా తెరపై చూశాం. 'కాళహస్తీశ్వర మహత్యం' నుండి బాపు రూపొందించిన భక్త కన్నప్ప వరకూ, ఈ కథను అందంగా చెప్పగలిగినవారికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ జేజేలు పలికారు.
ఇప్పుడు ఇదే కథను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు మంచు విష్ణు. కానీ, ఇప్పుడు ఒకటే ప్రశ్న — మనకు తెలిసిన ఈ పురాణ గాథలో, మనకి తెలియనివి ఏవి మంచు విష్ణు చూపించబోతున్నారు? ఈసారి కన్నప్ప కళ్ళ నుంచి శివుడు ఎలా కనిపించాడు? ఈ కన్నప్ప మన కళ్లకు, మనస్సుకు ఇంపుగానే ఉన్నాడా?
స్టోరీ లైన్
కలియుగం 2వ శతాబ్దంలో ఈ కథ మొదలవుతుంది. వర్షాల నీడలతో, వేటల అరుపులతో, గిరిజన జీవనశైలితో నిండి ఉన్న ఊరు — ఉటుకూరు (ఇప్పటి కాళహస్తి). అక్కడ ఐదు తెగలు నివసిస్తుంటాయి. ఆ తెగల్లో ఒకదాని నాయకుడే నాథనాథుడు (శరత్ కుమార్). అతని కొడుకే తిన్నడు (మంచు విష్ణు) — ఓ భయంకరమైన వేటగాడు, కానీ దేవుళ్లను అసహ్యించునే వ్యక్తి. ఎందుకంటే అతని బాల్యంలో, దేవుడి పేరుతో జరిగిన నరబలిని చూసిన రోజు నుంచే అతడి మనసులో ఆస్తికతకు తలుపు మూసుకుపోయింది.
తిన్నడు నమ్మింది ఒక్కటే — బలం! తిన్నడు ప్రేమించినది నెమలి (ప్రీతి ముకుందన్)ని . కానీ నెమలి మాత్రం శివునిపై అపారమైన భక్తి ఉన్న అమ్మాయి. ఇదిలా ఉండగా అక్కడకి ఎంట్రీ ఇస్తుంది కాలాముఖుడు అనే రాక్షసుని సేన. వారు కోరింది — శివుడి పవిత్ర వాయులింగం.
కానీ తిన్నడు వారిని ఎదుర్కొంటాడు. అతని చేతిలో కాలాముఖుడి సోదరుడు చనిపోవడం వల్ల, మొత్తం తెగలపై కాలాముఖుడు రగిలిపోతాడు.
అతని తండ్రి తనను గూడెం నుంచి బహిష్కరిస్తాడు.
ఆ సమయంలో తిన్నడు జీవితంలోకి అడుగుపెడతాడు ఓ గంభీరమైన అజ్ఞాత శక్తి — రుద్రుడు (ప్రభాస్). అతడు ఎవరు? శివుడేనా? లేక అతడి ప్రతిరూపమా? తిన్నడులో భయానకుడు అయిన వీరుడుని తీసి, భక్తుడిని నింపే ఈ పరిణామం ఎలా జరిగింది?
శివుడిని శత్రువుగా చూసిన వాడే చివరికి… ఆయన పాదాల వద్ద తన కన్నును తానే అర్పించేంత భక్తుడుగా ఎలా మారాడు?
తిన్నడు → కన్నప్పగా మారిన ప్రయాణం ఎలా సాగింది?
ఇవన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
ఈ సినిమా కథ లో చాలా ఎలిమెంట్స్, పాత్రలు, సబ్ ప్లాట్స్ అన్ని ఉన్నాయి. అయితే వాటిని ఎలివేట్ చేసే కథనం (స్క్రీన్ ప్లే) మాత్రం లేదు.
అంతే కాదు ఫస్టాఫ్ గంటన్నర నిడివిలో ‘వావ్’ అనిపించే ఏదైనా మోమెంట్ వస్తుందేమో అనిపించి ఎదురు చూస్తే... ఆశాభంగమే. ప్రథమార్థం మొత్తంగా కథ ఎక్కడకి కదలనట్లు అక్కడే నిలబడి పోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు కథ ఎక్కడో సెకండాఫ్ లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ కోసం ఈ మొత్తాన్ని అప్పటిదాకా భరించాలా అన్నట్లు ఉంటుంది.
దానికి తోడు ప్రభాస్ ఎంట్రి కోసం వచ్చినవాళ్లుకు అయితే అసలు ఫస్టాఫ్ లేకుండా సినిమా తీయకూడదా అనే సందేహం ఆవేదనతో వచ్చేస్తుంది. ఎందుకంటే కథ, పాత్రలు పరిచయం కోసం సాగదీసిన నామమాత్రపు సన్నివేశాలతో టైమ్ వృథా చేసిన ఫీలింగ్ కలుగుతుంది. గూడెం జనాల కథలు, వాళ్ల ఆచారాలు, రొటీన్ విభేదాలు... ఇవన్నీ కథలో రాసుకున్నప్పటికీ ఆసక్తి రేకెత్తించలేవు. హీరో–హీరోయిన్ రొమాన్స్ కూడా ఎమోషన్ లేనట్లు అనిపిస్తుంది. విలన్ ట్రాక్ సైతం పెద్దగా నిలబడలేదు. ఎందుకంటే అవన్నీ ఈ కథకు అవసరం లేవు కాబట్టి.
చివరికి ప్రభాస్ స్క్రీన్ ఎంట్రీతో మాత్రమే ఆడియెన్స్కి ఎలాంటి సినిమా చూస్తున్నామో గుర్తు వస్తుంది. రుద్ర అనే పాత్ర వచ్చాకే… కథకి స్పీడు వస్తుంది, థియేటర్లోనూ జీవం పుడుతుంది.
ఇక తిన్నడు పాత్ర (మంచు విష్ణు) కి బలమైన మానసిక నేపథ్యం ఉంది – దేవుడి పేరిట జరిగిన నరబలిని చూసిన బాల్యం అతని నమ్మకాన్ని నాశనం చేసింది. కానీ ఈ బాధను మనం చూసినంతగా అనుభవించలేం. ఇది బలమైన “Wounded Hero” ఆర్క్ కావాలి, కానీ విజువల్ గా మాయమైపోయింది.
అలాగే నెమలి (ప్రీతి ముకుందన్) తో ప్రేమ వున్నా, అది కూడా పెద్దగా ఎమోషన్ ఆర్క్ ని అందించలేదు. పాత్రలు ఉన్నా… సంఘర్షణ లేదు. ప్రేమ వర్సెస్ భక్తి అనే టెన్షన్ పెరగాల్సిన చోట అది ప్లాట్ గా సాగిపోతుంది. ఇంట్రవెల్ జస్ట్ ఓకే అన్నట్లు ఉంటుంది. సెకండాఫ్ కు సరపడ లీడ్ ఉండదు.
సెకండాఫ్ లో చెప్పుకోదగినది ప్రభాస్ పాత్ర – సుమారు 30 నిమిషాల పాటు కనిపించే ఈ భాగం ఒక devotional shift కలిగిస్తుంది. ఇక్కడ రైటింగ్ బాగుంది. అలాగని పెద్దగా ఎమోషన్ పీక్ ఇవ్వదు. డైలాగ్ బేస్ మీదే నడుస్తుందే కానీ విజువల్ మెమొరబిలిటీ తక్కువ. అయితే సినిమా మొత్తానికి ఆకట్టుకునే ఎలిమెంట్ ఏదైనా ఉందీ అంటే ఇదే.
ఇది సినిమా అసలు ఆత్మ – క్లైమాక్స్. ఇక్కడే సినిమా నిజమైన devotional epicగా మారుతుంది. అప్పటిదాకా సోసోగా అనిపించిన మంచు విష్ణు ఇక్కడ అసలు పాత్రలోకి ప్రవేశిస్తాడు – కన్నప్పగా. భక్తి, త్యాగం, ఉదాత్తత – ఇవన్నీ మొదటిసారి నిజంగా మనని తాకుతాయి. అది కథలో ఉన్న ఎమోషన్ గొప్పతనమా లేక మంచు విష్ణు దాన్ని పండించిన తీరా అంటే ఒక్కోసారి ఒక్కోటి హై ఇస్తుంది.
టెక్నికల్ గా చూస్తే...
దర్శకుడు టీవి సీరియల్స్ నుంచి రావటం వల్లనో ఏమో కానీ డ్రామా బిల్డ్ చేయటానికి ఫస్టాప్ మొత్తం టైమ్ తీసుకున్నాడు. సినిమాటెక్ గా ఉండే స్పీడు ని అనవసరమైన సీన్స్ మింగేసాయి. కథలో అసలు చెప్పాలనుకున్న ఎమోషన్ కు సంభందం లేకుండా ఎక్కవ కథ నడిపేసారు.
ఈ సినిమాలో ఎక్కు శాతం ఉన్న విజువల్స్ & వీఎఫ్ఎక్స్ విషాయనికి వస్తే కొన్ని establishing shots బాగున్నప్పటికీ, మొత్తం చిత్రంలో VFX uneven. కొన్ని కీలక సీన్స్ లో కనపడాల్సిన grandeur లేకపోవడం ఎక్సపీరియన్స్ ని తగ్గిస్తుంది. కొన్ని sequences లో detailing సరిగ్గా లేదు. అయితే సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా విషయాలను కవర్ చేసింది. ఎడిటింగ్ విషయానికి వస్తే... సీన్స్ మధ్య lag ఉంది. కొన్ని unnecessary scenes తొలగించుంటే మొదటి భాగం చాలా engaging గా అయ్యేది.
సౌండ్ డిజైన్ & బిజిఎం బాగుంది కానీ కొన్ని high points కు నిజమైన BGM punch అందలేదేమో అనిపించింది. కారెక్టర్స్ మేకప్, కాస్ట్యూమ్స్ మాత్రం బాగున్నాయి – కాని consistency లేదు. డైలాగులు విషయానికి వస్తే సులభ శైలిలో అర్దమయ్యేలా నీట్ గా ఉన్నాయి. అయితే అలా చేయటం వల్ల కాస్త ఎమోషన్,డెప్త్ తగ్గిందేమో కానీ ఈ కాలం జనరేషన్ కు అర్దం కావాలంటే ఇలాంటివి తప్పదు. డైలాగు రైటర్ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాలంలో ఇలాంటి సినిమాలకు రాసేవారు తగ్గిపోయారు. కానీ ఆ లోటుని ఈ డైలాగు రైటర్ పరిపూర్ణంగా తీర్చారు. అయితే డబ్బింగ్ చెప్పించేటప్పుడు ఆ డైలాగ్స్ ని కరెక్ట్ గా చెప్పించాల్సింది.
నటీనటుల్లో ...
మంచు విష్ణు తనలోని నటుడుని క్లైమాక్స్ దాకా దాచి పెట్టి, అప్పుడు చూపించారు. ప్రభాస్ ఎంట్రీతోనే తనేంటో ,తన స్క్రీన్ ప్రెజెన్స్ ఏమిటో చూపించారు. మోహన్ బాబు ,శరత్ కుమార్, గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. మోహన్ లాల్ ఉన్నాడంటే ఉన్నాడు లేడండే లేడు. ప్రీతి ముకుందన్ పౌరాణిక చిత్రంలో గ్లామర్ హీరోయిన్.
ఫైనల్ థాట్
ఫస్టాఫ్ చప్ప... సెకండాఫ్ 'రుద్ర' ప్ప
‘‘ఇది దేవుడిపై సినిమా కాదు... దేవుడిలాంటి ఓ మనిషిపై సినిమా!’’ అయితే అదే సమయంలో దేవుడే ప్రభాస్ రూపంలో వచ్చి ప్రేక్షకులును ఆదుకున్న సినిమా. ఆయన ప్రవేశం ఒక్కటే ఓ divine interventionలా రీచార్జ్ చేసింది. ప్రభాస్ లేకపోతే? అసలు దేవుడనే వాడు లేడని ప్రేక్షుకులు తల పట్టుకుని బయిటకు వద్దురు.