నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయాల్లోకి వస్తారా?

‘‘ఈ దేశంలో అభ్యర్థులు లేరు. నియోజకవర్గానికి ప్రజాప్రతినిధులు దొరక్క రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. అని నిండు సభలో ప్రకాశ్ రాజ్ ఎందుకన్నారు?

Update: 2024-01-14 09:58 GMT

రానున్న లోక్‌సభ ఎన్నికలలో తనను పోటీ చేయించాలని మూడు రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే వారి ఉచ్చులో పడకూడనని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. కేరళలో నిర్వహించిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (కెఎల్‌ఎఫ్)లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.

కాంచీవరం, సింగం, వాంటెడ్ చిత్రాలలో అద్భుతంగా నటించిన ప్రకాష్ రాజ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విఫలమయ్యారు.

“ఎన్నికలు వస్తున్నాయి, మూడు రాజకీయ పార్టీలు నా వెనుక ఉన్నాయి. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాను. ట్రాప్ లో పడకూడదని.’’ అని చెప్పిన ప్రకాష్ రాజ్ రాజకీయ పార్టీల గురించిన తన మనసులో మాట బయటపెట్టారు. ‘‘పార్టీలు, నాయకులు ప్రజల కోసం రావడం లేదు. రాజకీయ పార్టీలు తమ స్వరాన్ని ఎప్పుడో కోల్పోయాయి’’ అని అభిప్రాయపడ్డారు.

‘‘ఈ దేశంలో అభ్యర్థులు లేరు. నియోజకవర్గానికి ప్రజాప్రతినిధులు దొరక్క రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. మనం ఎంత పేదవాళ్ళం?" అని నిండు సభలో ప్రశ్నించారు.

సెషన్ మోడరేటర్ అంజనా శంకర్ అడిగిన ప్రశ్నలకు ప్రకాష్ రాజ్ సమాధానాలివి..

ప్రశ్న: ప్రధాని మోదీని ద్వేషిస్తున్నారా?

జవాబు: "నేను ఆయనను (మోదీ) ద్వేషించను. అతను నా మామగారా? లేక నాకు ఆయనతో ఏదైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? నేను (ప్రభుత్వం) మీకు పన్ను చెల్లిస్తున్నా.. కాని మీరు నన్ను మీ సేవకుడిలా చూస్తున్నారు. ఇప్పుడది పని చేయదు ... నేను పని చేయమని అడుగుతున్నాను"

ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విట్టర్ (ఎక్స్) లో పోస్టు చేసిన తన పోస్ట్‌లను సమర్థిస్తూ.. "ప్రతి ఒక్కరి మాట్లాడనుకుంటున్నదే నేను మాట్లాడతాను. ఇది నా వాయిస్ కాదు, ఇది మా (ప్రజల) వాయిస్" అని అన్నారు. "ఇది నా 'మన్ కీ బాత్' కాదు, మా 'మన్ కీ బాత్' అని రాజ్’’ అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

అధికారంలో ఉన్న వ్యక్తిని ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ప్రకాష్ రాజ్..

"నేను ఆయనకు ఓటు వేసినా, వేయకున్నా.. ఇప్పటికీ ఆయనే నా ప్రధాని. ఇదే ప్రజాస్వామ్యం. మీరు ఓటు వేయలేదని అడగకూడదన్నది ఏదీ లేదు. ఆయన దిగి పోగానే వచ్చే వ్యక్తిని అడుగుతాను. అప్పుడు నా ట్వీట్లు కూడా మారడం మీరు చూస్తారు. ”అని అన్నారు.

“నేను నెహ్రూ, హిట్లర్ గురించి ట్వీట్ చేస్తానా? అవి నాకు సంబంధించినవి కావు. ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడితే ప్రజలు నన్ను మూర్ఖుడని అంటారు. ఎనిమిది తరాల క్రితం, నేను అప్పుడు పుట్టలేదు కదా" అని రాజ్ అన్నారు.

చరిత్రకారుడు విలియం డాల్రింపుల్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, అమెరికన్ వైద్యుడు-రచయిత అబ్రహం వర్గీస్, అవార్డు గెలుచుకున్న రచయిత పెరుమాళ్ మురుగన్, హాస్యనటుడు కానన్ గిల్ సహా 400 మంది ప్రముఖులు ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.

Tags:    

Similar News