స్పేస్ స్టేషన్ చేరుకున్న శుభాంశు శుక్లా..
అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన వ్యోమనౌక దాదాపు 28 గంటల అనంతరం ఐఎస్ఎస్తో అనుసంధానమైంది.;
అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన వ్యోమనౌక.. భారత కాలమాన ప్రకారం గురువారం సాయంత్రం 4.30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో విజయవంతంగా అనుసంధానమైంది. బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ శుభాంశు శుక్లా(Shubanshu Shukla), మరో ముగ్గురు వ్యోమగాములతో స్పేస్స్టేషన్కు బయల్దేరిన విషయం తెలిసిందే. భూమికి 424 కి.మీ ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరుకునేందుకు దాదాపు 28 గంటలు పట్టింది. నలుగురు వ్యోమగాముల బృందం 14 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి పలు పరిశోధనలు చేయనున్నారు.
ప్రస్తుతం వ్యోమనౌకలో భూకక్ష్యలో తిరుగుతున్న శుభాంశు అంతరిక్షం (Space) నుంచి లైవ్కాల్లో మాట్లాడారు. ప్రయాణం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. భారరహిత స్థితిలో ఎలా నడవాలో చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నానని, శారీరక విషయానికొస్తే.."మమ్మల్ని వాక్యూమ్లోకి తీసుకెళ్లినప్పుడు నాకు అంత గొప్పగా అనిపించలేదు. కానీ నిన్నటి నుంచి నేను చాలా నిద్రపోతున్నాను. పరిస్థితులకు అలవాటుపడాలి’’అని పేర్కొన్నారు. రాకేష్ శర్మ తర్వాత నాలుగు దశాబ్దాల అనంతరం అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండో భారతీయుడు (Indian astronaut) శుక్లా.