కాంగ్రెస్, సీపీఐ మధ్య ఒప్పందం కుదిరింది!

కాంగ్రెస్, సీపీఐ మధ్య ఒప్పందం కుదిరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. సీపీఐ ఒక ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయనుందని చెప్పారు.

Update: 2024-04-05 05:29 GMT
Source: Twitter

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని, ఈ మేరకు ఒప్పందం ఖరారయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ తమకు ఒక ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు కేటాయించిందని, ఆయా స్థానాల్లో సీపీఐ బలోపేతానికి తమ పూర్తి సహకారం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఒప్పందంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. హైదరాబాద్ నివాసంలో ఇటీవల చర్చలు జరిగాయని, అందులో కాంగ్రెస్‌కు మద్దుతగా నిలవడానికి అంగీకరించామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ తరపున షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కే రాజు పాల్గొన్నారని, తమ పార్టీ తరపున కే రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జీ ఓబులేసు పాల్గొన్నారని వివరించారు. అనంతరం తాము ఏయే స్థానాల నుంచి పోటీ చేయనున్నది కూడా ఆయన ప్రకటించారు.

సీపీఐ పోటీ చేసే స్థానాలివే

రానున్న ఎన్నికల్లో సీపీఐ పార్టీ గుంటూరు ఎంపీ స్థానంతో పాటు విశాఖపట్నం పశ్చిమ, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, విజయవాడ పశ్చిమం, కమలాపురం, ఏలూరు, అనంతపురం అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనున్నట్లు రామకృష్ణ స్పష్టం చేశారు. ఆయా సీట్లలో తమ అభ్యర్థులను బలోపేతం చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని కాంగ్రెస్ తెలిపిందని వివరించారు. తమ అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తామని, వారిపై ప్రస్తుతం చర్చలు చేస్తున్నామని ఆయన చెప్పారు.



Tags:    

Similar News