ఏపీలో భారీ వర్షాలు.. పొంగి పొర్లిన వాగులు, వంకలు

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కాల్వ గట్లు తెగాయి. జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Byline :  The Federal
Update: 2024-07-20 15:08 GMT

ఎడతెరపి లేకండా ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్లు చెరువులు, చప్టాలు, వంతెనలు కొట్టుకొని పోయాయి. పలు జిల్లాల్లో జనజీవనం స్థంభించి పోయింది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం భారీగానే పెరిగింది. రాజమండ్రి వద్ద గోదావరి ఉదృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటి మట్టం భారీగా పెరిగింది. దాదాపు 11 అడుగులకు చేరుకుంది. లక్షలాది క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లా దేవీపట్నం గుండిపోశమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన మండలాల్లో వరద ముంచెత్తుతోంది. ఏజెన్నీ ప్రాంతంలోని అలివేరు, జల్లేరు, బైవేరు, వాగు, అశ్వారావుపేట, పడమటి వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏలూరు జిల్లాలోని పలు ఏజెన్నీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు స్థంభించి పోయాయి. అనకాపల్లి జిల్లా తాండవ, వరహ నదుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. రైవాడ, కొనాం జలాశయాల్లోకి కూడా భారీగానే వరద నీరు వచ్చి చేరుతోంది. అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయం నీటి మట్టం 370 అడుగులకు చేరుకుంది. అల్లూరి సీతారామారాజు జిల్లా వట్టిగెడ్డ జలాశయం ఉధృతంగా ప్రవహిస్తోంది.

పల్నాడు జిల్లా మాచర్ల మండలం పర్యాటక ప్రాంతం ఎత్తిపోతల పథకం వరద ప్రవాహం పెరిగింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎత్తిపోతల పథకం జలకళను సంతరించుకుంది. దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఏజెన్సీ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డొంకరాయి ఏవీపీ డ్యామ్‌కు భారీ స్థాయిలో వరద వచ్చి చేరింది. దాదాపు 4వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 940 అడుగుల వరకు నీటి మట్టం చేరింది. ఏలూరు జిల్లా పోలవరం నియోజక వర్గం వేళ్లేరుపాడు మండలంలో పెద్దవాగు కట్ట తెగిపోయింది. కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ఎఫెక్ట్‌ వచ్చి పడింది. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ కాల్వలకు, కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నారు. దాదాపు 1300 క్యూసెక్కులకు పైగా కాల్వలకు విడుదల చేయగా, మరో 5800 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి రిలీజ్‌ చేశారు. విత్తనాలు చల్లిన పొలాల్లో మొలకెత్తే అవకాశం లేదు. ఇప్పటికే నాటు వేసిన పొలాలు నీట మునిగాయి. నారు మడులు కూడా ముంపునకు గురయ్యాయి. ఖరీఫ్‌ కోసం దున్నిన దుక్కిలు వర్షానికి బండబారిపోనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో 57,171 క్యూసెక్కులు ఉంది. నీటి మట్టం 885 అడుగుల కాగా ప్రస్తుతం 811 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్ల 215,8070 క్యూసెక్కులు కాగా 35,1774 టీఎంసీలు ఉంది. దీంతో కుడి, ఎడమ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి నిలచిపోయింది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు శనివారం అన్ని జిల్లాల్లో పర్యటించారు. చప్టాలు, కల్వర్టు తెగిపడిన ప్రదేశాలను పరిశీలించారు. ఎక్కడిక్కడకు అధికారులకు మంత్రులు సూచనలు చేశారు. పంచాయతీ రాజ్‌ చెరువులు తెగిన చోట తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు జరిగిన నష్ట పరిహారాన్ని అంచనా వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వాయుగుండం తుఫానుగా మరినందున మంత్రులు, అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Tags:    

Similar News