ప్రముఖ ఇంజనీర్ పద్మభూషణ్ కె.యల్.రావు 122వ జయంతి

మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ప్రముఖ ఇంజనీర్, పద్మభూషణ్ డాక్టర్ కె.ఎల్. రావు 122వ జయంతి గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన ఘనంగా జరిగింది.

Update: 2024-07-15 14:43 GMT

మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ప్రముఖ ఇంజనీర్, పద్మభూషణ్ డాక్టర్ కె.ఎల్. రావు 122వ జయంతి గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన ఘనంగా జరిగింది. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి నేతృత్వంలో జరిగిన 122వ జయంతి సభలో మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, శాసనమండలి సభ్యులు కె. యస్. లక్ష్మణరావు, మానవత సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ తదితరులు ప్రసంగించారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ డాక్టర్ కె.యల్.రావు భారతదేశంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, తుంగభద్ర, హీరాకుడ్,కోసీ, చంబల్, ఫరక్క లాంటి ఆనకట్టలను నిర్మించి హరిత విప్లవాన్ని సాధించిన మహనీయులని కొనియాడారు.

1962 నుండి 1977 వరకు విజయవాడ లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా కృషిచేసి ఆదర్శనీయమైన నేతగా గుర్తింపు పొందినారన్నారు. డాక్టర్ కె.ఎల్. రావు కృషికి గుర్తింపుగా పులిచింతల ప్రాజెక్టుకు డాక్టర్ కె.ఎల్. రావు పులిచింతల ప్రాజెక్టుగా నామకరణం చేశారన్నారు. మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ విజయవాడలో దర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం కె.ఎల్. రావు గారి మేధా సంపత్తికి నిదర్శనమన్నారు. కె. యల్.రావు రచించిన ఇండియా వాటర్ వెల్త్ పుస్తకం ఇంజనీర్లకు ప్రామాణిక గ్రంథం గా వుందన్నారు. గంగా,కావేరి నదులను అనుసంధానం చేసే బృహత్తర ప్రణాళికకు రూపకల్పన చేసిన మహనీయులన్నారు.

భారతదేశానికి సంగ్రహ విద్యుత్ గ్రిడ్ ను రూపొందించాలని భావించే వారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి హరిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే వారికి ఘనమైన నివాళి అన్నారు. శాసనమండలి సభ్యులు కె. యస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ 1963 లోనే డాక్టర్ కె.ఎల్. రావు సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్ గౌరవాన్ని అందించారన్నారు. మూడు వందలకు పైగా సాంకేతిక రచనలు చేసిన మేధావి అన్నారు. గ్రామీణ విద్యుదీకరణ కోసం అవిరళ కృషి చేశారన్నారు. గుంటూరు జిల్లాలో వరికపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేయాలని గుంటూరు ఛానల్ ను పొడిగించాలని కోరారు.

నాటి ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ ప్రభుత్వాలలో నీటిపారుదల, జల వనరుల శాఖ కేంద్ర మంత్రిగా అవిరళ కృషి చేశారన్నారు. డాక్టర్ కె.ఎల్. రావు చిత్రపటానికి అతిధులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్, మానవత పూర్వ కార్యదర్శి ఎ. రమణ బాబు, మానవత స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, ఉప్పల సాంబశివరావు, టి. వి. సాయిరాం, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, పి. శేషుబాబు తదితరులు ప్రసంగించారు.

Tags:    

Similar News