ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్ష సూచన
ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు ఉండక పోవచ్చు. వచ్చే మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడొచ్చు.;
By : The Federal
Update: 2025-02-22 05:13 GMT
ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు తూర్పు ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 0.9కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో వైపు రెండు రోజుల క్రితం తెలంగాణ, ఒడిశా మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కాస్త బలహీనపడింది.
వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం చల్లబడే సూచనలు కనిపించడం లేదు. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. కోస్తా జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీలు, రాయలసీమ జిల్లాల్లో 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో మాత్రం పూర్తిగా పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. వచ్చే మూడు రోజుల్లో ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా తెలంగాణలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండక పోవచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.