సిద్ధేశ్వరం అలుగు రాయలసీమకే కాదు, రాష్ట్రానికంతా వెలుగు

నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం వద్ద 860 అడుగుల ఎత్తుతో అలుగు నిర్మాణం చేపట్టడం వలన అన్ని సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు సక్రమంగా అందించే వెసలుబాటు కలుగుతుంది.

Update: 2024-09-03 06:21 GMT
శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో అలుగు నిర్మాణం కోసం రాయలసీమ నేతల సత్యాగ్రహం


రాయలసీమ సాగునీటి కష్టాలకు పరిష్కారంగా సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలన్న ప్రజా ఆకాంక్ష దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నది. ఐతే కేవలం రాయలసీమకే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో వెలుగులు నింపే ఆస్కారం సిద్దేశ్వరం అలుగు నిర్మాణంతో పుష్కలంగా ఉంది. రాయలసీమ సాగునీటి ఇబ్బందులకు పరిష్కారంగా విశ్రాంత సాగునీటి నిపుణులు సుబ్బరాయుడు గారు రెండు దశాబ్దాల కాలంగా ప్రభుత్వం ముందుంచుతున్న సిద్దేశ్వరం అలుగు ప్రతిపాదనకు దారితీసిన పరిస్థితులను మరియు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ కు ఏ విధంగా వెలుగును నింపుతుందో తెలిపే చిరు ప్రయత్నమే ఈ సంక్షిప్త వ్యాసం ఉద్దేశ్యం.

బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం సంవత్సరాల నీటి లభ్యత ఆధారంగా (వంద సంవత్సరాలలో 75 సంవత్సరాలు తప్పక నీరు లభించేలాగా) కృష్ణా జలాల నీటి పంపిణి చేసింది. రాయలసీమ ప్రాజెక్టులకు ప్రధానంగా కృష్ణా నది ఉపనది తుంగభద్ర మరియు కృష్ణా నదుల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం సంవత్సరాల నీటి లభ్యత ఆధారంగా కేటాయించిన నీరు తుంగభద్ర, కృష్ణా నదులలో ప్రవహిస్తున్నది‌. కాని రాయలసీమకు కేటయించిన నీటిని “ఏ సంవత్సరం” కూడా వినియోగించుకొనలేక పోతున్నది‌. రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని నిలువ చేసుకునే రిజర్వాయర్లు లేకపోవడం, రిజర్వాయర్ల నుండి నీటిని పంట పొలాలకు అందించే ప్రధాన కాలువలు తగినంత నీటి ప్రవాహ సామర్థ్యంతో నిర్మించకపోవడం లేదా ప్రధాన కాలువల నుండి ఉప కాలువలు, పంట కాలువలు సక్రమంగా లేకపోవడం‌ ఈ దుస్థితికి ప్రధాన కారణాలు.

పైన వివరించిన కారణాల వలన రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన తుంగభద్ర జలాలు కర్నూలు జిల్లాలోని సంకేసుల బ్యారేజి దాటి నంద్యాల జిల్లాలోని సిద్దేశ్వరం, సంగమేశ్వరం ఎగువన కృష్ణా నదిలో కలుస్తున్నాయి. ఈ నీరంతా అక్కడ నుండి దిగువకు శ్రీశైలం వైపు ప్రవహిస్తున్నది. శ్రీశైలం వద్ద కృష్ణా నదికి అడ్డంగా ప్రాజెక్టు నిర్మించడం వలన కృష్ణా జలాలు శ్రీశైలం రిజర్వాయర్ లో నిలువ ఉంచే అవకాశం కలిగింది‌. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిలువ ఉంచినప్నడు నీరు వెనుకకు ఎగదన్నడం వలన సిద్దేశ్వరం, సంగమేశ్వరం ప్రాంతం అంతా రిజర్వాయర్ లో భాగంగా సముద్రాన్ని తలపిస్తుంది.

శ్రీశైలం రిజర్వాయర్ లో సముద్రాన్ని తలపించేలాగా నీరు ఉన్నా, రాయలసీమ ప్రాజెక్టులు ఆ నీటిని ఉపయోగించుకునే వీలులేకుండా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తితే కృష్ణా జలాలు దిగువన ఉన్న నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తాయి‌. రాయలసీమ లోని “ఒక్క ఎకరాకు” కూడా నీరు లభించని పరిస్థితి ఉంది.

రాయలసీమ ప్రాజెక్టులకు నీరు లభించడానికి ప్రధానంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పొందే అవకాశాన్ని అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. 19 టి ఎం సీ ల నికర జలాల కేటాయింపుతో ఎస్ ఆర్ బి సి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది‌. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి తెలుగు గంగ ప్రాజెక్టు, మద్రాసు త్రాగునీటిని అందించే పథకాన్ని తదనంతరం ఎన్ టి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగు దేశం ప్రభుత్వం చేపట్టింది‌. గాలేరు - నగరి, హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకాలకు కూడా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగు దేశం ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. పోతిరెడ్డిపాడు నుండి గాలేరు నగరి ప్రాజెక్టు, కేసి కెనాల్ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు (తుంగభద్ర డ్యాం నుండి కేసి కెనాల్ కు ఉన్న 10 టి ఎం సీ ల నీటిని హెచ్ ఎల్ సి కి బదలాయించి, దీనికి బదులుగా కేసి కెనాల్ కు 10 టి ఎం సీ ల నీరు శ్రీశైలం రిజర్వార్ నుండి పొందేలాగా అంతర్గత సర్దుబాటుకు అనుమతులు ఇవ్వడం), హంద్రీనీవా ఎత్తిపోతల పథకంను (శ్రీశైలం రిజర్వాయర్ లో 834 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు నంద్యాల జిల్లా మల్యాల గ్రామం వద్ద హంద్రీనీవా ఎత్తిపోతల ప్రాజెక్టు) వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.

అనేక ప్రభుత్వాలు అనేక ప్రాజెక్టులు చేపట్టినప్పటికి శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని రాయలసీమ ప్రాజెక్టులు వినియోగించుకొనలేక పోతున్నాయి. దీనికి ప్రధాన కారణం శ్రీశైలం రిజర్వాయర్ లో తగినంత స్థాయిలో నీరు నిలువలేకపోతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీరు అందదు. సముద్రమట్టానికి 841 అడుగుల ఎత్తున ఉన్న నంద్యాల జిల్లా పోతులపాడు గ్రామం వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ లో 841 అడుగుల నీరు ఉన్నప్పుడు ఏ మాత్రం కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీసుకునే అవకాశం లేదు. శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగుల నీరు ఉన్నప్పుడు మాత్రమే సుమారు 7000 క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్ ఆయకట్టుకు, కృష్ణాడెల్టాకు కేటాయించిన 80 టి ఎం సీ ల కృష్ణా జలాలకు అధనంగా నీటిని తరలిస్తుండటంతో, ఆ నీరంతా సమద్రంపాలు అవుతున్నది. దీనివలన శ్రీశైలం రిజర్వాయర్ లో నీటి నిలువ 854 అడుగులు దిగువకు పడిపోతుండడంతో రాయలసీమకు చుక్క నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతున్నది.


సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని సాగుతున్న రాయలసీమ రైతుల యాత్ర


శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు నిలువ ఉంచి శ్రీశైలం దిగువన ఉన్న సాగర్, కృష్ణాడెల్టా ఆయకట్టుకు, శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ మీద ఆదారపడిన రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు సక్రమంగా అందించాల్సిన అవసరం ఉంది. నంద్యాల జిల్లా సిద్దేశ్వరం వద్ద 860 అడుగుల ఎత్తుతో అలుగు నిర్మాణం చేపట్టడం వలన అన్ని సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు సక్రమంగా అందించే వెసలుబాటు కలుగుతుంది. అలుగు నిర్మాణం చేపడితే శ్రీశైలం రిజర్వాయర్ లో 860 అడుగుల ఎత్తులో నీరు ఉన్నప్పుడు అలుగు దిగువన శ్రీశైలం రిజర్వాయర్ వరకు 60 టి ఎం సి ల నీరు, అలుగు ఎగువ భాగాన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకు సుమారు 50 టి ఎం సి ల నీరు నిలువ ఉంటుంది. దీనితో నాగార్జునసాగర్ లో నిలువ ఉండే 312 టి.ఎం.సీ. ల నీటితో పాటు, అలుగు ఉన్న ప్రాంతం నుండి దిగువన శ్రీశైలం రిజర్వాయర్ వరకు ఉండే నీటిని తెలంగాణా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది‌. అలుగుకు ఎగువ భాగన ఉన్న నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. దీని వలన కృష్ణానది మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల అవసరాలకు సాగునీటిని, త్రాగునీటిని వినియోగించడానికి అవకాశం లభిస్తుంది.

315 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్ పూడిక చేరడం వలన నేడు సుమారు 185 టీఎంసీల సామర్థ్యానికి తగ్గిపోయింది. ఇదే విధంగా కొనసాగితే శ్రీశైలం రిజర్వాయర్ ఒక పెద్ద కుంటలాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ జీవితకాలం పెంచడం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల సక్రమ నిర్వహణకు అత్యంత కీలకంగా మారునున్నది. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం వలన శ్రీశైలం రిజర్వాయర్ లో పూడిక చేరడం నివారించి శ్రీశైలం ప్రాజెక్టు జీవిత కాలాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. అలుగు నిర్మాణం శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణగా ఉపయోగపడుతుంది. అలుగు నిర్మాణానికి కొత్తగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. వరద బారి నుండి శ్రీశైలం రిజర్వాయర్ ను రక్షించుకోవడం, ప్రాజెక్టు జీవిత కాలాన్ని పెంచుకోవడం, నీటి నిర్వహణను సక్రమంగా చేపట్టడం, విద్యుత్తు ఉత్పత్తి చేపట్టడం, త్రాగునీటి ఇబ్బందులను తొలగించడం తదితర బహుళ ప్రయోజనాలను తక్కువ నిర్మాణ సమయంతో, తక్కువ పెట్టుబడితో సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా సాదించవచ్చు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ లో వెలుగులు నింపే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నది.

సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 1951 లోనే ప్లానింగ్ కమీషన్ అనుమతులను ఇచ్చింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రము నుండి తెలుగు రాష్ట్రము విడిపోయిన తరువాత సిద్దేశ్వరం వద్ద నిర్మించ వలసిన కృష్ణ పెన్నార్ ప్రాజక్టు కార్యరూపం దాల్చలేదు. దీనికి బదులుగా నాగార్జునసాగర్ నిర్మాణం చేపట్టడం రాయలసీమ సాగునీటి హక్కులు పొందే అవకాశం లేకుండా పోయింది. తరువాత కట్టిన శ్రీశైలం ప్రాజక్టునైన సిద్దేశ్వరం దగ్గర నిర్మించక పోవడంతో రాయలసీమ సాగునీటి అవసరాలు తీరే అవకాశం అటకెక్కింది. ఇది కేవలం నాగార్జున సాగర్ కు అదనపు రిజర్వాయర్ గా ఉపయోగ పడుతుంది. జరిగిన నష్టాన్ని సరిద్దిడుకోనడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఒక సువర్ణ అవకాసం. ఐదు మంది ఇంజనీరింగ్ ఛీఫ్ లతో కూడిన కమిటి సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి సానుకూలమైనమైన నివేదికను దశాబ్దా కాలం క్రిందటే ఇచ్చారు.‌ అయినప్పటికీ ఈ ప్రాజెక్టు సాధనకు ప్రభుత్వాలు స్పందించని నేపథ్యంలో, అనేక బహుళార్థ ప్రయోజనాలను కలిగి ఉన్న సిద్దేశ్వరం అలుగు నిర్మాణం కోసం రాయలసీమ సాగునీటి సాధన సమితి, అనేక ప్రజా సంఘాలతో కలిసి మే 31, 2016 సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. సుమారు 30 వేల మంది రాయలసీమ ప్రజానీకం స్వచ్ఛందంగా కదిలి వచ్చి సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 2016 సంవత్సరం చేపట్టిన ప్రజా అలుగు శంకుస్థాపనకు ఏమాత్రం తీసిపోకుండా, వైసీపి ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 సంవత్సరంలో 46 డిగ్రీల సెంటీగ్రెడ్ లో నిండు ఎండ కాలం మే నెలలో నాలుగు రోజుల 100 కిలోమీటర్ల పాదయాత్రను నంద్యాల నుండి సిద్దేశ్వరం వరకు వేలాదిమంది ప్రజలతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా శ్రేయస్సే ద్యేయంగా అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవ కార్యక్రమాలను రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతి సంవత్సరం చేపడుతూ రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొస్తున్నది. ఈ పరంపరలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి మద్దతును ప్రకటించాయి.

కల్వకుర్తి నంద్యాల మధ్య నిర్మించే జాతీయ రహదారిలో భాగంగా సంగమేశ్వరం వద్ద కృష్ణానది పైన నిర్మిస్తున్న తీగెల వంతెనకు బదులుగా “అలుగుతో కూడిన వంతెన” (Weir cum Bridge) నిర్మాణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, మంత్రులకు, శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు అందించింది. స్వయంగా ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రజా ప్రతినిధులను కలిసి విన్నవించడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఈ అంశాలను యువ నాయకుడు నారా లోకేష్ బాబు, నారా చంద్ర బాబు నాయుడు గార్ల దృష్టికి సమితి నాయకులు తీసికొని పోవడం జరిగింది‌. ఈ అంశంపైన సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని వారు హమీ ఇవ్వడం జరిగింది‌. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇస్తున్న సందర్భంలో, సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ చేపడతామని ప్రకటించడాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆహ్వానించింది.

ఆంగ్లేయుల కాలం నుండి వందేళ్ళు గా సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంశం రాయలసీమ ప్రజానీకాన్ని ఆశల పల్లకిలోనే ఊరేగిస్తున్నది.‌ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు వెలుగులను అందించే సిద్దేశ్వరం అలుగు నిర్మాణంను రాజకీయ దృఢ సంకల్పంతో అత్యంత త్వరగా చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. రాయలసీమ, నెల్లూరు జిల్లాలో 15 లక్షల ఎకరాలకు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం , తెలంగాణ జిల్లాలలో 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సక్రమంగా నీరందించడంలో శ్రీశైలం రిజర్వాయర్ కు అత్యంత ప్రాధాన్యత ఉంది. అందువలన ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శ్రీశైలం రిజర్వాయర్ లో పూడిక చేరడాన్ని నివారిస్తూ రిజర్వాయర్ జీవిత కాలాన్ని పెంచడానికి తక్కువ పెట్టుబడితో, అత్యంత తక్కువ సమయంలో నిర్మించడానికి ఆస్కారం ఉన్న సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిద్దేశ్వరం అలుగు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి, వెలుగులు నింపే కార్యక్రమం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆశిస్తున్నారు.


Tags:    

Similar News