ప్రధాని మోదీకి షర్మిల స్పెషల్ గిఫ్ట్..

కడపలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రధాని మోదీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నలు కురిపించారు. అంతేకాకుండా మోదీకో స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు.

Update: 2024-05-08 07:12 GMT
Source: Twitter

ఆంధ్రలో ఎన్నికల పండగకు ఎంతో సమయంలో లేదు. దీంతో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కూడా జోరుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీకి.. ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ‘‘ప్రతి ఆదివారం మీ మన్‌ కీ బాత్ ఆంధ్రలు వినడం కాదు. ఆంధ్ర ప్రజల మన్‌ కీ బాత్ మీరు కూడా వినండి’’ అంటూ ప్రధాని మోదీకి షర్మిల ఓ రేడియోను బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత కూడా ప్రధాని మోదీకి లేదంటూ ఈరోజు ఉదయం కడపలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ముందు క్షమాపణలు చెప్పండి

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రధాని మోదీ, ఆయన నేతృత్వంలోని బీజేపీ చేసిందేమీ లేదని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో ఆంధ్రులపై మరోసారి కపటప్రేమ కనబరుస్తున్నారంటూ ధ్వజమెత్తారు షర్మిల. ‘‘ఆంధ్రలో ఎన్నికల ప్రచారంలో చేయాలంటే అంతకన్నా ముందు రాష్ట్ర ప్రజలకు క్షమాణలు చెప్పండి మోదీ. ఎన్నికలు అంటే ఎన్నిసార్లు మీరు వచ్చారు. మీ పార్టీ నేతలు ఎందరో వచ్చారు. కానీ అభివృద్ధి కోసం మీ పార్టీ నేత ఒక్కరైనా ఆంధ్రకు విచ్చేశారా?’’ అని ప్రశ్నించారామే. అంతేకాకుండా ప్రధాని మోదీపై ప్రజల తరపున తాము ఛార్జ్‌షీట్ ఇస్తున్నామని, దమ్ముంటే ఇప్పుడైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అఫిడవిట్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. దాంతో పాటుగా పదేళ్లలో మోదీ చేసిన మోసాలకు తాను పది ప్రశ్నలు సంధిస్తున్నామని వెల్లడించారు.

షర్మిల పది ప్రశ్నలు

1) నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మాటమార్చి వెన్నుపోటు పొడిచారు. ఎందుకు?

2) జగన్ టెండరింగ్‌ను ఎందుకు అడ్డుకోలేదు. తద్వారా మీరు పోలవరం వినాశానికి నాంది పలికారు, ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే కుట్రలు కూడా చేస్తున్నారు.

3) మీ చేతులమీదుగా భూమిపూజ జరిపించుకున్న అమరావతి రాజధాని పదేళ్ల తర్వాత కూడా పూర్తి కాలేదు?

4) పోరాటాలు, ప్రాణార్పణ ద్వారా సాకారమైన విశాఖ ఉక్కును, అక్కడి సెంటిమెంటుకు విరుద్ధంగా అమ్మేద్దామని చూస్తూ, మళ్ళీ విశాఖ మీద దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారు ఎందుకు?

5) కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటివి వాటితోపాటు విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను తుంగలోతొక్కి, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారు?

6) మీ దత్తపుత్రుడు మద్యం సిండికేటు నడుపుతూ, కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా మీరు ఉలకలేదు, పలకలేదు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు మరి ఇక్కడ మాత్రం ఎటువంటి చర్యలు లేవు. కారణం ఏంటి?

7) దేశంలో ఎస్సీ, ఎస్టీల రేజర్వేషన్లను అంతం చేయటానికి పూనుకున్నారు కానీ రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా, మీ కమీషన్లకు ఫిర్యాదులు చేస్తున్నా, మీరు రాష్ట్ర సర్కారును ప్రశ్నించలేదు, చర్యలకు ఉపక్రమించలేదు.. ఎందుకు?

8) ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, దొంగదారిలో రాష్ట్రం చేస్తున్న అప్పులు, కేంద్ర ఇచ్చే నిధుల మళ్లింపు, ఇలా ఎటు చూసినా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా, కేంద్రం నుండి ఎటువంటి చర్యలు లేవు

9) కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చి, చేతకాక, శాంతిభద్రతల సమస్యంటూ బెదిరి వెనుతిరిగింది. ఈ విషయంలో మీ సర్కారు మిన్నకుండి కూర్చోవటం యావత్ దేశానికే అవమానం

10) దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాటయిచ్చి, మాట తప్పి, దేశ యువతను, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారు.

Tags:    

Similar News