ప్రెస్‌మీట్‌లోనే బోరుమన్న సుగుణమ్మ.. ‘ వాళ్లకెలా మద్దతిస్తాం..?’

తిరుపతి టికెట్‌ను జనసేనకు కేటాయించడంపై చంద్రబాబు పునరాలోచన చేయాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కోరారు. ప్రెస్‌మీట్లోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు..

Update: 2024-03-25 15:36 GMT
Source: Twitter


ఆంధ్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీల్లో కూడా టికెట్లు తమకే వస్తాయని ధీమాగా ఉన్న నేతల గుండెల్లో కూడా గుబులు పెరుగుతోంది. టికెట్ దక్కని నేతలందరూ పార్టీ మారిపోయి పక్క పార్టీలో టికెట్ అందుకుంటున్నారు. దీంతో తమకే టికెట్ అనుకున్న నేతలకు కూడా పార్టీలు మొండిచేయి చూపుతున్నాయి. ఈ పరిణామాల వల్లే అన్ని పార్టీల్లో అసమ్మతి కూడా పెరిగిపోతోంది. ఈ పరిణామాలను కొందరు నేతలు నిలదీస్తుంటే, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలబడటానికి సిద్ధమవుతున్నారు.
అధిష్టానాన్ని నిలదీయలేక, పార్టీ మారలేని వారు టికెట్ విషయంలో పార్టీ పునరాలోచన చేయాలని అధిష్టానాన్ని ప్రాధేయపడుతున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా నేత సుగుణమ్మ ఈ కోవలోకే వస్తున్నారు. తనకు ఈ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంపై ఆమె భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కోసం తానెంతో కష్టపడ్డానని గుర్తు చేశారు. తిరుపతి సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడాన్ని ఆమె తిరస్కరించారు.

కన్నీరు పెట్టుకున్న సుగుణమ్మ

2024 ఎన్నికల్లో తిరుపతి సీటును జనసేనకు కేటాయించి తనకు టికెట్ లేకుండా చేయడంపై సుగుణమ్మ భావోద్వేగమయ్యారు. అలా ఎలా చేస్తారంటూ కన్నీరు పెట్టుకున్నారు. తిరుపతి సీటు విషయంలో పునరాలోచన చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కోరారు. అందులోనూ తిరుపతి టికెట్‌ను వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి కేటాయించడాన్ని ఆమె తప్పుబట్టారు, ఇది తనకు తీరని అన్యాయం చేయడమేనంటూ ఆమె ప్రెస్‌మీట్‌లోనే బోరుమన్నారు.
‘‘తిరుపతి టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలి. పార్టీ కోసం నేను అహర్నిశలు శ్రమించాను. అటువంటి నాకు కాదని, సీటును వేరే పార్టీకి ఎలా కేటాయిస్తారు. ఇక్కడి విజయంపై చేసిన సర్వేలన్నీ ఏమయ్యాయి బాబు గారూ. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్లకి మద్దతు ఇవ్వాలంటే ఎలా. 2019 నుంచి వైసీపీతో పోరాడుతూనే ఉన్నాం. వాళ్లు దాడులు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా వెనకంజ వేయకుండా పోరాటాలు చేశాం. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వక్తికి మద్దతు ఇవ్వడానికి నేను అంగీకరించినా.. కేడర్ ఒప్పుకోవట్లేదు. పార్టీ కేడర్ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని తిరుపతి టికెట్ విషయంపై చంద్రబాబు మరోసారి పునరాలోచన చేయాలి’’అని టీడీపీ అధిష్టానాన్ని కోరారు సుగుణమ్మ.


Tags:    

Similar News