"సీమ"లో తొలి ఏకగ్రీవ ఎంపి

ప్రజల విశ్వాసం సంపాదిస్తే, బ్రహ్మరథం పడతారు. ఏకగ్రీవాలకు సహకరిస్తారు. రాయలసీమ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీ టిఎన్..

Update: 2024-04-26 11:59 GMT

(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: సేవాభావం.. ప్రజల్లో విశ్వసనీయత.. లక్షణాలు ఉన్న నాయకుడు జనం గుండెల్లో ఉంటారు. పాత తరం రాజకీయాలను ఒకసారి స్పర్శిస్తే రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి టిఎన్ విశ్వనాథరెడ్డి ఒకరు. ఆయనతో సహా దేశంలో చాలామంది ఏకగ్రీవంగా ఎన్నికై పార్లమెంటులో పాదం మోపారు. ప్రజలు అభిమానించిన నాయకులుగా గుర్తింపు పొందిన వారు సమాజంలో అదే విధంగా సేవలు అందించడం ద్వారా గౌరవ స్థానాన్ని పొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థి ముఖేష్ దలాల్ గత 12 ఏళ్లలో ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి ఈయన. తాజా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది.

కరువు గడ్డ నుంచి

వర్గ పోరు ఒకపక్క, కరువు పరిస్థితులు రాజ్యమేలుతున్న ప్రాంతం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తుంది. తంబళ్లపల్లికి చెందిన టిఎన్ విశ్వనాథరెడ్డి.. 1957లో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. ఈ నియోజకవర్గంలోనే కాదు. రాయలసీమ జిల్లాల నుంచి మొదట ఏకగ్రీవంగా ఎన్నికైన వారి జాబితాలో టీఎన్ విశ్వనాథరెడ్డి పేరు సంపాదించుకున్నారు. అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా ఎవరు నామినేషన్ దాఖలు చేయని స్థితిలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈయన పట్ల అందరూ ప్రత్యేక గౌరవాన్ని అభిమానాన్ని ప్రదర్శించేవారు. దీనికి తగినట్లుగానే ఆయన తమ సేవల ద్వారా ప్రజల్లో మమేకం అయ్యారు. అపరిచితుడు పార్లమెంటు స్థానం నుంచి ఎంవి గంగాధర శివ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకారం అందించినట్లు సమాచారం. ఆ తర్వాత 1957 లో కూడా సీఎం నరసింహారెడ్డి అందించిన సహకారంతో రెండోసారి రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు.

ఆయన కోవలోనే...

తొలితరం నాయకులకు, ప్రజాప్రతినిధులకు గౌరవ స్థానం ఉండేది. వారు కూడా ప్రజలతో అలాగే మెలిగేవారు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో టిఎన్ విశ్వనాథరెడ్డితో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి స్వతంత్ర ఎంపీలుగా గెలిచినవారు ఉన్నారు. 1951 నుంచి ఇప్పటివరకు పోటీ చేయకుండానే ఎన్నికైన ఎంపీల సంఖ్య దాదాపు 35కు చేరుకున్నట్టు సమాచారం. వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులే ఉన్నారు. 2012 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పార్లమెంటు రికార్డుల ప్రకారం 1957 లో ఏడుగురు అభ్యర్థులు పోటీ లేకుండానే లోక్‌సభలో అడుగు పెట్టారు. 1951, 1967లో ఐదుగురు, 1962లో ముగ్గురు, 1977లో ఇద్దరూ, 1971, 1980, 1989లో ఒక అభ్యర్థి గెలుపొందారు. వారిలో వైబి చవాన్, ఫరూక్ అబ్దుల్లా, హరే కృష్ణ మహతాబ్, టిటి. కృష్ణమాచారి, పీఎం సయీద్, ఎస్సీ జమీర్ వంటి ప్రముఖ నేతలు ఉన్నారు. కానీ ప్రస్తుతం రాజ్యమేలుతున్న డబ్బు ప్రభావం వల్ల పోటీ తీవ్రమైంది. ఆదర్శవంతమైన సేవలు అందించిన నాయకులు పుట్టిన గడ్డ నుంచి వచ్చిన నేటి తరం ప్రజాప్రతినిధులు పట్టు సాధించుకోవడానికి తాపత్రయపడుతున్నారు.

Tags:    

Similar News