గురుకులాల నిధులపై రేవంత్ మాటలు ఉత్తుత్తివేనా..!

గురుకులాలకు చాలీ చాలని నిధులను కేటాయించడంపై హరీష్ రావు ఆగ్రహం.

Update: 2025-10-14 09:54 GMT

గురుకులాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి.. వివక్ష పాటిస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కమీషన్లు రావనే గురుకులాలకు కావాల్సినన్ని నిధులు కేటాయించడం లేదా? అని ప్రశ్నించారు. గురుకులాలకు గ్రీన్ ఛానెల్‌లో నిధులను విడుదల చేస్తామన్ని రేవంత్ మాటలు ఉత్తిత్తివే అని స్పష్టం అయిందంటూ చురకలంటించారు. హామీలతో మభ్యపెట్టడం, ఆ తర్వాత మాట మార్చడం రేవంత్ స్టైల్ అయిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ రేవంత్ మాటలకు, చేతలకు పొంతన ఉండదు అనడానికి గురుకులకు కేటాయించిన చాలీ చాలని నిధులు మరో ఉదాహరణ. రాష్ట్రంలోని 1024 గురుకులాలకు కేవలం 60 కోట్లు కేటాయించి, గోరంతను కొండంతగా చెప్పుకోవడం సిగ్గుచేటు’’ అని హరీస్ పేర్కొన్నారు.

‘‘రూ. 12 వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి.. ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు చదివే గురుకులాలకు కనీసం రూ. 100 కోట్లు కేటాయించే మనసు రాలేదా? కమీషన్లు రావనే గురుకులకు నిధులు కేటాయించడం లేదా? మీరు కేటాయించిన చాలీచాలని నిధులతో సిబ్బంది వేతనాలు, మోటార్ల మరమ్మతులు, అత్యవసర పనులు ఎలా సాధ్యం? చిత్తశుద్ధి లేని సమీక్షలతో గురుకులాలకు ఏం ప్రయోజనం? ఒకవైపు సమస్యల వలయంలో గురుకులాలు కొట్టుమిట్టాడుతుంటే తూతూ మంత్రంగా సమీక్ష నిర్వహించడం దుర్మార్గం’’ అని అన్నారు.

‘‘గురుకులాలకు నిత్యవసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు? పెండింగ్ లో ఉన్న మెస్ చార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు, స్టిచ్చింగ్ ఛార్జీలు ఎప్పుడు చెల్లిస్తారు? అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు అద్దె బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? నెలలుగా పెండింగ్ లో ఉన్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారు? మీరు కేటాయించిన చాలీచాలని నిధులతో ఈ సమస్యలకు పరిష్కారం ఎలా చూపుతారు? గణితం ఉపాధ్యాయులు నియమించాలని నిన్న మెదక్ జిల్లా చేగుంట గురుకులం విద్యార్థులు రోడ్డెక్కారు? పురుగులన్నం మాకొద్దు అంటూ నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు? గురుకులాల మీద ప్రభుత్వానికి పట్టింపు ఉంటే విద్యార్థులు ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నారు? బడి పాట పట్టాల్సిన విద్యార్థులను, ఆందోళన బాట పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం’’ అని దుయ్యబట్టారు.

‘‘రేవంత్ రెడ్డి మీ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతిని దిగజార్చారు. విష వలయాలుగా మార్చారు. అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. గ్రీన్ చానెల్ లో గురుకులాలు, వసతి గృహాల బిల్లులు చెల్లిస్తామన్న మాటలు ఇంకెప్పుడు కార్యరూపం దాల్చుతాయి? ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఏదో చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం వల్ల గురుకులాల్లో సమస్యలు తీరవు. గురుకులాల కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు, గురుకులాల అద్దె బకాయిలు, నెలలుగా పెండింగ్ లో ఉన్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు, మెస్, కాస్మొటిక్, స్టిచ్చింగ్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని, 22 నెలలుగా గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై అవసరమైన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News