ఆఫీస్ పాలిటిక్స్ కథ

'ఒక్కొక్క తలకూ ఒక్కొక్క వెల'సమీక్ష;

Update: 2025-06-27 11:47 GMT

ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ప్రస్తుతం మీరు ఉన్నట్టు ఉంటారని?

ఎక్కడో పుట్టి, ఏవో వాతావరణాల మధ్య పెరిగి.....

మీరు పుట్టిన చోట మాట్లాడే భాషలో,మీ వాతావరణానికి తగ్గ సంభాషణా వస్తువులతో ఉన్న మీరు, అక్కడికి తగ్గ ఆహరం అక్కడి పద్ధతుల్లో తింటూ, అక్కడి వాతావరణానికి, తాహతుకి తగ్గ బట్టలు వేసుకుంటూ ఉన్న మీరు.....

హఠాత్తుగా .......

ఒక మహానగరంలో ఉద్యోగం కోసమో, అక్కడ మనుగడ కోసమో.....

మారిపోవడం.....ఎంతలా అంటే.....

మీ పాత మీరును మీరే అనాగరికంగా పరిగణించేంతగా.....!

ఈ కొత్త ‘పై పై మెరుగులే’ మీరు సాధించిన అభివృద్ధి అని..... మిమ్మల్ని మీరు ఎక్కడో ఒక చోట కోల్పోవడమే మీరు ఉన్న కల్చర్ కి ముఖ్యమని ......ఈ ద్వందాన్ని ఎప్పుడైనా అనుభవించారా? అలా అనుభవించలేదంటే మీరు అదృష్టవంతులు!ఎందుకంటే మీ కొత్త కల్చర్ మీ పుట్టుకతోనే మీతో ఉందని దాని అర్థం! అలా లేని వారు, పొట్ట చేత పట్టుకుని ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో ....ఎదో ఒక దాని కోసం.....జీవితాన్ని లోతుగా కాకుండా వేగంగా ఇంకా చెప్పాలంటే ఒక ఫాస్ట్ ట్రాక్ క్రైం థ్రిల్లర్ మోడ్ లో గడిపే సంస్కృతికి అలవాటు పడిపోవడంలో ఒక కిక్ ఉంది ,కాదనలేడం లేదు ....కానీ ఆ కిక్ ‘ Slow Paced and deep’ మోడ్ కి దూరంగా ఉండటం వల్ల కావచ్చు! కొన్ని నచ్చడానికి కొన్ని సార్లు కారణం దానికి భిన్నమైనది మనం అనుభూతి చెందకపోవడమే! ఈ ద్వంద్వం గురించి ఒక విభిన్న రీతిలో చెప్పే కన్నడ నవలే ఎం.ఆర్.దత్తాత్రి గారి ‘ఒక్కొక్క తలకూ ఒక్కొక్క వెల.’ దీన్ని తెలుగులోకి రంగనాథం రామచంద్రరావు అనువదించారు. ‘ఛాయ’ ఈ పుస్తకం తెలుగు అనువాదాన్ని తీసుకువచ్చింది.

ఆశ్చర్యం ఏమిటంటే ఈ నవలను ఒక పక్కా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రాయడం. సాఫ్ట్వేర్ రంగం చూసే కన్నా గొప్ప ‘modern ,cultured and updated ‘లైఫ్ స్టైల్ ఎక్కడ ఉంటుంది? మనుషుల్లో తరాలను బట్టి ఆలోచనల్లో,క్రియల్లో వేగం ప్రత్యక్ష సంబంధకారిగా ఉంటుంది. జనరేషన్ మారుతుంది అంటే వారిలో అసహనం,వేగంగా అడ్రలిన్ రష్ పెరిగిపోతూ ఉండటమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి! ఈ మార్పును మనుషుల మూల జీవితం అంటే గత జీవితం నుండి ఇప్పటి వరకూ ఒక ఎవల్యుషన్ లా నవలగా దత్తాత్రి చెప్పడం గొప్పగా ఉంటుంది. అలాగే కథ బోర్ కొట్టకుండా మనుషులకు ఆసక్తికరంగా,సమకాలీనంగా ఉండే ఆఫీస్ పాలిటిక్స్ గురించి, ఆర్ట్ ఆఫ్ వార్ ను ప్రతిబింబిస్తూ, ఆధిపత్య పోరు ప్లే బుక్ ని అనుసరించి సాగే క్రీడలు, మధ్యతరగతి జీవితాల ఆశలు....ఇలాంటివెన్నో ఈ నవలను ఆసక్తికరంగా నడిపిస్తాయి.

ఈ కథలో ముఖ్యపాత్ర శివస్వామి. శివస్వామి ప్రభుత్వ సంస్థలో హెచ్ ఆర్ పొజిషన్ లో మూడు దశాబ్దాలకు పైగా పని చేసి రిటైర్ అవుతాడు. రిటైర్ అయ్యాక హాయిగా కొనుక్కున్న సొంత అపార్ట్మెంట్ లో తన భార్యతో హాయిగా ఉండాలనుకుంటాడు. కానీ ఆ బిల్డర్ నుండి సమస్యలు తలెత్తడంతో అదనంగా కొన్ని లక్షల రూపాయలు కట్టాల్సి రావడంతో, మళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. భార్య కూతురి ప్రసవం కోసం విదేశం వెళ్ళాల్సి రావడం, కొడుకు కూడా విదేశాల్లోనే చదువుకుంటూ ఉండటంతో; తన కొత్త అపార్ట్మెంట్ కడుతున్న దగ్గరే ఇల్లు అద్దెకి తీసుకుంటాడు. డిటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ కి స్నేహితుడి రిఫరెన్స్ మీద వెళ్ళడం, వారికి శివస్వామి ఏ విషయంలోనూ నచ్చకపోవడం; అదే విషయం శివస్వామికి స్పష్టం అయిపోవడం జరుగుతుంది.

ఈ కంపెనీకి ఒక కథ ఉంది. దీని యజమాని ధావల్. ఆయన మిత్రుడు దీపక్ జైన్ కలిసి దాన్ని ప్రారంభిస్తారు. అది లాజిస్టిక్ కంపెనీ. తర్వాత మెడికల్, ఇంజనీరింగ్,సాఫ్వేర్ సర్వీసెస్ కి కూడా విస్తరించబడింది. ధావల్ కొడుకు రవిరాజ్ కి సాఫ్ట్వేర్ విడిగా పెద్ద సంస్థగా చేసి,దానికి తను యజమానిగా ఉండాలని కోరిక.అసలు దాన్ని విడిగా చేయడం ధావల్ కి ఇష్టం లేదు. ఈ ఇద్దరి మధ్య జనరేషన్ గ్యాప్ వల్ల,అభిప్రాయ భేదాల వల్ల నడుస్తున్న ప్రత్యక్ష యుద్ధంలో శివస్వామి ఒక పావు అవుతాడు. రవిరాజ్ ప్యానెల్ రిజెక్ట్ చేసిన శివస్వామిని ఆటను హెచ్ ఆర్ డైరెక్టర్ గా తీసుకుంటాడు. ఇది నిజ జీవితాల్లో జరగకపోవచ్చు.ఎమోషనల్ డెసిషన్స్ తీసుకునే సంస్థ అధిపతులు అరుదు. కానీ ఈ నిర్ణయాన్ని సమర్థించడానికి రచయిత ధావల్ మనస్తత్వాన్ని చిత్రీకరించిన తీరు,దాని ద్వారా ‘ఒక దాన్ని సొంతం అనుకోవడానికి ఉండే మూలాలు, దాని నుండి బయటపడటం’ అనే దశలని అటు కుటుంబానికి, ఇటు వ్యాపారానికి వర్తిస్తూ, ధావల్-శివ స్వామి మధ్య సంబంధాన్ని ‘అవుట్ ఆఫ్ బిజినెస్’ గా బలంగా నిర్మించడం; ఇంకోవైపు దీనికి విరుద్ధమైన సాఫ్ట్వేర్ బిజినెస్ సైకాలజీని కూడా సమంతారంగా చెప్పడం ఈ నవలకు బలాన్నిచ్చింది.

యుద్ధంలో బలబలాలే ముఖ్యం. ఈ కుటుంబ వ్యాపార యుద్ధం కూడా దానికి తక్కువేం కాదు. మనుషులు ఎక్కడైనా ఒక్కటే ప్రపంచం మొత్తంలో అంటారు కానీ ఆ మనుషులలో పోలికలను,సామిప్యతను కూడా తరాల వారిగానే లెక్కించాలి. తరాలకు అనుగుణంగా జీవన విధానంలో నిర్ణయాలు తీసుకునే తీరులు విలువలు మారుతూ ఉండటం; వ్యాపారంలో తప్పు జరిగితే తమ బాధ్యత లేకుండా ఉండేలా చేతులు దులుపుకునే తెలివి కొత్త విలువలకు ఆపాదించబడటం వంటివన్నీ ఈ మారిన తరాల మధ్య వైరుధ్యాన్ని స్పష్టం చేస్తాయి ఈ నవలలో.

ఇక్కడ ఈ సంస్థలో అందరూ వ్యాపారం గురించి,దాని మీద యాజమాన్య హక్కుల గురించి ఆలోచించేవారే. కానీ వారిలో కూడా అంతర్ముఖంగా ఆ వ్యాపారం తమ చేతుల్లో ఉండి, తమ అస్తిత్వాన్ని నిలిపినంతవరకు వారి కుటుంబ జీవితంలో తప్పులు, నిర్లక్ష్యాలు గుర్తుకు రావు.ఆ మరపు కోసమే;ఆ వ్యాపారం కోసం తాము కోల్పోయింది ఏమిటో తెలియకుండా ఉండటం కోసమే యజమానులు వృద్ధాప్య దశలో కూడా ఓనర్ షిప్ కోసం ఆరాట పడతారు. ఆ వ్యాపారంలో మిత్రుడైన దీపక్ ని ప్రేమించినంతగా ధావల్ తన భార్యను కూడా ప్రేమించి ఉండడు అని రచయిత చెప్తాడు; అతని మరణం అతన్ని ఎంతగానో క్రుంగదీస్తుంది; దీన్ని స్నేహంగా కన్నా వ్యాపారంలో భాగం ఏర్పడిన బంధంగా చూడొచ్చు,కాకపోతే ఇది ఆత్మియమైనది.అందుకే ఆ స్థానంలో ఇంకొకరి కోసమే శివస్వామిని ఆయన ఎన్నుకుని ఉండొచ్చు. అయితే శివస్వామి పూర్వ జీవితం ఏంటి?దానికి కూడా కొంత తాత్విక నేపథ్యాన్ని రచయిత జోడించారు. చివరకు అంతా సుఖాంతమవుతుంది.

లోతుగా జీవితాన్ని గురించి, విలువలను గురించి ఆలోచించేవారు; గాఢమైన బంధాలకు, వాతావరణానికి ప్రాధాన్యత ఇచ్చేవారు; నిజంగా ఈ వేగవంతమైన మార్పులను ఎలా చూస్తున్నారు? మనలో ఆ ‘లోతైన మనిషి’ ఇలాంటి వాటికి ఎలా స్పందిస్తున్నాడు?అసలు వాడు బతికే ఉన్నాడా? ఈ వేగంలో చచ్చిపోయి, వేరే వారిలో వాడిని ఎప్పుడో ఓ సారి వెతుక్కుంటున్నామా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ నవల చదివాక మిమ్మల్ని తప్పక వెంటాడతాయి. లేదు, ఈ లోతుపాతుల కన్నా ఈ వేగంలో పడి దేని గురించి ఆలోచించలేనంత మారిపోయాం అనుకుంటే ఈ నవల మీ మీద చూపే ప్రభావం పెద్దగా ఏమి ఉండదు!కనీసం మీరు ఏ వర్గానికి చెందిన వారో అన్న విషయం మీదనైనా స్పష్టతను ఇస్తుంది!

* * *


Full View


Tags:    

Similar News