కేదార్‌నాథ్, హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వేలకు ఆమోదం..

ఉత్తరాఖండ్‌లో రెండు రోప్‌వే ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. ఇవి పూర్తయితే.. కేదార్‌నాథ్, హేమ్‌కుండ్ సాహిబ్‌కు చేరుకునే ప్రయాణ సమయం తగ్గుతుంది.;

Update: 2025-03-06 12:43 GMT
Click the Play button to listen to article

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న రెండు రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవి పూర్తయితే కేదార్‌నాథ్, హేమ్‌కుండ్ సాహిబ్ వెళ్లే భక్తుల ప్రయాణ సమయం తగ్గుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం తెలిపారు.

సోనప్రయాగ్-కేదార్‌నాథ్ రోప్‌వే గురించి...

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ద్వారా రెండు రోప్‌వే ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. శివుడి ఆలయం కేదార్‌నాథ్‌(Kedarnath), అలాగే హేమ్‌కుండ్ సాహిబ్ (Hemkund Sahib) దర్శనానికి ఈ రోప్‌వేలు సౌకర్యవంతమైన, వేగవంతమైన మార్గాలు అని పేర్కొన్నారు."గొండోలా" సాంకేతికతతో రూపొందుతున్న ఈ రోప్‌లో ద్వారా ఒకేసారి 36 మంది ప్రయాణించవచ్చని తెలిపారు.

ప్రస్తుతం సోనప్రయాగ్ నుంచి గౌరికుండ్ వరకు 5 కి.మీ రోడ్డు మార్గం ఉంది. అక్కడి నుంచి కేదార్‌నాథ్ వరకు 16 కి.మీల నడకదారి ఉంది. రోప్‌వే పూర్తయితే మొత్తం ప్రయాణ దూరం 12.9 కి.మీ.కి తగ్గతుంది. ప్రస్తుతం 8-9 గంటలు పట్టే ప్రయాణం రోప్‌వే ద్వారా కేవలం 36 నిమిషాలే పడుతుంది. ఆరు నెలల పాటు మాత్రమే కేదార్‌నాథ్ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో భక్తులు దర్శనానికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం దోహదపడుతుంది. ఇకనుంచి మాన్సూన్‌ కంటే ముందు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

గోవిందఘాట్-హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే గురించి..

కేవలం సిక్కు భక్తులకు మాత్రమే కాకుండా, పుష్పాల సముదాయంగా పేరుగాంచిన వాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు చేరుకునేందుకు హేమ్‌కుండ్ సాహిబ్‌ రోప్‌వే ఉపయోగపడుతుంది.

పెరగనున్న దర్శన సమయం..

గోవిందఘాట్-ఘంగారియా మొత్తం - 10.55 కి.మీ. ఘంగారియా-హేమ్‌కుండ్ సాహిబ్ - 1.85 కి.మీ. ప్రస్తుతం 4-5 గంటల పాటు మాత్రమే హేమ్‌కుండ్ సాహిబ్‌ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అయితే రోప్‌వే(Ropeways) నిర్మాణం పూర్తయితే రోజుకు 10 గంటల పాటు దర్శన సమయం పెరుగుతుంది.

అంచనా వ్యయం..

కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్ ఖర్చు: రూ. 4,081 కోట్లు..

హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే ప్రాజెక్ట్ ఖర్చు: రూ. 2,730 కోట్లు

ఈ రెండు ప్రాజెక్టులు ఆరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) పనులు చేపట్టనుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో పూర్తిచేసే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెలలోనే టెండర్లకు పిలవనున్నారు. 

Tags:    

Similar News