ఆగస్టు 3న NEET-PG ఎంట్రెన్స్ టెస్ట్..
ఒకే షిప్టులో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సుప్రీం ఆదేశం..;
నీట్-పీజీ(NEET-PG) 2025 ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ఒకే షిప్టులో నిర్వహిస్తున్నట్లు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (NBE) పేర్కొంది.
ఈ ఎంట్రెన్స్ టెస్టు రెండు షిఫ్ట్ల్లో ఉంటుందని వెలువడిన NBE ప్రకటనపై కొంతమంది సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటీషన్ దాఖలు చేశారు. ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని పిటీషనర్లు కోరారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
దేశవ్యాప్తంగా 2.42 లక్షల మంది అభ్యర్థులకు సింగిల్-షిఫ్ట్లో పరీక్ష నిర్వహించడం వల్ల లాజిస్టికల్ సమస్యలు ఎదురవుతాయని NBE తన పిటిషన్లో పేర్కొంది. పిటీషనర్ల తరపు న్యాయవాది వాదనను విన్న కోర్టు ఎన్బీఈ వాదనను తోసిపుట్టింది. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించడం వల్ల రెండు ప్రశ్నపత్రాలు ఎప్పటికీ ఒకేవిధమైన కాఠిన్య లేదా సులభ స్థాయిని కలిగిఉండవని అభిప్రాయపడింది. పోటీ తీవ్రత దృష్ట్యా ప్రతి మార్కూ ర్యాంకు నిర్దరణలో అత్యంత కీలకమేనని తెలిపింది. అందుకే ఒకే షిఫ్ట్లో పరీక్ష ముగించాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో పరీక్ష ఒకే షిఫ్టులో జరపడానికి మరింత సమయం కావాలని బోర్డు కోరింది. వాస్తవానికి ఈ పరీక్ష జూన్ 15న జరగాల్సి ఉంది. ఈ రోజు విచారణలో ఆగస్టు 3వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని NBE కోర్టుకు తెలిపింది. నీట్ పీజీ-2025 పరీక్ష ద్వారా ఎంఎస్ కోర్సులో 12,690, ఎండీ కోర్సులోని 24,360, పీజీ డిప్లొమా కోర్సులోని 922 సీట్లను భర్తీ చేయనున్నారు.