ఉత్తరాఖండ్లో కూలిపోయిన హెలికాప్టర్..
కేదార్నాథ్ నుంచి గుప్త్ కాశికి వెళ్తుండగా ప్రమాదం - పైలెట్ సహా ఏడుగురు మృతి - మృతులో రెండేళ్ల బాలుడు.;
అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన ఘటన మరువకముందే మరో దుర్ఘటన చోటుచేటుకుంది. ఉత్తరాఖండ్(Uttarakhand)లో ఓ హెలికాప్టర్(helicopter) ప్రమాదానికి గురైంది. కేదార్నాథ్(Kedarnath) ఆలయం నుంచి గుప్త్ కాశికి ప్రయాణికులను తీసుకెళ్లున్న హెలికాప్టర్ ఆదివారం (జూన్ 15) కూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడుగురు మరణించారు. మృతుల్లో ఒకరు పైలెట్కాగా.. మిగతా ఆరుగురు ప్రయాణికులు. వీరిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.
ఎగిరిన 10 నిముషాలకే..
హెలిప్యాడ్ నుంచి ఎగిరిన 10 నిమిషాలకే గౌరికుండ్, సోన్ప్రయాగ్ మధ్య హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన తెల్లవారుజామున 5:20 గంటలకు జరిగిందని ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ (UCADA) ధృవీకరించింది.
మృతుల వివరాలు..
హెలికాప్టర్లో పైలెట్తో కలిసి మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మహారాష్ట్రలోని యావత్మల్కు చెందిన జైస్వాల్ కుటుంబానికి చెందిన రాజ్కుమార్ సురేష్ జైస్వాల్, శ్రద్ధా జైస్వాల్ వారి రెండేళ్ల కొడుకు కాశీ రాజ్కుమార్ జైస్వాల్ ప్రాణాలొదిలారు. మిగతా ముగ్గురిలో ఒకరు ఉత్తరాఖండ్కు చెందిన విక్రమ్ సింగ్ రావత్గా, ఇద్దరు ఉత్తరప్రదేశ్కు చెందిన వినోద్ దేవి (66), ఉత్తరప్రదేశ్కు చెందిన తుష్టి సింగ్ (19)గా గుర్తించారు. పైలట్ కెప్టెన్ రాజ్వీర్ సింగ్ చౌహాన్గా గుర్తించారు. సాంకేతిక సమస్య లేదంటే ప్రతికూల వాతావరణే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
మార్గమధ్యంలో రెస్క్యూ బృందాలు..
పశువులకు మేత తీసుకొచ్చేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన స్థానికులు హెలికాప్టర్ కూలిపోవడాన్ని చూశారు. ఇటు సమాచారం అందుకున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) హెలికాప్టర్ కూలిపోయిన ప్రాంతానికి చేరుకుంటున్నాయి.
సీఎం దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతికి లోనయ్యారు. " ఇది చాలా బాధాకర వార్త. రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ కూలిపోయింది. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఈ రోజు, రేపు హెలికాప్టర్ సేవలు నిలిపేస్తున్నాం. SDRF, స్థానిక అధికారులు, ఇతర రెస్క్యూ బృందాలు ఘటనా ప్రాంతానికి చేరుకుంటున్నారు." అని ఎక్స్లో పోస్టు చేశారు.
కమిటీ ఏర్పాటు..
ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు హెలికాప్టర్లలో సాంకేతిక వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి ధామి(CM Pushkar Singh Dhami) ఆదేశించారు. పైలెట్లు వాతావరణ పరిస్థితులను కూడా తెలుసుకోవాలని కోరారు. SOPని సిద్ధం చేసే సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ కమిటీ గతంలో జరిగిన ప్రమాదాలపై కూడా విచారణ జరిపి నివేదిక ఇవ్వనుంది.
హైవేపై ల్యాండయిన హెలికాప్టర్..
కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మే 2న తెరిచారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తారు. కొంతమంది భక్తులు కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్త్ కాశికి హెలికాప్టర్లో చేరుకుంటారు. జూన్ 7న కేదార్నాథ్కు బయల్దేరిన హెలికాప్టర్లో టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉత్తరాఖండ్లోని ఒక హైవేపై అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తున్ ఐదుగురు యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. పైలట్కు స్వల్ప గాయాలయ్యాయి.