దేశానికి బహుభాషా విధానమే రైటన్న పవన్ కల్యాణ్

భారతదేశానికి బహుభాషా విధానమే రైటని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన కల్యాణ్ అన్నారు.;

Update: 2025-03-14 16:45 GMT
భారతదేశానికి బహుభాషా విధానమే రైటని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన కల్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై హిందీని రుద్దుతోందన్న విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. మార్చి 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జరిగిన జనసేన ఆవిర్భావ/విజయకేతన సభను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తమిళ కవితతో ప్రారంభించి తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అభినందలు తెలిపారు. 2024 ఎన్నికల్లో వంద శాతం స్ట్రైకింగ్ రేటుతో జనసేన నిలిచిందని, జీరో నుంచి వంద శాతం గెలుపు సాధించామన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన జనసైనికులకు మనసు లోతుల్లోంచి ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. మహాకవి దాశరధి రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని ప్రస్తావించారు. తన ప్రస్థానం తెలంగాణ నుంచే ప్రారంభమైందన్నారు. తనకు కరెంట్ షాక్ తగిలి చనిపోయే దశకు చేరినపుడు కొండగట్టు ఆంజనేయ స్వామి కాపాడారని గుర్తుచేసుకున్నారు. తన ప్రాణాలను కాపాడిన తెలంగాణ నేలతల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు అన్నారు. తాను గెలిచినా ఓడినా తన వెంట నడిచిన జనసైనికులకి, జనసేన నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.
జనసేన వీరమహిళలు తన దృష్టిలో రాణి రుద్రమ్మలన్నారు. జనసేన ప్రేమికులందరికీ తాను రుణపడి ఉంటానని చెప్పారు. ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
రమణ మహర్షి పేరును ప్రస్తావిస్తూ తమిళంలో, చత్రపతి శివాజీ మహారాజ్ పేరును ప్రస్తావిస్తూ మరాఠీలో, కర్ణాటక నుంచి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ కన్నడంలో మాట్లాడారు.
భారతదేశానికి బహుభాషా విధానం మంచిదన్నారు. జనసైనికులు 450 మంది సినిమాలు నమ్మి ప్రాణాలు అర్పించలేదని సిద్ధాంతాలను నమ్మి ఇచ్చారన్నారు. "ఈరోజు మీకు డేటా చెప్పను. ఎన్డీఏ ప్రభుత్వం గురించి నిజం చెబుతా. నేను మీతోటి 11 సంవత్సరాలుగా నేను పడ్డ ఇబ్బందులు పంచుకుంటాను. నేను 2014లో ఒక్కణ్ణే కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనే రాజకీయ పార్టీ. చాలా కసరత్తు చేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చా. 2003లోనే నేను మా నాన్నకి చెప్పాను" అని చెప్పారు పవన్ కల్యాణ్.
తాను రాజకీయ పార్టీని పెట్టడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులను గుర్తు చేసుకున్నారు. గద్దర్, ఢిల్లీలో ఉండే ప్రొఫెసర్ శ్రీపతి రాముడు, బేతపూడి విజయ్ కుమార్ నిరంతర ప్రోత్సాహంతో పార్టీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తన వెన్నంటి ఉన్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి, పాలిటిక్స్ లో లేకపోయినా తానంటే ఇష్టం తోటి ఎప్పుడూ తన వెంట ఉన్న హరిప్రసాద్ కి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్టతకు తోడ్పడిన పంచకర్ల సందీప్ కి పోరాటం చేసిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Tags:    

Similar News