ఏపీ ఫైబర్ నెట్ ను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు

తన మీదున్న కేసులను మాఫీ చేయించుకునేందుకు ఏపీ ఫైబర్‌నెట్‌ను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని గౌతంరెడ్డి అన్నారు.;

Update: 2025-02-22 13:24 GMT

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ను లాభాల బాటలో నడిపిస్తే చంద్రబాబు కుట్రలు పన్ని నిర్వీర్యం చేశారని ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పూనూరు గౌతమ్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. 2014–19లో ఏపీ ఫైబర్‌నెట్‌లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారని, దీనిపై జరిపించామని, చంద్రబాబు అక్రమాలు, అవినీతిని నాడు సీఐడి నిరూపించిందని అన్నారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు సంతకాలతోనే అవినీతి చేశారని విమర్శించారు. ఫైబర్‌నెట్‌ ద్వారా ఇచ్చిన ప్రతి కాంట్రాక్టులోను నాడు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్నారు. దీనిని గుర్తించిన నాటి సీఎం జగన్‌ విచారణ జరిపించారని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అవినీతికి పాల్పడి చంద్రబాబు అరెస్టు అయ్యారన్నారు. తన మీదున్న కేసులను మాఫీ చేయించుకునేందుకు ఫైబర్‌నెట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫైబర్‌నెట్‌ను క్లోజయ్యే పరిస్థితికి తెచ్చింది చంద్రబాబే అని అన్నారు.

నేడు అధికారంలోకి వచ్చినా అవే రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మీద ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియా కేసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు సంస్థలకు అమ్ముడుపోయి ఏపీ ఫైబర్‌నెట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రూ. 190లకే ఇంటర్నెట్‌ ఇచ్చామన్నారు. సిగ్నల్‌ సమస్యలు లేకుండా నెట్‌ ఇచ్చాన్నారు. ఇంజనీరింగ్‌ కళాశాలతో పాటు పలు విద్యా సంస్థలకు కూడా కనెక్షన్లు ఇచ్చామన్నారు. దీంతోనే తమ హయాంలో ఫైబర్‌నెట్‌ సంస్థ లాభాల బాటలో నడిచిందన్నారు. ఏడాదికి రూ. 1,000 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల వరకు ఆదాయంతో సంస్థను నడిపామన్నారు. దీంతో పాటుగా 20లక్షల బాక్సును కేంద్రం నుంచి ఉచితంగా వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. వీలైతే ఫైబర్‌నెట్‌కు ఆదాయం పెంచాలి కానీ నాశనం చేయొద్దని సూచించారు.
Tags:    

Similar News