తాజా.. మాజీల.. మధ్య పోటీ… విజేత ఎవరో..?

ఇద్దరు రాజకీయ ఉద్దండులు… ఒకరు తాజా మంత్రి.. మరొకరు మాజీ మంత్రి.. ఇద్దరూ ఎన్నికల బరిలో దిగారు... విజయం ఎవరిని వరిస్తుందో మరి..?

Update: 2024-04-11 12:51 GMT
Source: Twitter

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో అందరి చూపు ఆ నియోజకవర్గం పైనే పడింది...అక్కడ ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు రాజకీయ ఉద్దండులు గెలుపు కోసం ఎన్నికల బరిలోకి దిగారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల తరపున పోటీ చేస్తున్న వారు... ఒకరు తాజా మంత్రి అయితే మరొకరు మాజీమంత్రి. ఇద్దరూ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో తమ తమ ప్రత్యేకతను చాటుకున్నవారే.. ఇప్పుడు వారిద్దరి మధ్య భీకర ఎన్నికల పోరుకు తెరలేచింది. ఇప్పటికే నేను ఎవరి గురించి చెబుతున్నాను మీకు అర్థం అయిపోయి ఉంటుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఇద్దరూ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేతలే. వీరిద్దరి మధ్య పోరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తిగానే మారింది. అక్కడ అధికార, ప్రతిపక్షాలకు ఎవరి ఓటు బ్యాంక్ వారికుంటుంది. ఎవరి రాజకీయాలూ వారివే. హాట్ హాట్‌గా రాజకీయాలు సాగుతున్న ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ప్రజలు ఏ పార్టీకి జై కొట్టనున్నారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మంత్రి బొత్స ఇలాఖా...

విజయనగరం జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాఖాగా చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా జిల్లా నుంచి గెలుపొందారు. పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికై మంత్రి స్థాయి పదవులు కూడా చేపట్టారు. భారీ పరిశ్రమలు, రవాణా, మార్కెటింగ్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలు నిర్వహించిన ఈయన ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం. ఇక్కడ మొదటి నుండి టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నువ్వా–నేనా అన్నట్లు ఉంటాయి. పోటీలో ఎవరు ఉన్నా పార్టీ ఓటు బ్యాంక్ మాత్రం పదిలంగా ఉంటుంది. ఇక్కడ అధికార వైసీపీ నుంచి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఈయన మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో బలమైన నేత.1999 లో బొబ్బిలి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన బొత్స.. ఆ తరువాత 2004లో చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటినుండి ఈ నియోజకవర్గాన్ని తనకు పెట్టనికోటగా మార్చుకున్నారు. బొత్స 2004లో ఇక్కడ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అప్పటి నుంచి తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ, తనకంటూ ఒక బలమైన సొంత ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగారు. అనుకున్నది సాధించారు.

సిక్కోలు నుంచి చీపురుపల్లికి....

తెలుగుదేశం జనసేన, బిజెపిల కూటమి తరుపున మాజీ మంత్రి, మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బరిలో దిగుతున్నారు. 1983లో టీడీపీ నుంచి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కిమిడి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఉణుగూరు, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుండి ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వాణిజ్య పనులు, మున్సిపల్, హోం మంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా నుండి రాజకీయాలు నెరపిన కళా వెంకట్రావు తొలిసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణపై ఎన్నికల బరిలోకి దూకారు. ఇద్దరు రాజకీయ ఉద్దండులు పోటీకి దిగడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

చీపురుపల్లి హిస్టరీ...

చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం 1951 లో ఏర్పడింది. 1951లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి శాసనసభ్యులుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పోతుల గున్నయ్య ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా… ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ, రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు, ఒకసారి వైసీపీ అభ్యర్థి గెలుపొందారు.1955లో పిఎస్పీ తరఫున మోడండి సత్యనారాయణ రాజు, 1962లో కోట్ల సన్యాసి అప్పలనాయుడు ఎస్‌డబ్ల్యూఏ నుంచి, 1967లో టి రామారావు తంత్ర సభ్యుడుగా… 1972లో రౌతు పైడిమ నాయుడు కాంగ్రెస్ నుంచి, 1978లో చిగురిపల్లి శ్యామలరావు కాంగ్రెస్ నుంచి, 1983 లో త్రిపురాణ వెంకటరత్నం స్వతంత్ర అభ్యర్థిగాను, 1985 లో కింబూరి రామ్మోహన్ రావు , 1989లో టంకాల సరస్వతమ్మ , 1994లో తిరిగి 1999 లో గద్దె బాబురావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 2004,2009 లో బొత్స సత్యనారాయణ.. కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 2014లో కిమిడి మృణాళిని.. టిడిపి తరఫున, 2019లో బొత్స సత్యనారాయణ.. వైసీపీ తరఫున గెలుపు పొందరు. ప్రస్తుత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి తిరిగి పోటీ చేస్తుండగా.... టిడిపి నుంచి కిమిడి కళా వెంకట్రావు ఎన్నికల బరిలో ఉన్నారు.

ఎవరి బలం ఎంత...

విజయనగరం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్‌పి ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ఈ నియోజకవర్గం వారు కావడం బొత్స సత్యనారాయణకు బాగా కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ నియోజకవర్గ వైసీసీ ఇంచార్జ్‌గా చిన్న శ్రీను కొనసాగుతున్నారు. చిన్న శ్రీను నియోజకవర్గంపై బాగా గ్రిప్ ఉన్న నేత. అలా స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ముగ్గురు నియోజకవర్గ క్యాడర్‌ను ఏకతాటిపై నడిపిస్తూ వైసీపీని ఇక్కడ కంచుకోటగా మార్చారు. ఇక టిడిపి విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఒకప్పటి టిడిపి కంచుకోటగా చీపురుపల్లి పేరుగాంచింది. ఇప్పటికీ టిడిపి క్యాడర్ అలాగే ఉన్నప్పటికీ వర్గ పోరు టిడిపిని బలహీనపరుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇంచార్జిగా కిమిడి నాగార్జున కొనసాగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కిమిడి నాగార్జునకు టిక్కెట్ దక్కలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కిమిడి నాగార్జున అప్పటి నుండి నియోజకవర్గంలోనే ఉంటూ స్థానిక క్యాడర్‌తో పాటు ప్రజలతో మమేకమై రాజకీయాలు చేశారు. అయితే ఆఖరి క్షణంలో కిమిడి నాగార్జునను పక్కనబెట్టి కళా వెంకట్రావుకు టిక్కెట్ ఇచ్చింది అధిష్టానం. దీంతో కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. పలు ఆందోళనలు, నిరసనల రూపంలో తెలియజేశారు.

నాగార్జునకు టికెట్ ఇవ్వాలని క్యాడర్ సైతం పట్టుబట్టింది. నాగార్జున కూడా అంతే స్థాయిలో పార్టీపై, కిమిడి కళా వెంకటరావుపై విరుచుకుపడుతున్నారు. తమ సొంత పెద నాన్న అయినా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు. టిడిపి సీనియర్ నేతలు త్రిమూర్తుల రాజు, గద్దె బాబూరావులు రెండు వర్గాలుగా ఉన్నారు. వీరికి కొంత వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఇక్కడున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో పాటు ఇటు మరో రెండు వర్గాలు కళా వెంకట్రావుకు ఏ మేరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది.

ఓ వైపు రెండు దశాబ్దాలుగా చీపురుపల్లిలో ఎదురులేని రాజకీయం చేస్తున్న బొత్స, ఆయనకు అంతా తామై నడిపిస్తున్న ఎంపి బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనులు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తుంటే టీడీపీ మాత్రం వర్గపోరుతో సతమతమవుతుంది. అందులో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుండి చీపురుపల్లికి వచ్చి ఎన్నికల బరిలో దిగుతున్న కళా వెంకట్రావు ఈ ప్రతికూల పరిస్థితులను ఏ మేరకు చక్కదిద్దుకుంటారో చూడాలి. రెండు లక్షల మంది ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కాపు సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారు.

ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములు ఈ సామాజికవర్గ ఓటర్లే నిర్దేశిస్తారు. అయితే ఇక్కడ నుండి పోటీ చేసే అభ్యర్థులు ఇరువురు కాపు సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో కులాల ప్రస్తావన అంతగా రాదనే చెప్పాలి. ఏదిఏమైనా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి నుండి ఇద్దరు రాజకీయ ఉద్దండులు పోటీచేస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం పైనే ఇప్పుడు అందరి చూపులు ఉన్నాయని చెప్పాలి..

Tags:    

Similar News