ఏపీపై కేంద్రం సానుకూలం

ఏపీని అభివృద్ధి చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. నిధుల విషయంలోనూ సానుకూలత తెలిపింది. పారిశ్రామిక రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది.

Update: 2024-08-28 14:45 GMT

పోలవరం ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా పోలవరంపై సానుకూలంగా ఉన్నందున వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబునాయుడు చెప్పారు. బుధవారం ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించడమే మేలని నిపుణులు తేల్చారు. రూ.992 కోట్లతో కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మిస్తాం. 41.15 మీటర్ల ఎత్తుతో మొదటి దశ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్‌ చేసింది. ‘పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ ఏర్పాటు చేశారు. పోలవరం విషయంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు. పోలవరానికి కేంద్రం పెండింగ్‌ నిధులు ఇవ్వాలి. కేంద్రం ఇవ్వలేదని ఎప్పుడూ పోలవరం పనులు ఇప్పటి వరకు ఆపలేదు. ఇక ముందు కూడా ఆపేది లేదన్నారు.
రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోలవరం పనులకు గ్రహణం పట్టింది. 2021 నాటికి పోలవరం పూర్తి చేసి ఉండాలి. వైఎస్సార్‌సీపీ హయాంలో కేంద్రం రూ. 8వేల కోట్లు ఇచ్చింది, ఐదేళ్లుగా పురుషోత్తమపట్నం, పట్టిసీమను ఉపయోగించుకోలేదు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి మళ్లీ పోలవరాన్ని ట్రాక్‌లో పెట్టగలిగాం. ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలిగింది. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ధన్యావాదాలు. పోలవరం చాలా సున్నితమైన ప్రాజెక్టు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గోదావరిలో మునిగిన పోలవరం ఇప్పుడు మళ్ళీ గట్టెక్కింది. కేంద్ర సహకారంతో త్వరలోనే పూర్తి చేస్తాం.
దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్‌లు నిర్మిస్తుంటే ఏపీలో మూడు కారిడార్‌లు ఉన్నాయి. వీటిపై మొత్తం రూ. 28వేల కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్‌లు వస్తున్నాయి. కృష్ణపట్నంకు కూడా అనుమతిచ్చారు. నక్కపల్లికి ఫార్మా క్లస్టర్‌ కూడా వస్తోంది. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణమవుతాయని చంద్రబాబు అన్నారు.
Tags:    

Similar News