తమ్ముడు నాగబాబును అభినందించిన అన్నయ్య చిరంజీవి

ప్రజా సమస్యల మీద గళం విప్పాలి. వారి అభివృద్ధికి ఎల్లప్పుడు పాటు పడాలి. అంటూ నాగబాబుకు చిరంజీవి అభినందనలు తెలిపారు.;

Update: 2025-03-14 14:33 GMT

మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌లు రాజకీయ ప్రయోజకులయ్యారు. చిరంజీవి సినిమా వారసత్వంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఇద్దరు తమ్ముళ్లు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌లు అక్కడ కూడా ఓ వెలుగు వెలిగారు. ఇంకా వెలుగొందుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక నాయకులుగా మారారు. తాను ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చూపించిన దాని కంటే రెట్టింపు ప్రభావం ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని ఏర్పాటు చేయడంలోను, దానికి అధికారంలోకి తీసుకొని రావడంలోను పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్ర పోషించారు. తాజాగా నాగబాబును కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిని చేశారు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా చక్రం తిప్పారు. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో కూడా మంత్రిగా చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ తన సోదరుడు నాగబాబుకు అభినందనలు తెలిపారు.

చిరంజీవి ఏమన్నారంటే..
ఎమ్మెల్సీగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకు నా అభినందనలు, ఆశీస్సులు అంటూ ఆశీర్వదించారు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. సరిగ్గా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో చిరంజీవి తన సోదరుడు నాగబాబును అభినందిస్తూ పోస్టు పెట్టడం గమనార్హం. ప్రస్తుతం పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ భారీ జనసందేహం మధ్యలో జరుగుతోంది.
Tags:    

Similar News