ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో కుట్ర కోణం.. వదిలి పెట్టమన్న మంత్రి

విజయవాడను వరదలు ముంచెత్తిన క్రమంలో ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-09-09 09:34 GMT

విజయవాడను వరదలు ముంచెత్తిన క్రమంలో ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని వెనక భారీ కుట్ర ఉందని టీడీపీ నేతలు సహా అధికారులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని, అసలు బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన ఐదు బోట్లకు సంబంధించిన వివరాలు తెలపాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. ఈ ఐదు పడవల్లో మూడు భారీ పడవలు ఉన్నాయని, అవి ఇసుక తరలింపు కోసం వినియోగించేవని అధికారులు గుర్తించారు. ఇసుక తరలింపు కోసం వినియోగించే పడవలు ఒక్కోక్కటి దాదాపు 40-50 టన్నుల బరువు ఉంటుంది. వీటిని వరద సమయంలో ఉద్దేశపూర్వకంగానే సంరక్షించకుండా వదిలేసినట్లు సమాచారం ఉన్నట్లు అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఈ పడవలను ప్లాస్టిక్ తాళ్లతో కట్టి వదిలేయడం తమ అనుమానాలను బలపరుస్తున్నాయని, వరద వస్తున్నంటే పడవలను సంరక్షించకుండా యజమానులు ఎందుకు వదిలేశారో అర్థం కావట్లేదని, దీనిపై దర్యాపతు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఇదంతా సైకో జగన్ పన్నిన్న పన్నాగమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కుట్ర జరిగింది ఇలానే అంటూ వివరిస్తోంది.

కుట్ర వెనక ఉన్నది వారే

ప్రకాశం బ్యారేజీ గేట్లపైకి పడవలు వదిలిన కుట్ర వెనక పలువు వైసీపీ నేతల పాత్రలు ఉన్నాయంటూ టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ‘‘వైసీసీ కీలక నేత తలశిల రఘురాం బంధువులు, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ఈ కుట్రలో పాల్గొన్నారు. వరద వచ్చే ముందు రోజు ఉద్దండరాయుని పాలెం వైపు గట్టున ఉండే పదవలను గొల్లపూడి వైపుకు తరలించారు. భారీ పడవలకు ప్లాస్టిక్ తాళ్లతో లంగరు వేశారు. అలా కట్టొద్దని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోలేదు. అంతేకాకుండా ఒక్కో పడవను విడివిడిగా కట్టాల్సి ఉన్నా.. అలా కాకుండా ఒకే తాడుతో కలిపి కట్టారు. మొత్తం 5 పడవలు బ్యారేజ్‌ను ఢీ కొట్టేలా పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు. కానీ ఆ బోట్లు కౌంటర్ వెయిట్లని డ్యామేజ్ చేశాయి. అలా కాకుండా బ్యారేజ్ పిల్లర్లకు తగిలి ఉంటే కలిగే నష్టం ఊహకు కూడా అందదు. ఈ కుట్రలో తలశిల రఘురాం, నదిగం సురేష్ పాత్ర గురించి తెలియాలంటే వారి కాల్ డేటా, కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు చేయాలి. దీని వెనక ఉన్న అసలు సైకో మాస్టర్ మైండ్ బయటకు రావాలి’’ అని టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముమ్మరంగా దర్యాప్తు: నిమ్మల

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారాన్ని వదిలి పెట్టమని, అన్నదాతలకు నష్టం చేకూర్చాలని ప్రయత్నించిన వారిని చట్టపరంగా శిక్షించే వరకు నిద్రపోమంటూ మండిపడ్డారు. ఈ ఘటన వెనక కుట్ర కోణం ఉందని ప్రాథమిక నివేదికలు అందాయని, తమ స్వార్థం కోసం ఎంతో ఘనత ఉన్న బ్యారేజీకి నష్టం చేయాలని చూసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును ముమ్మరం చేయాలని, దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా వదిలి పెట్టొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు రామానాయుడు.

అందరిలో అదే అభిప్రాయం

‘‘ 1854 నుంచి 1952 వరకు దాదాపు 100 సంవత్సరాల పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు బ్యారేజీ సేవలందించిందని.. 1952 లో వచ్చిన వరదలకు బ్యారేజీ దెబ్బతినడంతో ప్రభుత్వం పునర్నిర్మాణం చేసి మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరును పెట్టడం జరిగిందన్నారు. ఆపై 1957 నుంచి దాదాపు 13.8 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా అందుతున్నాయి. ఈ బ్యారేజీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు వరప్రదాయనిగా నిర్విరామంగా సేవలందిస్తోంది. ఆ విధంగా పాత ఆనకట్ట వంద సంవత్సరాలు, కొత్త ఆనకట్టకు దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే దాదాపు 170 సంవత్సరాల ఘన చరిత్ర ప్రకాశం బ్యారేజీ కి ఉంది. 11,42,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చిన కీలక పరిస్థితిలో ఐదు పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం వెనుక కుట్ర కోణం ఉందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది’’ అని అన్నారు.

బోట్ల యజమాని అతడే..

‘‘ఘటనపై వాస్తవాలను వెలికి తీసేందుకు దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ సాగిస్తున్నాయి. ఒక్కొక్కటి 40-50 టన్నుల బరువున్న ఐదు పడవలు అధిక వరద వస్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లను దాటుకొని కౌంటర్ వెయిట్ ని బలంగా ఢీకొట్టడం జరిగింది. ఈ పడవలు గేట్లను గాని ప్రధాన కట్టడాన్ని గాని ఢీకొని ఉంటే ఐదారు జిల్లాలకు ఎంత నష్టం జరిగేదో ఊహించడానికి కష్టంగా ఉంది. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ శాఖ నుంచి పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కో బోటు విలువ రూ.40-50 లక్షలు ఉంటే.. అంతటి విలువైన 3 బోట్లను ఒకే ప్లాస్టిక్ తాడుతో కట్టడం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఇంతటి విలువైన పడవలను జాగ్రత్త చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే ఇలా బ్యారేజీని ఢీకొట్టేలా చేశారా అనే అనుమానాలు పెద్దఎత్తున వస్తున్నాయి. మొత్తం ఐదు పడవల్లో ఒక పడవ గేట్ల మధ్య నుంచి కిందకు వెళ్లిపోగా మూడు పడవలను గుర్తించడం జరిగింది. మరో పడవ ఆచూకీ తెలుసుకుంటున్నాం. గుర్తించిన మూడు పడవలకు యజమాని ఒకరే కావడం అనుమానానికి దారితీస్తోంది. ఈ పడవల యజమాని అయిన ఉషాద్రి.. కోమటి రామ్మోహన్ కు అనుచరుడిగా ఉన్నారు. ఈ రామ్మోహన్ తలశిల రఘురాంతో బంధుత్వం ఉండటం అనుమానాలకు తావిస్తోంది. గత ప్రభుత్వ అండదండలతో నందిగం సురేష్ వీరంతా సిండికేట్ గా ఏర్పడి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను అక్రమంగా లూటీ చేశారు. పడవలకు వైఎస్ఆర్ సీపీ రంగులు కూడా ఉండడం.. ఈ బోట్లు అధికారిక పార్టీకి సంబంధించినవి అని చెప్పేలా రంగులు వేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇలా దర్యాప్తులో ఒక్కో విషయం బయటకు వస్తోంది’’ అని వివరించారు.

రిస్క్ తీసుకోవట్లేదు

‘‘ప్రస్తుతం అనుభవజ్ఞులైన కన్నయ్య నాయుడు గారి నేతృత్వంలో కౌంటర్ వెయిట్లను ఐరన్ దిమ్మలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండు రోజుల్లోగా పనుల పూర్తికి కృషిచేస్తున్నాం. ఏ చిన్న రిస్కు కూడా తీసుకోకుండా ఈ పనులు చేపడుతున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరద ప్రవాహం వెళ్తుండగానే తుంగభద్ర డ్యామ్ గేటును బిగించిన పని కన్నయ్య నాయుడు నేతృత్వంలో జరిగింది. వరద ప్రవాహానికి గేటు కొట్టుకుపోతే రైతుల కళ్ళల్లో నీళ్లు చూశాను.. మళ్లీ తిరిగి గేటు అమర్చిన తర్వాత అదే రైతుల కళ్ళల్లో ఆనందం చూశానని ఆరోజు కన్నయ్య నాయుడు చెప్పారు. అందుకే ఆయన సూచనలు సలహాలతో ప్రకాశం బ్యారేజీ విషయంలో కూడా ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా చిన్న పొరపాటుకు తావు లేకుండా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ రెండు రోజుల్లో పనుల పూర్తికి కృషి చేయడం జరుగుతుంది. రాజకీయపరంగా కాకుండా ప్రకాశం బ్యారేజీ భద్రత పరంగా ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు’’ అని మంత్రి రామానాయుడు తెలిపారు.

Tags:    

Similar News