చెప్పు లేసింది.. తెరపైకి మాజీ డీజీపీ వివాదస్పద వ్యాఖ్యలు

సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోన్న మాజీ పోలీస్‌ బాస్‌ గౌతం సవాంగ్‌ వ్యాఖ్యలు.. గతంలో చంద్రబాబుపై దాడిని సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు;

Update: 2024-03-31 06:43 GMT

జి విజయ కుమార్ 

ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల కాన్వాయ్‌పై చెప్పులు విసరడం, రాళ్లు వేయడం, కర్రలతో దాడి చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కా.. అది భావప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. శనివారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌పై ఆగంతుకులు చెప్పులు విసరడంతో ఇదే తరహాలో చంద్రబాబుపై గతంలో చోటు చేసుకున్న ఘటనపై నాటి డీజీపీ గౌతం సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలు నేడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌ గా మారాయి. తాజాగా సీఎం జగన్‌పై చోటు చేసుకున్న ఘటనకు, గతంలో చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన సంఘటన, దానిపై నాటి డీజీపీ చేసిన వ్యాఖ్యలను లింకప్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

నాటి డీజీపీ గౌతం సవాంగ్‌ వ్యాఖ్యలు
చంద్రబాబు కాన్వాయ్‌ మీద అలా చేసిన వారు మనలాంటి పౌరులే.. ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంది, తమ తమ ఆలోచనలను, అభిప్రాయాలను, భావాలను వ్యక్తం చేసుకునే రైట్‌ వారికి ఉంది, దాడికి పాల్పడిన వారి మాట కూడా వినండి అంటూ నాడు ఆంధ్రప్రదేశ్‌కు పోలీస్‌ బాస్‌గా ఉన్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
నేడు తెరపైకి
అయితే అనంతపురం జిల్లాలో సీఎం జగన్‌పై దాడి సంఘటనను, గతంలో చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటలో ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు, కర్రలతో దాడి చేసిన సందర్భాన్ని, ఆ సంఘటనపై స్పందించి నాటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా తెరపైకి వచ్చాయి. నాడు గౌతమ్‌ సవాంగ్‌ డీజీపీ స్థాయిలో ఉండి మాట్లాడిన మాటలు నేడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
సీఎం జగన్‌పైకి చెప్పులు
అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక ఆర్టీసి బస్టాండ్‌ సమీపంలో తాను ప్రయాణిస్తున్న బస్సు నిల్చొని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయలో ఒక హఠాత్‌ పరిణామం చోటు చేసుకుంది. ఎవరో గుర్తు తెలియన వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు. అయితే ఆ చెప్పులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి తగల్లేదు. కానీ ఆయనకు సమీపం నుంచి వెళ్లాయి. ఊహించన ఈ పనిణామంతో అందరూ ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. సీఎం జగన్‌ కూడా నిశ్చేష్టులయ్యారు. అయితే అవి ఆయనకు తగలక పోవడంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. చుట్టూ భారీగా మోహరించిన పోలీసుల వలయంలో సీఎం ఉన్నా భద్రతా వైఫల్యం వల్లే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి
గత ఎన్నికల అనంతంరం 2019 నవంబరులో చంద్రబాబు అమరావతి పర్యట చేపట్టారు. అమరావతిలో నిలచిపోయిన నిర్మాణాలను పరిశీంచడంతో పాటు అమరావతి రైతులతో ముచ్చటించేందుకు వెళ్తున్న సమయంలో హైటెన్షన్‌ చోటు చేసుకుంది. ఒక వర్గం ఆయన కాన్వాయ్‌కు స్వాగతం పలుకగా మరో వర్గం నల్లబాడ్జీలు ధరించి గో బ్యాక్‌ అంటూ చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంత మంది ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడం, చెప్పులు వేయడం, కర్రలతో దాడికి పాల్పడం చేశారు.


Tags:    

Similar News