ఎన్జీరంగా ఎన్ని పార్టీలు పెట్టారో తెలుసా?

భారత రాజకీయాల్లో.. ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో ఆచార్య ఎన్జీ రంగా అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఎన్ని రాజకీయ పార్టీలు పెట్టారు.. రాజకీయాల్లో రంగా మార్క్‌ ఏమిటి?

Update: 2024-04-10 09:02 GMT

ఎన్‌జి రంగా అసలు పేరు గోగినేని రంగనాయకులు. ఈయన గుంటూరు జిల్లా నిడుబ్రోలు గ్రామంలో నవంబరు 7, 1900 సంవత్సరంలో జన్మించారు. జూన్‌ 9, 1995లో ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయారు. రంగా చరిత్ర ఇప్పటికీ.. ఎప్పటికీ ఆదర్శమే. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోను.. స్వాతంత్య్ర అనంతరం జరిగిన పరిణామాల్లో భారత పార్లమెంట్‌లో తన గళాన్ని విప్పి చెప్పాల్సింది చెప్పేవారు. చాలా కాలం వరకు నాటి కాంగ్రెస్‌ ఉద్దండడు అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ తీసుకున్న కొన్ని నిర్ణయాలను సైతం ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. అది మంచి కోసమే చేసానని చాలా సార్లు చెప్పారు.

స్వాతంత్య్ర ఉద్యమం వైపు రంగా..
సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గోగినేని రంగనాయకులు హైస్కూల్‌ విద్య వరకు సొంతూరు నిడుబ్రోలులోనే పూర్తి చేశారు. ఆ తర్వాత డిగ్రీ విద్యను గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్‌ కాలేజీలో చదివారు. ఉన్నత విద్యను విదేశాల్లో చదవాలనే నిర్ణయానికి వచ్చారు. లండన్‌లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో బీలిట్‌ చేశారు. అక్కడ నుంచి నేరుగా మద్రాస్‌ చేరుకున్నారు. రాష్ట్రంలోని పచ్చాయప్ప కళాశాలలో 1927 నుంచి 1930 వరకు ప్రొఫెసర్‌గా విద్యార్థులకు అర్థశాస్త్ర బోధన చేశారు. ఆ సమయంలో స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున్న జరుగుతోంది. మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయనను అనుసరిస్తూ ఆ ఉద్యమంలో అడుగిడారు. ఉద్యమ కాలంలో చట్టాలను దిక్కరించి జైలు పాలయ్యారు. అలా మూడు సార్లు ఆయన జైలుకెళ్లి వచ్చారు. స్వాతంత్య్రం వస్తుందనుకుంటున్న సమయంలో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1946 నుంచి 1951వరకు ఆంధ్ర కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పని చేశారు. 1951లో జవహర్‌లాల్‌ నెహ్రూతో ఏర్పడిన భేదాభిప్రాయాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ను వీడారు. 1955లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజాపార్టీల కూటమితో కలిసి విజయం సాధించారు.
కొత్త పార్టీల స్థాపన
నెహ్రూతో ఏర్పడిన స్పర్థల వల్ల రంగా కృషీకార్‌లోక్‌ పార్టీని ఏర్పాటు చేశారు. 1955 లో జరిగిన ఎన్నికల్లో రంగా కాంగ్రెస్,ప్రజా పార్టీల కూటమితో కలిసి పోటీ చేసి గెలుపు సాధించారు. కృషీకార్‌ లోక్‌ పార్టీ బలపడటం.. రంగా వైపు నేతలు పెద్ద ఎత్తున ఆకర్షితులు కావడం.. ఆదరణ పెరగడంతో ఇది కాంగ్రెస్‌కు ఎక్కడ తలనొప్పులు వస్తాయోనని భావించిన నెహ్రూ.. రంగాని పిలిపించి నచ్చ జెప్పి కృషీకార్‌లోక్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన ఇప్పించారు.
ఆ తర్వాత మరో సారి నెహ్రూ విధానా నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 1959లో స్వతంత్ర పార్టీని స్థాపించారు. దశాబ్ద కాలం పాటు ఆ పార్టీకి రంగా అధ్యక్షుడుగా ఉన్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో అదే పార్టీ 25 లోక్‌సభ స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో గ్రాండ్‌ ఎలయన్స్‌ పేరుతో మరి కొందరిని కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు స్వతంత్ర పార్టీ ఎనిమిది పార్లమెంట్‌ స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
1972లో ఇందిరా గాంధీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్‌(ఐ)లో రంగా చేరారు. 1980 నుంచి 1991 వరకు కాంగ్రెస్‌ పార్లీమెంటరీ పార్టీ గొప్ప నాయకుడిగా కొనసాగారు.
ఒకసారి ఏమైందంటే.. కాంగ్రెస్ కు చెందిన మినూ మసాని అనే ఎంపీ పార్లమెంట్‌లో కట్‌మోషన్‌ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై చర్చలో కమ్యూనిస్టు అగ్రనేత ఎస్.ఏ. డాంగే వంటి నేతలు ప్రసంగించారు. నెహ్రూ విధానాల్ని విమర్శిస్తూ మాట్లాడేందుకు ఎన్జీరంగాకు చాన్స్‌ వచ్చింది. ఆ సందర్భంలో ఆయన కమ్యూనిస్టుల సవాలును ఎదుర్కొనేందుకు మీకు (నెహ్రూ) నేను అవసరమయ్యా.. ఇక్కడ మాత్రం కాకుండా పోయా.. అంటారు. దానికి నెహ్రూ కూడా కాస్తవెటకారంగానే సమాధానం చెబుతూ .. ఆచార్య ఎన్జీరంగా మాదిరిగా  జెండాలను మార్చిన వాళ్లను మనము చూడలేము, ఆయన అంతటి ఘనుడు అనే అర్థం వచ్చేలా మాట్లాడతారు. దీనికి చిన్నబుచ్చుకున్న రంగా.. నెహ్రూ ఆ మాటన్నందుకు తనకేమీ బాధ లేదని, జెండాలు మార్చినందుకు తనకేమీ బాధ లేదంటూ జవహర్‌లాల్‌ నెహ్రూ రంగా మాటలను తిప్పి కొట్టారు.  జెండాలు మార్చగలిగిన సత్తా నాకుంది.. నీకు ఆమాత్రం ధైర్యం కూడా లేదు కదా.. కాంగ్రెస్‌కు పట్టిన అపవిత్ర, అవినీతి విధానాలకు విసిగి.. వేసారి.. కాంగ్రెస్‌నుంచి దూరంగా జరిగాను అని రంగా నెహ్రూ మాటలను తిప్పి కొట్టడం విశేషం’.  1959లో ఎన్నికల సందర్భంలో కమ్యూనిస్టులు నెహ్రూ అన్న మాటల్ని పట్టుకుని రంగులు మార్చే రంగా అంటూ ఆయన్ను ఎగతాళి పట్టించారు. 
ఆరు సార్లు ఎంపీగా గెలుపు
మొత్తంగా ఎన్జీ రంగా కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ, కృషీకార్‌లోక్‌ పార్టీ, కాంగ్రెస్‌ ఐ పార్టీల నుంచి ఆరు సార్లు పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. రాజీ పడని జీవితాన్ని గడిపారు. రైతు ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. కార్మిక వర్గానికి జరిగిన అన్యాయాలను ధైర్యంగా ఎదిరించారు. ఆయన జీవితం పూర్తిగా ప్రజల సేవకే అంకితమైంది. జైలు జీవితాన్ని గడుపుతున్న కాలంలో రైతులు.. కార్మికుల సమస్యలపై మంచి పుస్తకాలను రచించారు.
1959లో నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. రాష్యా ముద్రతో సహకార వ్యవసాయ పరపతి చట్టాన్ని ఈ సమావేశం ఆమోదించింది. సమిష్టి సహకార వ్యవసాయ విధానం, అందులోను రష్యా ఆలోచన సరళికి అనుకూలమైనదిగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో రంగా కాంగ్రెస్‌ను వీడారు. ఇలా రెండు సార్లు కాంగ్రెస్‌ను వీడి రెండు కొత్త పార్టీలను స్థాపించారు. తర్వాత కాంగ్రెస్‌ఐలో రాజకీయ ప్రయాణం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 11 మంది ఉద్దండులైన రాజకీయ నాయకులు ఉన్నారు. వారిలో కొంత మంది ఇప్పటికీ బతికే ఉన్నారు. కొందరు ప్రత్యక్ష రాజకీయాల్లోను, మరి కొందరు పరోక్ష రాజకీయాల్లోను, మరి కొందరు రాజకీయాలకు దూరంగాను ఉన్నారు.
గోగినేని రంగనాయకులు ఎన్జీరంగా ఎలా అయ్యారు
గోగినేని రంగనాయకులు లండన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోసం వెళ్లినప్పుడు ఎన్జీ రంగాగా పిలవబడ్డారు. అది ఎలా జరిగిందంటే ఇంగ్లీష్‌ వారికి ముందుగా మిడిల్‌ నేమ్‌..నేమ్‌..లాస్ట్‌ నేమ్‌ పిలవడం అలవాటు. ముందుగా నాయకులు అనేవాళ్లు. తర్వాత గోగినేని అని.. ఆతర్వాత రంగా అని పిలుస్తూ ఎన్జీ రంగాగా పేరు పిలవడం మొదలు పెట్టారు. రంగనాయకులు ఎన్జీ రంగా మారడానికి నేపథ్యం ఇది. ఆయన ఆచార్యులు కావడం వల్ల ఆచార్య ఎన్జీ రంగాగా పేరు సార్థకం చేసుకున్నారు. రంగా పేరుపై పలు ప్రాంతాల్లో విశ్వవిద్యాయాలు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ఆయన కాంస్య విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. రైతులు ఇప్పటికీ రాంగాను స్మరించుకుంటారు.
Tags:    

Similar News