వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల రూ.10.61 కోట్ల విరాళం

విజయవాడ వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తోచిన సహాయం చేయాలని, అదే ఏ రూపాన అయినా పర్వాలేదని చంద్రబాబు కోరారు.

Update: 2024-09-10 13:55 GMT

విజయవాడ వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తోచిన సహాయం చేయాలని, అదే ఏ రూపాన అయినా పర్వాలేదని చంద్రబాబు కోరారు. ఈ క్రమంలో ప్రతి రోజూ వరద బాధితుల కోసమంటూ అనేక మంది భారీ మొత్తాల్లో సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అది దాదాపు రూ.125 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. పోలీసు శాఖ కూడా రూ.11 కోట్లు విరాళం అందించింది. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు కూడా తమ ఒకరోజు జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందించారు. తాజాగా విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా వీరి బాటలోనే వెళ్లారు. వరద బాధితుల కోసం తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఈమేరకు చెక్కును విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌తో కలిసి విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్.. ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబుకు అందించారు. మొత్తం రూ.10,61,81,614 లకు సీఎం సహాయ నిధికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదోకోవడం కోసం విద్యుత్ ఉద్యుగులు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఐకమ్యం రానున్న రోజుల్లో కూడా కనబర్చాలని ఆయన కోరారు.

‘‘వారి ఒకరోజు జీతాన్ని రూ. 10,61,81,614 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. గత పది రోజులుగా విజయవాడ నగరంలో వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తూ బాధితులకు అండగా నిలబడుతూ పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు. 70 ఏళ్లకు పైబడినా కూడా సీఎం రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి అందిస్తున్న సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తూ తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు సమిష్టి కృషి కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో 3-4 లక్షల విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణ చేయడం జరిగింది’’ అని పేర్కొన్నారు.

‘‘ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు కూడా విద్యుత్ శాఖ ముందుంటుంది. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేస్తారని అన్నారు. ఇప్పుడు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం’’ అని ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ పేర్కొన్నారు.

‘‘కాగా సీఎం సహాయనిధికి వచ్చిన ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేస్తాం. ఒక్క పైసా కూడా దుబారా ఖర్చు కాకుండా చర్యలు తీసుకుంటాం. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం’’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.




 

పవన్‌కు అందిన విరాళం

కాగా మరోవైపు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ భారీ విరాళం అందించారు. రూ.7.70 కోట్ల విరాళ చెక్కును డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌ను అందించారాయన. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ కూడా తమ ఒక నేతల గౌరవ వేతనాన్ని వరద బాధితుల సహాయం కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, ఆ మొత్తమే ఈ రూ.7.70 కోట్లు అని ఆయన వెల్లడించారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయనిధికి జమ చేయాల్సిందిగా అంగీకార తీర్మాన పత్రాన్ని అందించారాయన.

Tags:    

Similar News