పార్టీలు మారినా అభ్యర్థులు వాళ్లే

అక్కడ పార్టీలు మారారు. అభ్యర్థులు మాత్రం వాళ్లే. ఆ కుటుంబాలదే హవా. ప్రస్తుతం ప్రత్యర్థులు ఒకే పార్టీలోకి వచ్చారు. ఏదా నియోకవర్గం.. ఏమిటా కథ..

Update: 2024-03-07 03:14 GMT
Draksharamam Temple

రెండు కులాల మధ్య ప్రధాన పోటీ

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రెండు ప్రధాన కులాలు ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నాయి. పార్టీలు ఏవైనా కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాల మధ్యనే పోటీగా ఇక్కడ పరిస్థితి మారుతుంటుంది.. ఈనేపథ్యంలోనే ఇక్కడ ఇంతవరకు నెగ్గిన నేతల సామాజికవర్గాలు ఇవే కులాలు కావడం గమనించదగ్గ విషయం కాగా రెండుసార్లు స్వతంత్రులుగా పోటీచేసి నెగ్గిన నేపథ్యం కూడా ఈ నియోజవర్గానికి ఉంది. అయితే ఇక్కడ ఎప్పుడూ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మధ్య పోటీ రసవత్తరంగా సాగిన పరిస్థితి ఉండేది. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా రాజోలు ప్రాంతానికి చెందిన మాజీ జడ్పీ చైర్మన్, ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణను రామచంద్రాపురం బరిలో వైసీపీ అధిష్టానం నిలిపింది. టీడీపీ నుంచి పోటీచేసిన ప్రత్యర్ధి తోట త్రిమూర్తులు ఓటమి పాలయ్యారు. తర్వాత తోటు త్రిమూర్తులు వైఎస్సార్‌సీపీలో చేరారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకే గూటికి చేరడంతో టీడీపీకి రామచంద్రపురంలో అభ్యర్ధే దొరకని పరిస్థితి ఎదురైంది.
తోటను మండపేటకు పంపిన వైఎస్సార్‌సీపీ
రామచంద్రపురం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులు వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆయనకు వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. ఆయన 1994లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత తెలుగుదేశంలో చేరిన త్రిమూర్తులు 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందారు. 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ త్రిమూర్తులుపై గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసిన సుభాష్‌ చంద్రబోస్‌ విజయకేతనం ఎగురవేశారు. అప్పుడు కూడా త్రిమూర్తులు ఓటమి చెందారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన సుభాష్‌ చంద్రబోస్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామచంద్రపురంలో ఉపఎన్నిక అనివార్యమైంది. 2012లో జరిగిన ఈ ఉప ఎన్నికలో టీడీపీ తరపున తోట త్రిమూర్తులు పోటీచేయగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ తరపున పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పోటీచేశారు. ఈ ఎన్నికలో 11,919ఓట్లు ఆధిక్యంతో తోట త్రిమూర్తులు గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పోటీచేయగా వైఎస్సార్‌సీపీ తరపున పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పోటీచేశారు. మళ్లీ తోట త్రిమూర్తులు జయకేతనం ఎగురవేశారు.
బోస్‌ మండపేట వెళ్లటంతో వేణుకు అవకాశం..
2019 ఎన్నికల్లో సుభాష్‌చంద్రబోష్‌ను మండపేట పంపించిన వైఎస్సార్‌సీపీ అధిష్టానం రామచంద్రపురానికి రాజోలుకు చెందిన మాజీ జడ్పీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణుగోపాలకష్ణను బరిలో దింపింది. ఈ ఎన్నికల్లో వేణు 5,168 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. మంత్రివర్గ మార్పులో వేణుకు అవకాశం దక్కడం తో కంటిన్యూ అవుతున్నారు. సమాచార, బీసీ సంక్షేమ మంత్రిగా, మంచి మాటకారిగా పేరు సంపాదించారు.
రానున్న ఎన్నికల్లో సుభాష్‌ చంద్రబోష్‌ కుమారుడు
వైఎస్సార్‌సీపీలో సీనియర్‌ నాయకుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు మంత్రి వేణుగోపాలకష్ణకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరటంతో ఒక దశలో పార్టీకి అవసరమైతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధిష్టానం రామచంద్రపురం నియోజకవర్గానికి బోస్‌ కుమారుడు సూర్యప్రకాశ్‌ను నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించి మంత్రి వేణును రాజమండ్రి రూరల్‌కు పంపించింది. కాగా టీడీపీ తరపున శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ ఇక్కడ కొత్త అభ్యర్ధిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే శెట్టిబలిజ యూత్‌ ఫోర్స్‌ అధ్యక్షుడు వాసంశెట్టి సుభాష్‌చంద్రబోస్‌ను బరిలో దింపేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది..
Tags:    

Similar News