Srinivasapungapuram | కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవం చూడతరమా..
శ్రీనివాస మంగాపురం మరో తిరుమల క్షేత్రం. ఇక్కడి కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-02-18 08:43 GMT
తిరుమల శ్రీవారి క్షేత్రం. టీటీడీ అనుబంధ ఆలయాలు. వాటిల్లో నిత్య ఉత్సవాలు కనువిందు చేస్తుంటాయి. యాత్రికుల రద్దీ కూడా ఏమాత్రం తగ్గదు. తిరుమలతో పాటు అనుబంధ తొమ్మిది ఆలయాల్లో జరిగే ఉత్సవాలు యాత్రికులను ఆకట్టుకుంటూ ఉంటాయి.
తిరుమల తరువాత మిగతా ఆలయాల్లో కూడా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆ కోవలోనే.. మదనపల్లెకు వెళ్లే మార్గంలో తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వార్ిషిక బ్రహ్మోత్సవాలు మంగళవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీ చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
అంతకుముందు ఉదయం 6.30 నుంచి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు.
ముక్కోటి దేవతలకు ఆహ్వానం
వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుడి చిత్రాన్ని కొత్తవస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. దీని అర్థం ఏమిటంటే.. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణబట్టార్ నారాయణ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
విస్తృత ఏర్పాట్లు
ధ్వజపటం ఆవిష్కరణ తరువాత టీటీడీ తిరుపతి జేఈవో వి.వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడారు. ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైనట్టు తెలిపారు. ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీనివాసమంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఉత్సవాల వివరాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 22న గరుడసేవ, ఫిబ్రవరి 23న స్వర్ణరథోత్సవం, ఫిబ్రవరి 25న రథోత్సవం, ఫిబ్రవరి 26న చక్రస్నానం జరుగనున్నట్టు తెలిపారు. రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
మీడియా సెంటర్లో పూజలు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల విభాగం మీడియా సెంటర్ ను జేఈఓ వీరబ్రహ్మం ప్రారంభించారు. ఆలయం సమీపంలోని వాహన మండపం పక్కన ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో ఆయన పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ రోజు వాహన సేవ
శ్రీనివాసమంాపురంలో ఉభయ నాంచారులతో కలిసి వెంక్న మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్ద శేషవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకాధికారి, సిపిఆర్వో డాక్టర్ తలారి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధన శేఖర్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు పాల్గొన్నారు.