ఈ సీట్లు భలే హాట్ గురూ!

మూడు నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్ కోసం ఆవావాహుల మధ్య వర్గపోరు పొదలైంది. మరి టీడీపీ ఎవరికి టికెట్ ఇస్తుందే చూడాలి.

Update: 2024-03-06 10:49 GMT
చంద్రబాబు


ఎన్నికలు వస్తున్నాయంటే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగడం, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణం. కానీ ప్రస్తుతం ఆంధ్రాలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీలో అంతర్గత పోరు మొదలైంది. ఇది టీడీపీకి కొత్త తలనొప్పిగా మారింది. ముఖ్యంగా మూడు స్థానాల విషయంలో అంతర్గత పోరు తీవ్రంగా కొనసాగుతోంది. సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో అధిష్టానం టికెట్ ఇచ్చిన అభ్యర్థిని ఇతరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేతల వైఖరితో తెలుగు తమ్ముళ్లు కూడా అయోమయంలో పడ్డారు. ఒకరికి టికెట్ లభిస్తే మిగిలిన వారు పార్టీ విజయానికి సహకరిస్తారా లేదంటే జెండా పీకేసి పార్టీ మారిపోతారా అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో టీడీపీ అధిష్టానం కూడా ఏం చేయాలో అర్థంకాక జుట్టు పీక్కుంటోంది. ఎవరికి టికెట్ ఇవ్వాలన్న అంశంపై లోగుట్టుగా తీవ్రంగా చర్యలు చేస్తూ టికెట్ డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు ప్రతి ఒక్కరిపై ఇతర నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది.

కృష్ణ ప్రసాద్‌ను కార్యకర్తలు అంగీకరించరు

టీడీపీకి తలనొప్పి తెస్తున్న నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి. ఈ స్థానం టికెట్ కోసం వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు పోటీ పడుతున్నారు. ఈ టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే బొమ్మసానితో భేటీ అయ్యారు. త్వరలోనే దేవినేనితో కూడా సమావేశం కావడానికి సిద్ధమవుతున్నారు. అయితే మైలవరంలోని పార్టీ కార్యకర్తలు వసంత కృష్ణ ప్రసాద్‌ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరని బొమ్మసాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వసంత కృష్ణ.. మైలవరం వదిలి పెనమలూరుకు వెళ్లడం మంచిదని, అక్కడి నుంచి పోటీ చేస్తే ఆయనకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

మడకశిరలోనూ ఇదే పరిస్థితి

టికెట్ విషయంలో మడకశిరలోని రాజకీయం ఉడుకుతోంది. ఈ నియోజకవర్గం టికెట్‌ను సునీల్ కుమార్‌కు ఇవ్వడాన్ని తిప్పేస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆత్మహత్యల వరకు కూడా వెళ్లింది. మడకశిర టికెట్‌ను సునీల్‌కు ఎలా ఇస్తారంటూ తిప్పేస్వామి అనుచరులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం తన నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి కూడా పార్టీ జెండా పట్టుకుని తిరగని సునీల్‌కు టికెట్ ఇవ్వడంతో పార్టీనే ప్రాణంగా పనిచేసిన తిప్పేస్వామికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహించారు. టికెట్ విషయంపై సునీల్ ధోరణి మాత్రం వేరేలా ఉంది. సర్వేల ఆధారంగానే తనకు టికెట్ ఇచ్చారు తప్ప మరేమీ లేదని, ఈ విషయంపై తాను తిప్పేస్వామితో త్వరలోనే భేటీ అవుతానని వెల్లడించారు.

సమావేశమైన అసమ్మతి నేతలు

కడపలో కూడా మాధవీరెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వడంపై ఇతర నేతలు తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అసమ్మతి నేతలంతా సమావేశం కావడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. మాజీ ఇన్‌ఛార్జ్ అమీర్ బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. టికెట్‌లు ఇవ్వడంపై పార్టీ అధిష్టానం మరోసారి పునరాలోచన చేయాలని, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వారికి టికెట్ ఇవ్వాలని అమీర్ బాబు వర్గం సూచించింది.

మూడు నియోజకవర్గాల్ అధిష్టానం నిర్ణయంపై నేతలు, వారి అనుచరులు అసహనం, అసమ్మతి వ్యక్తం చేయడంతో పార్టీ అధిష్టానం అయోమయంలో పడింది. ఇచ్చిన టికెట్లను అలానే కొనసాగించాలా? లేకుంటే టికెట్లు ఇవ్వడంపై పునరాలోచన చేయాలని అన్న సందిగ్దంలో చంద్రబాబు పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పార్టీలోని కీలక నేతలతో చర్చించారని, త్వరలోనే దీనిపై వారు ఓ నిర్ణయం తీసుకుని పార్టీ నేతలను అర్థమయ్యేలా వివరిస్తారని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి.


Tags:    

Similar News