ఇంటి వద్ద ఓటు ఎలా వేయాలో తెలుసా?

వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల కమిషన్‌ వారి ఇంటి వద్దకే వస్తోంది. ఓటును రహస్య ఓటింగ్‌ పద్ధతి ద్వారా బ్యాలెట్‌పై వేయించి తీసుకొని వెళ్తారు. ఇది ఎలాగంటే..

Update: 2024-04-13 13:18 GMT

దేశంలో నడవలేదని వృద్ధులు.. దివ్యాంగుల కోసం ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్‌ కల్పించింది. 85 ఏళ్లు నిండి నడవలేని స్థితిలో ఉన్న వృద్దులు.. 40 శాతం అంగ వైకల్యం ఉన్న వారు.. నడవలేని దివ్యాంగులకు ఇదొక మంచి అవకాశం. వారి భావ ప్రకటనా స్వేచ్ఛను ఓటు రూపంలో వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా అభినందనలు అందుకుంటోంది.

ఇంటి వద్ద ఓటు వినియోగించుకునే వృద్దులు 2.11లక్షలు
రాష్ట్రంలో 2.11లక్షల మంది వృద్ధులు(85ఏళ్లు నిండిన వారు), 5.18లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. నోటిఫికేషన్‌ ఈ నెల 18వ తేదీన విడుదల అవుతోంది. నోటిఫికేషన్‌ ప్రకారం నామినేషన్‌ ఉపసంహరణ గడువు ఏప్రిల్‌ 29తో పూర్తి కాగానే మే 13వ తేదీలోపు ఎప్పుడైనా ఎన్నికల అధికారులు, ఉద్యోగులు కలిసి ఓటు కోసం వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్తారు. ముందుగానే ఎప్పుడు వస్తారు.. ఎన్ని గంటలకు వస్తారు అనే విషయాలను ఆ ఓటర్ల ఇంటికి ఫోన్ల ద్వారా అధికారులు తెలియజేస్తారు.
ఇంటి వద్ద ఓట్లు వేసే వారి వివరాలు అభ్యర్థులు తెలుసుకోవచ్చు
వృద్ధులు, దివ్యాంగుల ఓటర్ల పేర్లను ప్రత్యేకంగా సచివాలయాల వద్ద డిస్‌ప్లే చేస్తారు. ఇళ్ల వద్ద ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో వారి పూర్తి వివరాలను పోటీలో ఉన్న అభ్యర్థులు తెలుసుకోవచ్చు. ఓటు కోసం ప్రచారం ఎలాగూ నిర్వహిస్తారు. ఇందులో ప్రత్యేకత లేకపోయినా ఓటును బలవంతంగా పలానా పార్టీకి అధికారులు వేయించారు అనే అపవాదులు మూట గట్టుకోకుండా ఎన్నికల కమిషన్‌ పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది. ఎవరైతే ఇంటి వద్ద ఓటు వేస్తారో వారికి సంబంధించిన వివరాలను ఫారమ్‌ నంబర్‌ 12డిలో ఇప్పటికే బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల ద్వారా సేకరించారు. వారం రోజుల క్రితమే ఈ ప్రక్రియ పూర్తి అయ్యింది. పూర్తి చేసిన 12డి ఫారాలను రిటర్నింగ్‌ అధికారికి మండల స్థాయి అధికారులు అందజేశారు.
ఓటు వేసే సమయంలో తగిన భద్రత
వృద్ధులు, దివ్యాంగుల నుంచి ఓటు తీసుకొనే సమయంలో భద్రత కోసం ఒక టీమ్‌ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఆ టీమ్‌లో పోలీసులు కూడా ఉంటారు. ఆ టీమ్‌ ఓటర్ల ఇంటికి వెళ్లినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వీడియో కూడా తీస్తారు. అక్కడ ఓటరు ఓటు వేసేటప్పుడు మాత్రం వీడియో తీయడానికి వీల్లేదు. అది రహస్యంగానే ఉంటుంది. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్‌ను పద్ధతి ప్రకారం మడత వేసి బాక్స్‌లో వేస్తారు. ఆ బ్యాలెట్‌ బాక్స్‌ను పోలీసుల భద్రత మధ్య బిఎల్వో నేతృత్వంలో రిటర్నింగ్‌ అధికారికి అందిస్తారు.
15లోపు ఓటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు
ఓటు నమోదుకు ఈ నెల 15 ఆఖరు తేదీ. 18 ఏళ్లు నిండిన వారు ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారు ఈ నెల 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా తాహశీల్దారు, మునిసిపల్‌ కార్యాలయాల్లో మాన్యువల్‌గా కూడా ఫారమ్‌ నంబర్‌ 6ను అందజేయొచ్చు. అయితే వయసు నిర్థారణకు సంబంధించిన సర్టిఫికేట్‌.. ఆధార్‌ కార్డు ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. 
Tags:    

Similar News