లులూ మాలూ..అనుమానాలు ఎన్నెన్నో!
గత టీడీపీ హయాంలో ఈ మాల్కు వైజాగ్లో 13.83 ఎకరాలు కేటాయించింది. వైసీపీ పాలనలో వాటిని రద్దు చేస్తే, కూటమి సర్కారు మళ్లీ అనుమతులిచ్చింది.;
విశాఖ మహా నగరంలో సెంటు భూమి కూడా ఎంతో విలువైనది. ఈ సిటీలో వాణిజ్య సముదాయమే కాదు.. చిన్నపాటి ఇల్లో లేదా షాపో కట్టుకోవాలంటే గజం స్థలం దొరకడం గగనమవుతోంది. గజం జాగా కోసం రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అలాంటిది ఎకరం కాదు.. రెండెకరాలు కాదు.. ఏకంగా 13 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఓ ప్రైవేటు సంస్థకు కారు చౌకగా కట్టబెట్టేస్తుండడాన్ని ఏమనుకోవాలి? రూ. వేల కోట్ల విలువైన ఆ సర్కారీ స్థలాన్ని అత్త సొమ్ము అల్లుడు ధారపోసిన చందంగా లులూ సంస్థకు ధారాదత్తం చేసేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పడు విశాఖ వాసులతో పాటు మేధావి వర్గాలను కూడా కలవర పెడుతున్న లులూ మాలుకు భూ కేటాయింపులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి!
ఏమిటీ లులూ మాల్?
విశాఖపట్నం బీచ్ రోడ్లోని హార్బర్ పార్క్ భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం లులూ గ్రూప్నకు తిరిగి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధం. సీఆర్జెడ్ నోటిఫికేషన్, సుప్రీంకోర్టు తీర్పు, ఏపీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. ఈ భూమి సీఆర్జెడ్ నిషేధిత ప్రాంతంలోకి వస్తుంది, భీమిలి తీర ప్రాంతంలో సీఆర్జెడ్ పరిధిలో ఓ రాజకీయ నేత చేపట్టిన కట్టడాలను, పునాదులను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. సీఆర్జెడ్ ఉల్లంఘనలకు సహకరించిన అధికారుల తీరును తప్పుబట్టింది. గత ప్రభుత్వం సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండలో పర్యాటకశాఖ సముదాయాన్ని కూల్చి కొత్త భవనాల నిర్మాణంపైనా మందలించింది. కేరళలోని మరడు పంచాయతీలో సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన నాలగు భారీ బహుళ అంతస్తులను కూల్చివేతకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అందువల్ల లులూ మాల్ విషయంలో సంబంధిత అధికారులెవ్వరూ సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడవద్దని కోరుతున్నాను. ఇలాంటి బహిరంగ స్థలాలను ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేందుకు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలిచీ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, భారత ప్రభుత్వ ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.