చిన్న నాటే అడవి బాట పట్టింది..అడవి తల్లి ఒడిలోనే ఒదిగి పోయింది
పదేళ్ల క్రితం తమ్ముడు, ఆర్నెల్ల కిందట భర్త హతమయ్యారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరిదీ వామపక్ష భావజాలమే.;
ఆమె పేరు వెంకట రవి లక్ష్మి చైతన్య అలియాస్ అరుణ. వయసు 55 ఏళ్లు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకుంది. తల్లిదండ్రులది వామపక్ష భావజాలం నేపథ్యం కావడంతో ఆమె కూడా చిన్నతనంలోనే విప్లవాన్ని ఒంటబట్టించుకుంది. రెండు పదుల ప్రాయంలోనే అడవి బాట పట్టింది. తుపాకీ చేతబట్టి సాయుధ పోరాటంలోకి దిగింది. ఆ ప్రయాణంలో సోదరుడిని, భర్తను కోల్పోయింది. మావోయిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగింది. చివరకు అడవి తల్లి ఒడిలోనే ఒదిగిపోయింది.
భర్త చలపతితో అరుణ
బుధవారం వేకువజామున అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం– మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి, మరో మావోయిస్టు అంజుతో పాటు అరుణ కూడా ఉన్నారు. అరుణ స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. ఆమె తల్లిదండ్రులు కరకవానిపాలెంలోనే ఉంటున్నారు. తండ్రి హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వీరికి ముగ్గురు సంతానం. వారిలో అరుణ పెద్దది కాగా సోదరుడు (గోపి అలియాస్ ఆజాద్), సోదరి (న్యాయవాది)గా ఉన్నారు. ఆజాద్ కూడా సోదరి అరుణ బాటలోనే సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నారు. ఆపై 2006లో అడవులకు పయనమయ్యారు. అనంతరం సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. గాలికొండ ఏరియా దళ కమాండర్గా పనిచేస్తున్న సమయంలో 2016లో అప్పటి విశాఖ జిల్లా కొయ్యూరు–జీకేవీధి అటవీ ప్రాంతం మర్రిపాకల వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ హతమయ్యారు. సోదరి విశాఖలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గతంలో గంగవరం పోర్టు వ్యవహారంలో మత్స్యకారుల ఉద్యమానికి బాసటగా నిలిచిన ఆమెను పోలీసులు అరెస్టు చేసి కేజీహెచ్కు తరలించారు. మావోయిస్టు సానుభూతిపరురాలు అనే నెపంతో ఆమెను కేజీహెచ్లో మంచానికి సంకెళ్లు వేసి బంధించారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.