తిరుమల: యాత్రికుడా.. శ్రీవారి దర్శనం ఎలా జరిగింది?
మీ అభిప్రాయం చెప్పండి అని టీటీడీ కొత్త పద్ధతిని ప్రారంభించింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-29 09:17 GMT
తిరుమలలో జరిగే పొరబాట్లు, తప్పులు తెలుసుకోవడానికి టీటీడీ సాంకేతికంగా నిఘా పెట్టింది. వసతులు ఎలా ఉన్నాయి? శ్రీవారి దర్శనం బాగా జరిగిందా?
తిరుమలలో అందిస్తున్నసేవలపై యాత్రికుల నుంచి విస్తృతంగా అభిప్రాయ సేకరణకు టీటీడీ కొత్త పద్ధతి అనుసరిస్తోంది. ఫీడ్ బ్యాక్ సర్వే చేపట్టింది. ఇందుకోసం ఐవీఆర్ఎస్, వాట్సప్, ఈసర్వే, శ్రీవారి సేవకుల ద్వారా కూడా సర్వే చేయిస్తోంది.
టీటీడీ 16 అంశాలపై యాత్రికులు తమ అభిప్రాయాలు చెప్పడానికి వీలుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ కోసం ఓ యాప్ అందుబాటులోకి తెచ్చారు. దీనిని తిరుమలలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. యాత్రికుల ఫిర్యాదులు, సలహాలను మదింపు చేయడం ద్వారా వసతులు మెరుగు పరచడం తోపాటు ఉద్యోగులు, సిబ్బంది, అధికారుల్లో బాధ్యతను పెంచేదిగా ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
యాత్రికుల అభిప్రాయాలు ఐటీ విభాగంలో నమోదవుతాయి. అక్కడి నుంచి ..
"నివేదికలు తీసుకోవడం ద్వారా లోటుపాట్లు గుర్తించడానికి చర్యలు తాసుకుంటాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెబుతున్నారు.
తిరుమలలో..
1. తిరుమల శ్రీవారిని సగటున రోజుకు 65 వేల నుంచి 70 వేల మంది యాత్రికులు దర్శించుకుంటూ ఉంటారు. శనివారం, ఆదివారం ఆ సంఖ్యకు మరో పది వేల మంది జత కలిసినా ఆశ్యర్యం లేదు. వేసవి సెలవుల తరువాత కూడా రద్దీ ఎక్కువగా ఉంది. తాజా సమాచారం ప్రకారం శ్రీవారి దర్శనానికి కనీసంగా పది గంటలకు పైగానే వేచి ఉండాల్సిన పరిస్థితి.
వారిలో సామాన్య యాత్రికుల సంఖ్యే 80 శాతం ఉంటుంది. ఆదాయం కూడా వారితోనే టీటీడీకి లభిస్తుంది. గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు. ఈ సమయంలో ప్రసాదాలు, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు అందిస్తుంటారు.
2. తిరుమల తరగొండ వెంగమాంబ అన్నదానసత్రంలో రోజుకు కనీసంగా 50 వేల నుంచి 60 వేల మంది వరకు అన్నప్రసాదాలు తీసుకుంటారు.
3. తిరుమలలో యాత్రికుల కోసం 7,500 గదులు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ లో సుమారు 1,600 గదులు కేటాయిస్తారు. సీఆర్ఓ కార్యాలయం వద్ద కరెంట్ బుకింగ్ కూడా ఉంది. ఇది పారదర్శకంగానే నిర్వహించడానికి గదుల వివరాలు టీవీ స్క్రీన్ పై ప్రత్యక్య ప్రసాదం అవుతుంటుంది.
ఇంతటి రద్దీ క్షేత్రంలో సామాన్య యాత్రికులకు మెరుగున సేవలు అందించాలనే సంకల్పంతో టీటీడీ అభిప్రాయాల సేకరణకు రంగంలోకి దిగింది. ఓ రకంగా ఉద్యోగులకు కూడా ఇది బాధ్యత పెంచేదిగానే ఉంది.
ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ సర్వే...
ఈ ఎలక్ట్రానిక్ సర్వే విధానఓ IVRS ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూ లైన్ల నిర్వహణ మరియు లగేజ్ కౌంటర్ల పై మొత్తం 16 ప్రశ్నలపై తమ అభిప్రాయాలు చెప్పవచ్చు.
వాట్సాప్ ఫీడ్ బ్యాక్
తిరుమల, తిరుపతిలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. క్యూఆర్ కోడ్ మొబైల్తో స్కాన్ చేస్తే (వాట్సాప్ నెం: 9399399399) టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది.
1. భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు ) ఆప్షన్ ఎంచుకోవాలి.
2. అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకోవచ్చు.
3. సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు,మరింత మెరుగుదల అవసరం, లేదా బాగాలేదు అని చెప్పవచ్చు. లేదా రేటింగ్ ఇవ్వవచ్చు.
4. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు.
5. అభిప్రాయం సమర్పించిన వెంటనే, “మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది. మీ విలువైన ఫీడ్బ్యాక్కు ధన్యవాదాలు” అనే ధృవీకరణ సందేశం వస్తుంది.
శ్రీవారి సేవకులతో..
శ్రీవారి యాత్రికుల నుంచి అభిప్రాయ సేకరణకు టీటీడీ పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోంది. అందులో క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఐవీఆర్ఎస్ తోపాటు టీటీడీకి స్వచ్ఛందంగా సేవలు చేయడానికి వచ్చే శ్రీవారి సేవకులను కూడా రంగంలోకి దించారు. యాత్రికుల ఫోన్లలో అప్లికేషన్ డౌన్ లోడ్ చేయిస్తున్నారు. లేదంటే శ్రీవారి సేవకుల ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే అభిప్రాయ సేకరణ చేయించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
త్వరలో బుకింగ్ పోర్టల్ లో...
టీటీడీ సేవలు, శ్రీవారి దర్శనానికి ఆన్ లైన్ టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పోర్టర్ లో సేవల వివరాలు తెలుసుకోవడంతో పాటు విరాళాలు అందించే వెసులుబాటు ఉంది.
టీటీడీ అధికారులు తాజాగా చేపట్టిన అభిప్రాయ సేకరణకు సంబంధించి క్యూఆర్ కోడ్ ద్వారా యాప్ అందుబాటులోకి తెచ్చారు. దీనిని ఆన్ లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. యాత్రికుల అభిప్రాయిలు తెలుసుకుని, లోటుపాట్లను సరిదిద్దడం ద్వారా మెరుగైన సేవలు అందించడమే అభిప్రాయ సేకరణ లక్ష్యమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
టీటీడీ నిర్వహిస్తున్న ఐటీ విభాగానికి ఈ వివరాలన్ని చేరుతాయి. అక్కడి సిబ్బంది ఆన్ లైన్లో టీటీడీ ఈఓ శ్యామలరావు, టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుకు అందించే అవకాశం ఉంటుంది. యాత్రికులు వ్యక్తం చేసే అభిప్రాయాల్లో సీరియస్ ఆరోపణలు ఉంటే, వెంటనే వారిద్దరికి చేరే విధంగా వెసులుబాటు కల్పించినట్లు టీటీడీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.