తిరుమలలో ప్రైవేటు వాహనాల కు స్వస్తి పలికే దిశగా టిటిడి అడుగులు వేసింది. యాత్రికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపరచడానికి వీలుగా 100 విద్యుత్ బస్సులు అందించడానికి కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు చెప్పారు.
తిరుమల తో పాటు తిరుపతి శ్రీనివాసమంగాపురం, శ్రీవారి పాదాల వద్దకు వెళ్లడానికి యాత్రికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ సమస్య నివారించడానికి కేంద్ర నిధులతో మంత్రి కుమారస్వామి అందించే 100 ఎలక్ట్రికల్ బస్సులు నడపనున్నట్లు ఆయన చెప్పారు.
"ప్రైవేటు వాహనదారుల నిలువు దోపిడీ నుంచి భక్తులకు విముక్తి లభిస్తుంది" అని ఆయన బీఆర్. నాయుడు అభిప్రాయపడ్డారు.
టీటీడీ ధార్మిక కార్యక్రమాలతో పాటు విద్యా, వైద్య సేవలు కూడా అందిస్తోంది. అందులో భాగంగా టిటిడి విద్యాసంస్థల్లో పనిచేసే లెక్చరర్ పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ విధానం నిలిపివేయాలని టీటీడీ బోర్డులో తీర్మానించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటికే పనిచేస్తున్న 200 మంది కాంటాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు.
1952లో ఢిల్లీలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల భవనాల పునర్నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు.
నెయ్యి పరీక్షకు ల్యాబ్
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నాణ్యమైన నెయ్యిని వినియోగించేందుకు తిరుపతిలో సిఎస్ఆర్ పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ల్యాబ్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని లీజు పద్ధతిలో కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు.
" ప్రస్తుతం ఉన్న ఆలయం చిన్నది. దీనిని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంది" అని ఇటీవల బెంగళూరు వయ్యాలి కావాలి లో ఉన్న టిటిడి శ్రీవారి ఆలయాన్ని దర్శించిన విషయాన్ని టిటిడి చైర్మన్ బిఆర్. నాయుడు గుర్తు చేశారు.
"బెంగళూరులో ఆలయాన్ని నిర్మించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరారు" అని నాయుడు వివరించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేసి "కుమార్ బెంగళూరులో 47 ఎకరాలు స్థలాన్ని కేటాయించగానే, ఆలయం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం" అని నాయుడు చెప్పారు.
దళితవాడల్లో ఆలయాలు
శ్రీ వాణి ట్రస్ట్ నిధుల ద్వారా దళితివాడల్లో ఆలయాలు నిర్మించడానికి తీర్మానం చేశారు. ఇప్పటికే ఒక్క చిత్తూరు జిల్లాలో 141 ఆలయాల నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించినట్లు చైర్మన్ వివరించారు.
ఇంకా ఏమి తీర్మానాలు చేశారంటే..
సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మం వ్యాప్తి కోసం టిటిడి ధర్మ ప్రచార పరిషత్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. ఇందుకోసం ఏడాదికి 120 కోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు. అత్యవసర బోర్డు సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించారు.
1. సమరసతా సేవా ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న అర్చకుల శిక్షణ కార్యక్రమంతో పాటు వివిధ వ్రతాలు, పూజా విధానాలలో కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.
2. విద్యార్థుల్లో హైందవ సనాతన ధర్మం మరింత నేర్పాలి. మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడానికి సద్గమయ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయం. తద్వారా ఏడు టీటీడీ పాఠశాలల్లో దాదాపు 1600 మంది విద్యార్థులకు డే స్కాలర్ విధానంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయం.
3. టీటీడీ విద్యా సంస్థల్లో హిందూ సనాతన ధార్మిక విలువలతో పాటు తెలుగు సాంస్కృతిక వైభవంలో శిక్షణ ఇవ్వాలి. "మన వారసత్వం" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం.
4. తిరుచానూరు:వరలక్ష్మీ వ్రతం రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.
5. ధార్మిక ప్రచారం: అక్షరగోవిందం, హరికథా వైభవం, భగవద్గీత అనుష్టాన బోధన, భజే శ్రీనివాసం, వన-నిధి, గిరి జనార్దనం, సన్మార్గం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం. ఆ కార్యక్రమాలు మరింత విస్తృతం చేయడం ద్వారా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలని నిర్ణయించారు.