టీటీడీలో అన్యమతస్తులను తొలగించండి..
తిరుమలలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని పార్టీలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చురకలు;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-11 05:51 GMT
టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తెలిగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా వాళ్లను కొనసాగించడంపై బండి సంజయ్ మండిపడ్డారు. శ్రీవారి చెంత పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని అన్నారు.
పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఉదయం బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
Tirumala :ఆలయం వెలుపల మీడితో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
"వెయ్యి మంది అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు?" అని కూడా ఆయన టీటీడీని నిలదీశారు. మసీదు, చర్చిల్లో హిందువులకు ఉద్యోగాలిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా హిందేయేతరులను కొనసాగించే అనవాయితీ ఎందుకు కొనసాగిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే..
"ఈ రోజు నా జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రశాంత వాతావరణంలో జీవించాలి. ఈ దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కలిసి కట్టుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండాలి. శక్తివంతమైన భారత్ నిర్మాణం కోసం, దేశాభివ్రుద్ధి కోసం, ప్రజల సంక్షేమం అహర్నిశలు పనిచేస్తున్న ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా శక్తి సామర్థ్యాలు కల్పించాలని స్వామి వారిని వేడుకున్నా" అని చెప్పారు.
కరీంనగర్ లో భూమిపూజ చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలను, అభివృద్ధికి నోచుకోని పురాతన దేవాలయాలను గుర్తించి టీటీడీ నిధులను కేటాయించాలన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు
"తిరుమల హిందువుల ఆస్తి. అన్యమతస్తులను తప్పించడంలో ఓటు బ్యాంకు రాజకీయాలు సరైందికాదు" అని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలోని పార్టీలు, ప్రభుత్వానికి చురకలు వేశదారు.
" విదేశీయులు, అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి. టీటీడీలో వెయ్యి మందికిపైగా ఇతర మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి హిందుమతం, దేవుడిపై నమ్మకం లేదు. అట్లాంటోళ్లకు ఉద్యోగాలివ్వమేంటి? వాళ్లను కొనసాగించడమేంటి? పద్దతి మంచిది కాదు" అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
"ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోంది. స్వామివారిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారు. హిందువులంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడో వాళ్లను నియమించారని చెప్పి తప్పించుకోవడం సరికాదు. తక్షణమే వాళ్లను తొలగించాలి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లను కొనసాగించడం కరెక్ట్ కాదు" అని కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
జన్మదినోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కడ్, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు.