మంత్రి నారాయణ పనితీరు శభాష్...

బుడమేరు వరద బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మురుగు వాసన నుంచి ఇంకా బయట పడలేదు. అయితే 14 రోజులుగా మునిసిపల్ మంత్రి నారాయణ పనితీరును అందరూ మెచ్చుకుంటున్నారు.

Update: 2024-09-14 12:58 GMT

ఆంధ్రప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు ఇంకా విజయవాడ ఉత్తర ప్రాంతాన్ని వీడలేదు. దాదాపు అన్ని కాలనీల్లోనూ నీటిని బయటకు పంపించారు. ఇంకా జర్నలిస్ట్ కాలనీ, కండ్రిక, బోస్ నగర్లలో మురుగు నీరు ఉంది. డ్రైనేజీ కాలుల్లో పేరుకు పోయిన మురుగు నీటిని పంపింగ్ ద్వారా బయటకు పంపించే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా చాలా వరకు వరద నీటిని బయటకు పంపించ కలిగారు. 15వ తేదీ నాటికి మురుగు నీరు కాలనీల్లో లేకుండా బయటకు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

రాష్ట్రంలోని ఇతర మునిసిపాలిటీల నుంచి 7,500 మంది, విజయవాడలో మూడు వేల మంది శానిటేషన్ సిబ్బంది నిత్యం మురుగు నీరు, చెత్త తొలగించే పనిలోనే ఉన్నారని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెబుతున్నారు. 200 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ బుడమేరు నుంచి ఇంత నీరు పారలేదన్నారు. క్రిష్ణా నదికి 11.43 లక్షల క్యూసెక్స్ నీరు రావడం ఇదే మొదటిసారని మంత్రి చెప్పారు.

Delete Edit

స్వయంగా ముఖ్యమంత్రి పది రోజుల పాటు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే రేయింబవళ్లు ఉన్నారు. మంత్రులు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వరదలు వచ్చి 14 రోజులు గడిచింది. అయినా బురద నీరు, మురుగు నీరు ఇంకా కొన్ని రోడ్ల నుంచి బయటకు వెళ్ల లేదు. మురుగు నీరు రోడ్ల నుంచి తోడి ట్యాంకర్ల ద్వారా బయటకు పంపించేందుకు చర్యలు చేపట్టినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా మురుగు నీరు బయటకు పోలేదు. దాదాపు ప్రతి రోజూ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ బుడమేరు మునక ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నారు. సింగ్ నగర్ ప్రధాన రహదారిని మాత్రం పూర్తిస్థాయిలో ప్రభుత్వం బాగు చేయగలిగింది. మిగిలిన చిన్న రోడ్లలో మురుగు నీరు ఇంకా క్లియర్ కాలేదని పలువురు స్థానికులు చెబుతున్నారు.

Delete Edit

మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ శనివారం జర్నలిస్ట్ కాలనీ, బోస్ నగర్, కండ్రిక ప్రాంతాల్లో పర్యటించారు. మురుగు నీరును పంపింగ్ చేస్తున్న పరిస్థితులు తెలుసుకున్నారు. స్వయంగా ఇప్పటికి రెండు సార్లు బైక్ పై ప్రయాణించి వీధుల్లో ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. చిన్న వీధుల్లోని ఇండ్లలో చేరిన బురదను కడుక్కునే పనిలో అక్కడి వారు ఉన్నారు. జర్నలిస్ట్ కాలనీలోని ఒక మహిళ తడిసి పోయిన పాస్ పుస్తకాలు, ఇతర కాగితాలు ఆరబెట్టుకుంటుంటే ఆమె వద్దకు వెళ్లి పరామర్శించి ఆమెతో మాట్లాడారు. పడిన కష్టాలు ఆమె వివరించారు. ఈనెల 17 లేదా 18 తేదీల్లో పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

Delete Edit

ప్రతి వీధిలోనూ మంత్రి నారాయణ పర్యటించడం పలువురిని ఆకట్టుకుంది. మునిసి పల్ సిబ్బందిని పురమాయించి ఎక్కడికక్కడ చెత్తలేకుండా చేయాలని ఆదేశిస్తూ ముందుకు సాగారు. బైక్ నడుపుతూ పలువురిని పలకరించడం, ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్లి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడంతో శభాష్ నారాయణ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

సుమారు 20 చోట్ల గండ్లు పూడ్చాలి

బుడమేరు కట్టకు అక్కడక్కడ సుమారు 20 చోట్ల చిన్న చిన్న గండ్లు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెవివి ప్రసాద్ తెలిపారు. ఇటీవల సీపీఐ ప్రతినిధి బ్రుందం పర్యటించినప్పుడు ఈ పరిస్థిని చూశామని, ప్రభుత్వానికి కూడా సమస్యను పూర్తి స్థాయిలో వివరిస్తా మన్నారు. ఈనెల 17న మరోసారి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా మరో సారి పర్యటిస్తారని చెప్పారు.

Tags:    

Similar News