చంద్రబాబు,పెద్దిరెడ్డి వైరానికి 40 యేండ్ల చరిత్ర

నాడు తిరుపతి యూనివర్శిటీలో మొదలయిన వీళ్ల వైరం ఇపుడు కుప్పంకు పాకింది. అక్కడ బాబును ఓడించేందుకు ముఖ్యమంత్రి జగన్ పెద్దిరెడ్డిని ఎంపికి చేసుకున్నారు, ఎందుకు?

Update: 2024-03-17 04:24 GMT

కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ఓడించే బాధ్యతలు వైసిసి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చారు. చంద్రబాబు నుంచి కుప్పాన్ని లాక్కునేందుకు జగన్ పదేళ్లుగా కృషి చేస్తున్నారు. పెద్దిరెడ్డి ఉన్నా అది సాధ్యం కాలేదు. ఈ సారి ఏమవుతుందో చూడాలి. 2019 నుంచి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. దీన్ని చంద్రబాబు నాయుడు గమనించినట్లున్నారు. కుప్పం మీద ఆయనేకాదు, అయనకుటుంబమంతా దృష్టిపెట్టింది.

ఇక పిఠాపురంలోపవన్ ను ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, ఎంపి మిధున్ రెడ్డికి అప్పగించారు. ఈ ఎన్నికల్లో వీళ్లిద్దరిని ఓడించాలనేది జగన్ ఆశయం. బాధ్యతను ఆయన పెద్దిరెడ్డి కుటుంబానికి ఇచ్చారు. కుటుంబాల విషయానికి వస్తే, వైసిపిలో ఎక్కువ ప్రాబలయ్యం ఉన్న కుటుంబం ఇదే. జగన్ కుటుంబం రాకీయాల్లో లేదు. ఆయన ఇంటగెలవలేదు.

వైసిపి వచ్చాక బలంగా తయారయిన రెండో కుటుంబం పెద్దిరెడ్డిదే. పెద్దిరెడ్డికి, మిథున్ కి వైసిపి రాజకీయాల్లో చాలా పాత్ర వుంది. కొంత పబ్లీకున, కొంత బ్యాక్ గ్రౌండ్ తో పెద్దిరెడ్డి అండ్ సన్ కీలకమయిన పాత్ర పోషిస్తుంటారు. దీనికి కారణమేమిటి? చిత్తూరు జిల్లాకు చెందిన వారు చెప్పేదే మిటంటే, హోల్ మొతం వైసిపిలో పార్టీ మారి టిడిపిలో చేరే అవకాశం లేని ఏకైక కుటుంబం ఇదే అన్నారు. రాజకీయాల్లో ఎవరైనా ఎటైనా పోవచ్చు. పెద్దిరెడ్డి చంద్రబాబు వైపు వెళ్లే ప్రసక్తిలేదని పెద్దిరెడ్డితో పాటు చదువుకున్న మాజీ ఐఎఎస్ అధికారి ఒకరు చెప్పారు. ఇలాంటి కుటుంబం జగన్ ఫామిలీ కాకుండా మరొకటి లేదు అని ఆయన అన్నారు.

పెద్దిరెడ్డికి చంద్రబాబు ఓడించాలన్న కోరిక పట్టుదల ఇప్పటికాదు. దానికి నలభైయేళ్ల చరిత్ర ఉంది.


అదేమిటో చూద్దాం...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో తెగ పర్యటిస్తున్నారు. నియోజకవర్గమంతా తిరుగుతారు. కార్యకర్తలతో మాట్లాడుతారు. సభల్లో ఆవేశ పడుతున్నారు. కేసులకు భయపడవద్దు, దాడులకు వెరవవద్దు, మీకేమీ కాదు, నేనున్నా అంటున్నారు. నిజానికి అక్కడ ఆయన హంగామా చూస్తే భయపడుతున్నది కార్యకర్తులు కాదు, చంద్రబాబే అనిపిస్తుంది.

 మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆయన  కుప్పానికి తరచూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు.

ఎ న్నికలపుడు కూడా రాని నాయకుడు ఎన్నికలయి పోయాయో లేదో అపుడే వచ్చాడనే విషయం కుప్పంలో బాగా చర్చ నీయాంశమయింది. ఏడుసార్లు చంద్రబాబు ను గెలిపించిన కుప్పంలో టిడిపి పునాదులు కదులుతున్నాయనే చర్చ మొదలయింది నిజానికి ఈ చర్చ 2014లోనే మొదలయింది. 2019 నాటికి ఉపందుకుంది. 2021 పంచాయతీ ఎన్నికల తర్వా తీవ్రమయింది. 2024 లో ఏమవుతుందో చూడాలి.

చంద్రబాబు నాయుడు కుప్పం సందర్శనకు వచ్చే వారు కాదు, నాకేమి కాదనేది ఆయన ధైర్యం. తన బంట్లు తనని కాపాడతారనే విశ్వాసం ఆయనది. నామినేషన్ వేసేందుకు కూడా వచే వారు కాదు. ఎన్నికలయి పోయి గెలిచాక కుప్పం సందర్శన అసలే ఉండదు. కుప్పాన్ని పరిపాలించేందుకు ఆయన ముగ్గురు నలుగురు వ్యక్తులను ఎంచుకున్నారు. అందులో ఆయన కార్యదర్శి మునిరత్నం ఒకరు. ఈ నలుగురు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దర్జా వెలగబెట్టారు.

వీళ్లంతా అధికారం ఉన్న వాళ్లే తప్ప ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్లు కాదు. వీళ్లే కొంప ముంచుతున్నారని ఎవరిని అడిగినా చెబుతారు. నిజంగా ఓటర్లలో పట్టు ఉన్నవాళ్లను చంద్రబాబు పక్కన పెట్టేశారనే విమర్శ బాగా ఉంది. ఈ విమర్శ సర్వత్రా వినబడుతుంది. టిడిపి వాళ్లంతా ముక్తకంఠంతో చెబుతారు. నియోజకవర్గంలో చంద్రబాబు సందర్శించకపోవడం, ఆయన కుమారుడు లోకేశ్ అసలూ అటువైపు చూడకపోవడం, తాబేదార్లకు నియోజకవర్గాన్ని అప్పగించడంతోనే కుప్పం నుంచి చంద్రబాబును తరిమేయవచ్చనే ధైర్యం వైసిపిలో బాగా పెరిగింది.

జగన్ ఈ బాధ్యతను అన్ని విధాల బలాఢ్యుడయిన పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగించారు. పెద్దిరెడ్డి కుప్పంలోనే మకాం వేశారు. పెద్దిరెడ్డి బాగా కష్టపడుతున్నారని అందరికి తెలుసు. చంద్రబాబు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోతే, పెద్దిరెడి అందరికి అందుబాటులోకి వచ్చారు.

2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు కుప్పం రానేలేదు. 2020లో కరోనా పాండెమిక్ వల్ల రాలేదు. అయితే, ఈ అవకాశాన్ని వైసిపి బాగా ఉపయోగించుకుంది. పెద్దిరెడ్డి కుప్పంలో బిసిలను టిడిపి నుంచి దూరం చేసే వ్యూహం అమలుచేశారు. కరోనా కాలం సాయం అంటూ, ఆ పథకం ఈ పథకం అంటూ వైసిపి నియోజకవర్గం మూలమూలలని అక్రమించుకుంది.

చంద్రబాబు బలగమంతా బిసిలే నని ఎన్నికల ముందే జగన్ గ్రహించారు. ఆ బిసిలో కూడా వన్నికుల క్షత్రియులు బాగా ఎక్కువ. వారిని టిడిపి నుంచి పక్కకు లాగేస్తున్నారని కుప్పం లోని ఒక జర్నలిస్టు ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.

పంచాయతీ ఎన్నికల తర్వాత తిరుపతి లో ఒక ప్రకటన చేస్తూ 2024లో కుప్పాన్ని వైసిపి లాగేసుకుంటుందని పెదిరెడ్డి ప్రకటించారు.


ఎందుకు ఇంత కసి?

దీనికి చాలా సుదీర్ఘమయిన రాజకీయ చరిత్ర ఉంది. అది తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీలో మొదలయింది. ఇంకా కొనసాగుతూ ఉంది. ఇపుడు కుప్పంలో కనిపిస్తున్న టిడిపి-వైసిపి వైరం, యూనివర్శిటీ కాలం నాటి చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి వైరమే నని చాలా మంది చెబుతారు. అంతా అంగీకరిస్తారు. ఆ రోజులో చంద్రబాబుది పై చేయి అయింది. పెద్దిరెడ్ది కంటే ముందే మంత్రిఅయిన చంద్రబాబు మీద ఇపుడు పెద్దిరెడ్డి కసి తీర్చుకుంటున్నారని వారి గొడవను కళ్లారా చూస్తున్న వాళ్ల సమకాలీకులు చెబుతున్నారు.


చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి


చంద్రబాబు నాయుడికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్వీ యూనివర్శిటీలో ప్రత్యర్థి వర్గాలకు నాయకత్వంలో వహించారు. నిజానికి పెద్దిరెడ్డి డిగ్రీ చదువుకునే రోజుల్లో చాలా మితభాషి, రాజకీయవాసనేం లేదు. యూనివర్శిటీ వెళ్లాకే ఆయన విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారని డిగ్రీ చదివేరోజులో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ లో ఆయన రూం (106) పక్కరూమ్ (రూంనెంబర్ 107) లో ఉన్న మిత్రుడొకరు చెప్పారు.

“వీళ్లిద్దరి మధ్య వైరం మొదట రెడ్డి వర్సెస్ నాన్ రెడ్డిగా ఉండింది. ఇది బాగా ముదిరి రెడ్డి వెర్సెస్ కమ్మ అయింది. ఈ వైరం ముదిరినందునే ఇద్దరు మొదట రాజకీయనేతల అండ కోరారు, ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత ఇద్దరు రాజకీయనాయకులయ్యారు,” అని పేరు రాసేందుకు ఇష్టపడని ఆయన చెప్పారు.

1975 నాటి మాట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోషియాలజీ లో ఎమ్మే చదువుతున్నారు. చంద్రబాబు ఎకనమిక్స్ లోఉన్నారు. ఆరోజు ల్లో ఎకనిమిక్స్ కమ్మవాళ్ల డిపార్లమెంటయితో, ఆంత్రోపాలజీ, సోషాలజీ, జియాగ్రఫీ రెడ్లవి. ఆ మరుసటి సంవత్సరం యూనివర్శిటిలో ఎలెక్షన్లు జరిగాయి. పెద్దిరెడ్డి చెర్మన్ గా పోటీ చేశారు. చంద్రబాబు పోటీ చేయలేదుగాని, పెద్దిరెడ్డిని ఓడించేందుకు పూనుకున్నారు. ఆపుడాయనకు రెడ్డి వ్యతిరేక అభ్యర్థికి మద్దతునిచ్చారు. అయినా పెద్దిరెడ్డి గెలిచారు.


ఆ రోజుల్లో చంద్రబాబు వర్గాన్ని ఓడించి పెద్దిరెడ్డి యూనివర్శిటి స్టూడెంట్ బాడీ చెయిర్మన్ అయ్యారు. తర్వాత గీతా నాథ్ అనే బిసి అభ్యర్థిని పోటీ పెట్టి చంద్రబాబు పెద్దిరెడ్డిని ఓడించారు.

ఆయన విద్యార్థి యూనియన్ ఛెయిర్మన్ గా ఉన్నపుడు రెడ్లి, కమ్మ కుల సమీకరణ బలపడిందిని ఆయన సమకాలీలంతా చెప్పారు.

పెద్దిరెడ్డి వర్గానికి రాజకీయ మద్దతు అవసరమయింది. రాజకీయనాయకులు కూడా రాయలసీమలోని ఒకే ఒక్క విశ్వవిద్యాలయమయిప ఎస్వీయు లో పట్టుకోసం ఆరాటపడ్డారు. అపుడు రామచంద్రారెడ్డికి నీలం సంజీవరెడ్డి ఆశీస్సులు లభించాయి. ఆయన సంజీవరెడ్డిని యూనివర్శిటీకి పిలిపించి తన ఇన్ ఫ్లుయన్స్ ప్రదర్శించారు.

ఇదే సమయంలో చంద్రబాబు అప్పటి ఎమ్మెల్సీ గల్లా రాజగోపాల్ నాయుడు మద్దతు సంపాదించారు. ఆయన చంద్రబాబుని ప్రొఫెసర్ ఎన్ జి రంగాకు పరిచయం చేశారు. ఆ రోజు రాష్ట్ర రాజకీయాల్లో రంగా, సంజీవరెడ్డిల మధ్య వైరం తీవ్రంగా ఉండేది. అది అందరికి తెలిసిందే

అలా వీళ్లిద్దరు రాజకీయాల బాటపట్టారు. వీళ్లిద్దరి రాజకీయ నేతల అండ దొరక్కపోయి ఉంటే, లెక్చరర్లో ప్రొఫెసర్లో అయిఉండేవారని వారిద్దరికి సన్నిహితుడయిన ఒక చిత్తూరు జిల్లా నాయకుడొకరు చెప్పారు.

ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు సివిల్స్ వైపు వెళ్లే ఆలోచనకూడా చేశారని ఆయన చెప్పారు. ఒకరు రంగా వల్ల, మరొక నీలం సంజీవరెడ్డి వల్ల ఉత్తేజితులయి రాజకీయాల్లోకి వచ్చారు.

చంద్రబాబు మెల్లిగా కాంగ్రెస్ లోకి వస్తే, పెద్దిరెడ్డి జనతా పార్టీ వైపు మళ్లారు. ఆయన నీలం సంజీవ రెడ్డి ప్రభావం వల్ల అపుడు కాంగ్రెస్ వ్యతిరేకిగా ఉన్నారు. ఎమర్జన్సీ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో పీలేరు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి సైఫుల్లా బేగ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయన సమితి ప్రెశిడెంటుగా కూడా పోటీ చేశారు. ఓడిపోయారు.

తర్వాత జనతా పార్టీ పతనంతో ఆయన కూడా కాంగ్రెస్ లో కి వచ్చారు. మళ్లీ పీలేరు నుంచి పోటీ చేశారు. ఈ సారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

అలా అపుడు రాజకీయాల్లో వరస పరాజయాలు ఎదురయ్యాయి. “విద్యార్థి దశలో లాగానే రాజకీయాల్లో కూడా రామచంద్రారెడ్డి పట్టుదలతో ఉన్నాడు. నిరాశ చెందలేదు. ఇద్దరిలో ఈ పట్టుదల ఉంది. అనుకున్నది సాధించాలనుకునే తత్వం వారిది కాకపోతే, చంద్రబాబు సాఫ్ట్ గా ఎత్తులు పైఎత్తులు వేస్తారు. పెద్దిరెడ్డి అగ్రెసివ్,’ అని వారి సమకాలీనుడైన ఒక రిటైర్డు ప్రొఫెసర్ చెప్పారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1989లో మాత్రమే అసెంబ్లీలో కాలు మోపగలిగారు.

ఇక అటు వైపు చంద్రబాబునాయుడు పోటీ చేసిన తొలి ఎన్నిక ల్లొనే(1978) గెలిచారు. ఎమర్జన్సీ తర్వాత జరిగిన ఈ ఎన్నికలో ఆయన కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేశారు. జనత పార్టీ నుంచి బాగా పేరున్న కొంగర పట్టాభిరామ చౌదరిని నిలబెట్టారు. ఆయనకు గాంధియన్ అని పేరుంది. అయినా సరే, చంద్రబాబే గెలిచారు. మెజారిటీ మాత్రం 2494 ఓట్లు మాత్రమే.

తర్వాత 1983లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి మేడసాని వెంకట రామానాయుడి చేతిలో 17,500 తేడా ఓట్లతో ఓడిపోయారు.

తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989లో ఆయన చంద్రగిరిని వదిలేసి కుప్పం వెళ్లారు.

దీనికి కారణం కూడా నేరుగా రామచంద్రారెడ్డి కాకపోయినా కమ్మ, రెడ్డి రాజకీయాలేనని చెబుతారు ఒక మాజీ ఐఎఎస్ అధికారి.

“చంద్రగిరిలో రెడ్లు, కమ్మలు ఇద్దరు బలమయిన వర్గమే. అందువల్ల పోటీ ఎపుడూ హోరా హోరీగా ఉంటుంది. ఇలా ప్రమాదం అంచున ఉండటం కంటే సురక్షితమయిన నియోజవర్గం అవసరమని చంద్రబాబు నాయుడు భావించి ఉండవచ్చ. కమ్మలు, రెడ్లు ఇద్దరు పెద్దగా లేని కుప్పం ఎంచుకున్నారని,” చంద్రబాబు, రామచంద్రారెడ్డిలిద్దరికి యూనివర్శిటీలో సన్నిహితంగా మెలిగిన ఈ ఐఎఎస్ అధికారి చెప్పారు.

“కుప్పంలో బిసిలు ఎక్కువ, అందునా గాండ్ల, వన్నికుల క్షత్రియులు ఎక్కువ. తెలుగుదేశం పార్టీ కి బిసిలలో ప్రాబల్యం ఉండటంతో కుప్పం ఎంచుకుని ఉండవచ్చు. అప్పటికి తెలుగుదేశం పార్టీకి బిసిలలో మంచి పట్టు దొరికింది. ఈ అండతో ఆయన ఇప్పటిదాకా గెలుస్తూ వస్తున్నారు,” ఆయన చెప్పారు.


కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం


చంద్రబాబును ఓడించేందుకు కుప్పంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదమే చేస్తూ వచ్చింది. అక్కడ బిసి అభ్యర్థికి బదులు రెడ్డినే నిలబెడుతూ వచ్చింది. ఎపుడై నాన్ రెడ్డిని నిలబెట్టినా ఆందులో కమిట్ మెంటు కనిపించేది కాదు. ఒకసారి ఓడితే రెండో దఫా సీటివ్వలేదు. ఫలితంగా రాజకీయ చతురుడయిన చంద్రబాబు బిసిల వోటు పోలరైజ్ చేసుకుని తిరుగులేని శక్తిగా వుంటూ వచ్చారు.

అయితే, ఈ రహస్యాన్ని వైసిపి నేత జగన్ కనిపెట్టారు. 2014 ఎన్నికల్లో ఆయన వన్నికల క్షత్రియ కులానికి చెందిన చంద్రమౌళి అనే మాజీ ఐఎఎస్ అధికారిని ఎంపిక చేశారు. ఈ వ్యూహం బాగా పనిచేసింది. ఆయన ఓడిపోయినా చంద్రబాబు మెజారిటీని చంద్రమౌళి బాగా తగ్గించారు.

అందుకే 2019 లో మళ్లీ చంద్రమౌళినే నిలబెట్టారు. ఈ సారి చంద్ర బాబు మెజారిటీ ఇంకా తగ్గింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. తెలుగుదేశం వారిలో ముచ్చెమటలు మొదలయ్యాయి.

కారణమేమిటోగాని, ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి వైషమ్యం తీవ్రమయింది. వ్యక్తిగత స్థాయికి పెరిగింది. ఇలాంటి వైషమ్యం దేశంలో ఏ ఇద్దరు ప్రత్యర్థి నేతల మధ్య ఎక్కడా కనిపించదు. చంద్రబాబుని కుప్పం నుంచి తరిమేయాలని, టిడిపి అసలు అసెంబ్లీలో కనిపించకుండా పోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లున్నారు. ఆయన ఉపన్యాసాలు దీనిని స్పష్టంగా వెల్లడిస్తాయి. వైనాట్ 175 అనే స్లోగన్ లో అంతరార్థం అదే కదా.

ఈ టిడిపి లేని అసెంబ్లీ పూర్తి చేసేందుకు ఆయన చంద్రబాబు బాబు పాత ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరైర వాడని భావించారు. ఆయన్ని రంగంలోకి దించారు. పెద్దిరెడ్డి ఏకంగా కుప్పంలో మకాం వేశారు. చంద్రబాబు నాయుడికి, నియోజక వర్గానికి దూరం పెరిగితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాగా శ్రమించి, ఓటర్లు కు బాగా దగ్గిరయ్యారని కొంతమంది చంద్రబాబు హితులు కూడా అంగీకరించారు.

దానికి తోడు పెద్దిరెడ్డి ‘రెడ్డి’ ముఖ్యమంత్రుల హయాంలో కాంట్రాక్టర్ గా విజయవంతమయ్యారు. ఆర్థికంగా బలపడ్డారు. అన్నివిధాల చంద్రబాబుతో ఢీ కొనగల సత్తా సంపాదించుకున్నారు.

పెద్దిరెడ్డిది పై చేయి ఎలా అయింది?

తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు శైలిలో మార్పు వచ్చింది. నిజానికి బాగ డిసిప్లిన్ ఉన్ననాయకుడని చంద్రబాబు పేరుంది. ఈ విషయంలో ఆయనను అభిమానులే కాదు, రెడ్లు కూడా ప్రశంసిస్తారు. అధికారంతో పాటు వచ్చే సమస్యల వల్ల చంద్రబాబుకి పాత స్నేహితులంతా దూరమయ్యారు. యూనివర్శిటీలో ఆయనతో ఉండి, ఆయన కోసం దెబ్బలు తిన్న నాయకులు కూడా దూరమయ్యారు. కొత్త వాళ్లు, ముఖ్యంగా వ్యాపారస్థులు, ఆయన చుట్టూ చేరారని చెబుతారు. దీన్ని చూసి తనక ఆకర్షణ బాగా పెరిగిందని చంద్రబాబు భావించారు.

2019లో అధికారం పోయాక అసలు విషయం బయటపడింది. చంద్రబాబు చుట్టూర వున్న విఐపిలెవరూ ఎన్నికల యుద్ధానికి పనికిరారని తేలిపోయింది. వాళ్లను వెంటేసుకుని చంద్రబాబు ఎన్నికల్లో తలపడ్డారని అందుకే ఘోర పరాజయం ఎదురయిందని చాలా మంది విమర్శిస్తారు .

అధికారం పోయాక వైసిపి చేస్తున్న ఉధృత ప్రచారం నుంచి కార్యకర్తలను కాపాడుకోవడం కష్టమయిందని తెలుగుదేశం నేత ఒకరు చెప్పారు. కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ప్రచారమే జరగలేదు. అటు వైపు వైసిపి యుద్ధానికి తలపడ్డట్లు పనిచేసింది. దీనితో టిడిపి క్యాడర్ హడలెత్తిపోయింది.

కుప్పం ఫలితాలు స్థానిక టిడిపిలో బెదురు పుట్టించాయి. చంద్రబాబు ఒక్కసారి కుప్పానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి పర్యటనలే పర్యటనలు. ఈ పర్యటనలతో పాటు, అపుడపుడు ఆయన కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరీ కూడా కుప్పంద సందర్శిస్తున్నారు. దీనివల్ల టిడిపి కార్యకర్తలతో కొంత భరోసా వచ్చిందని  స్థానికులు చెబుతున్నారు. " చంద్రబాబు రెట్టించిన కాన్ సెంట్రేషన్, వైసిపి పట్టుదలతో ఈ సారి కుప్పం ఎన్నిక చాలా ఆసక్తి ఉంటుంది," స్థానిక జర్నలిస్టు అస్గర్ అలీ చెప్పారు.

కుప్పంలో చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి

జగన్మోహన్ రెడ్డి కుప్పం బాధ్యతను అప్పగించాక పెద్దిరెడ్డి ఎక్కువ సమయం కుప్పానికే కేటాయించారు. దీనితో యూనివర్శిటీ నాటి చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి గొడవ కుప్పంలో పునరావృతమయింది. అయితే, ఇపుడు ఫీల్డ్ లో చంద్రబాబు పేరు తప్ప మనిషి లేడు. ఎక్కడ చూసినా పెద్దిరెడ్డియే కనిపించారు. యూనివవర్శిటీలో వారిద్దరు ముఖాముఖి కొట్టుకున్న సందర్భాలున్నాయని చెబుతారు. ఈ గొడవల్లో పెద్దిరెడ్డికి బాగానే గాయలయ్యాయని, పెద్దగా గాయాలు కాకుండా చంద్రబాబు తప్పించుకున్నాడని నాటి విద్యార్ధి నాయకుడొకరు చెప్పారు.

‘ఆ గొడవల్లో కత్తి పోట్లు కూడా జరిగాయి. ఒక సారి ఇరువర్గాలు భీకరంగా దాడి చేసుకున్నాయి. కత్తులు ఝళిపించుకున్నాయి. చంద్రబాబు మీద కత్తి వేటు పడబోయింది. అపుడు ఆయన మిత్రుడొకరు అడ్డుకున్నారు. కత్తి దెబ్బ ఆయనకు తగిలింది. రాజకీయాల్లోకి వచ్చాక ఆ సాయానికి గుర్తింపుగా ఆయనకు చంద్రబాబు ఒక దఫా తిరుపతి ఎమ్మెుల్యే చాన్స్ కూడా ఇచ్చారు.’ అని పేరు రాసేందుకు ఇష్టపడిన వారి మిత్రుడొకరు తెలిపారు.

ఈ రెండు ముఠాల గొడవ వల్ల యూనివర్శిటిలో హింసాత్మక సంఘటనలు తరచూ జరిగేవి. ఎపుడూ క్యాంపస్ ఉద్రిక్తంగా ఉండేది. అపుడు చంద్రబాబు మీద జరిగిన దాడుల్లో పాల్గొన్న వాళ్లలో కొందరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో ప్రొఫెసర్లు, వైస్ చాన్స్ లర్ అయ్యారని కూడా చెబుతారు. మొత్తానికి ఎస్ వి యూనివర్శిటి కమ్మ వర్సెస్ రెడ్డి పాలిటిక్స్ కి కేంద్రంగా ఉండింది.

ఈ రాజకీయ తగాదా తత్తర పాటు చంద్రబాబు ఇపుడు సాగిస్తున్న కుప్పం యాత్రలో, ఆయన ఉద్రేక ప్రసంగాలలో కనిపిస్తుంది. 2024లో ఏమవుతుందో వూహించడం కష్టం.

ఇద్దరు నేతల నాటి తగాదా ఇపుడు కుప్పానికి ఇలా పాకింది. చంద్రబాబుని ఓడించేందుకు పెద్దిరెడ్డి కదన కుతూహలంతో ఉన్నారు. రెడ్లతో వేగలేకనే సురక్షితమని చంద్రబాబు చంద్రగిరికి 250 కిమీ దూరాన ఉన్న కుప్పానికి వచ్చారు. అయితే, పెద్దిరెడ్డి ఆయన వెంటబడ్డారు. కుప్పాన్ని చంద్రబాబు కాపాడుకోగలరా?


Tags:    

Similar News