TDP MAHANAADU|టీడీపీకి 'కార్యకర్తే అధినేత'.. రాజకీయంగా ప్రోత్సాహం
పార్టీ నిర్మాణంలో కార్యకర్తల త్యాగాలకు గుర్తింపు ఇస్తాం అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-27 09:53 GMT
కడపలో జరుగుతున్న టిడిపి మహానాడులో గతానికి భిన్నంగా కార్యకర్తలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. వారి సంక్షేమం, రాజకీయ పదవులకు ప్రోత్సాహం ఇవ్వాలనే దిశగా అడుగులు పడ్డాయి. ఇందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు సాగించిన యువగళం పాదయాత్రతో లభించిన ఫలితాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యతకు ఆస్కారం ఇవ్వడానికి తెర తీశారు. దీనిలో కూడా నారా లోకేష్ మార్కు కనిపిస్తోంది.
ఈ మహానాడులో టీడీపీ ప్రస్థానాన్ని వివరించిన సీఎం ఎన్. చంద్రబాబు భవిష్యత్తు కార్యాచరణను మంగళవారం టీడీపీ మహానాడులో ఆవిష్కరించారు.
"తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి కార్యకర్తల త్యాగాలపై విజయాలు సాధిస్తున్నాం" అని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సీఎం ఎన్. చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
"రాష్ట్రంలో కార్యకర్తల కష్టానికి గుర్తింపు ఇస్తాం. గౌరవం కల్పిస్తాం. వారి సంక్షేమానికి ఇకపై పెద్దపీట వేస్తాం" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కడప వద్ద జరుగుతున్న టిడిపి 43వ మహానాడు ప్రారంభ సూచకంగా, పార్టీ నిర్మాణం ప్రస్థానంపై కీలక ఉపన్యాసం చేశారు.
"గతానికి భిన్నంగా టిడిపి పునాదుల నుంచి పటిష్టం చేయడానికి శ్రమించిన, త్యాగాలు చేసిన కార్యకర్తలు వారి కుటుంబ సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం" అని మహానాడు వేదిక గురించి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా అండగా నిలవడమే కాదు, వేధింపులకు బలహీన వారి త్యాగాలను వృధా కానివ్వమని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలో సీనియర్లను గౌరవిస్తూనే, యువతను ప్రోత్సహించడానికి, కష్టపడే వారికి మద్దతుగా టిడిపి అండ ఉంటుందని ఆయన ధైర్యం చెప్పారు.
చంద్రయ్య హత్యకే వుదంతాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యర్థులు గొంతు కోస్తున్న జై తెలుగుదేశం అనే నినదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
లోకేష్ కు కితాబు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు తాను నిర్వహించిన వస్తున్నా మీకోసం యాత్రను ఆశీర్వదించారనీ ఆయన అన్నారు. ఏ సమయంలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర రాజకీయ చిత్రాన్నే మార్చిందని, ప్రజల ఆలోచన సరళిని పూర్తిగా పునరా ఆలోచనలో పడేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, నారా లోకేష్ అనుసరించిన విధానాన్ని చంద్రబాబు అభినందించారు.
టిడిపికి ముందు తర్వాత
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండు విభాగాలుగా పరిశీలించాలని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. టిడిపి ఆవిర్భావానికి ముందు.. ఆ తర్వాత ఎలా ఉండేదనే విషయాన్ని ఆయన సోదాహరణలతో వివరించారు.
"టిడిపి అనుసరిస్తున్న విధానాలు, పద్ధతులతో ట్రెండ్ సెట్టర్గా ఉంది.. సంస్కరణలకు తమ పార్టీ బ్రాండ్ అంబాసిడర్" గా నిలిచిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకు నిదర్శనం పార్టీ నీతి నియమాలు, నిజాయితీ, నిబద్ధతతో పని చేయడం, పాలన సాగించడమే నిదర్శనమని అన్నారు
సంస్కరణ విషయానికి వస్తే, ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న పటేల్, పట్వారి వ్యవస్థను రద్దు చేయడం, బాలికా విత్తనం ప్రోత్సాహించి, ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసే విధానానికి అంకురార్పణ చేసిన విషయాన్ని చంద్రబాబు విశ్లేషించారు.
సంక్షేమాన్ని ప్రస్తావిస్తూ రూ. 30 నుంచి వృద్ధుల పింఛన్లు నాలుగు వేలకు పెంచిన ఘనత టిడిపికి మాత్రమే దక్కిందని ఆయన అన్నారు.
కరువుసీమకు ప్రాధాన్యం
కరువుకు మారుపేరుగా ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కాలంలోనే సంస్కరణలకు బీజం వేసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. "హంద్రీనీవా సుదల స్రవంతి, గాలేరు నగరి ప్రాజెక్టు అమలు చేయడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాం" అని గుర్తు చేశారు.
పోలవరం పూర్తిచేసి ప్రతి ఎకనారకు సాగునీరు అందించే విధంగా బనకచర్ల వరకు నదుల అనుసంధానాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు.
శాసించే స్థాయికి బీసీలు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కొన్ని సామాజిక వర్గాలు పనులు, పదవుల కోసం అభ్యర్థించే స్థాయిలో ఉన్నాయి. ఆ కోవలో టిడిపి బీసీ వర్గాలకు పెద్దపీట వేసిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అభ్యర్థి స్థాయిలో ఉన్న బీసీ సామాజిక వర్గాలను అధికారంలో భాగస్వామ్యం కోసం నిలదీయడమే కాదు శాసించే స్థాయికి తీసుకువచ్చామన్నారు. ఆ సామాజిక వర్గానికి టిడిపిలోనే పెద్ద ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని మరిచిపోకూడదన్నారు.
విజన్ స్వర్ణాంధ్ర..
దేశ సౌభాగ్యం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోది వికసిత భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఎందుకు ఏమాత్రం తీసిపోకుండా రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి విజన్ స్వర్ణాంధ్ర కు నాంది పలికామని చంద్రబాబు గుర్తు చేశారు.
"వెల్తి, హెల్తీ, హ్యాపీ సొసైటీ" (సంపద సృష్టి, ఆరోగ్యవంతమైన సమాజం, సంతోషకరమైన రాష్ట్రం)గా తీర్చిదిద్దడానికి టిడిపి కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. P-4 కార్యక్రమం ద్వారా స్వర్ణాంధ్ర విజన్ కోసం నిర్దేశించుకున్న 2047 నాటికి పేదరికం లేని సమాజం నిర్మాణం చేయడానికి పరిశ్రమిస్తాం. ఎందుకో పార్టీ శ్రేణులు కూడా మమేకం కావాలి అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ముసాయిదా అంశాలపై మూడు రోజుల టిడిపి మహానాడులో చర్చించనున్నారు.. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎం చంద్రబాబు తన ప్రారంభ ఉపన్యాసంలో ప్రవేశపెట్టిన ముసాయిదా అంశాలపై ప్రతినిధులు చర్చించి తీర్మానాలు చేయనున్నారు.
కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో తీసుకునే నిర్ణయాలతో రానున్న నాలుగేళ్ల కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత వేగం పెంచడానికి దోహదం చేస్తాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.