
తిరుపతి కొండల్లో సముద్రపు శిలాజాలు
ఈ కొండలు మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రపు లోతుల్లో ఉండేదని చెప్పడానికి ఆనవాళ్లా.
శేషాచలం కొండల రాళ్లలో సముద్రపు శిలాజాలను పరిశోధకులు కనుగొన్నారు. ఇది మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం సముద్రంలో మునిగివున్నట్లు చెప్పడానికి సజీవ సాక్ష్యం. ఈ కనుగొల్పు తూర్పు కనుమల భౌగోళిక చరిత్రపై కొత్త వెలుగును ప్రసారం చేస్తోంది.
శేషాచలం కొండలు జీవవైవిధ్యానికి నిలయం మాత్రమే కాకుండా, మతపరమైన ప్రాముఖ్యతను కలిగిఉన్న తిరుమల ఆలయానికి కేంద్రంగా ఉన్నాయి. ఈ కొండలు ప్రధానంగా క్వార్ట్జైట్, షేల్ రాళ్లతో ఏర్పడినవి. తాజాగా కనుగొనబడిన సముద్ర జీవుల అవశేషాలతో కూడిన పెంకులు, ఈ శేషాచల కొండలు ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉన్నాయని సూచిస్తున్నాయి
భూవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ శిలాజాల ఆధారంగా శేషాచలం ప్రాంతం ప్రొటెరోజోయిక్ లేదా పాలియోజోయిక్ యుగాల్లో సముద్ర మట్టానికి దిగువన ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో భారత ఉపఖండంలోని అనేక ప్రాంతాలు లోతైన సముద్రాల్లో ఉండేవి. మిలియన్ల సంవత్సరాలుగా భూపొరలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికల కారణంగా ఈ ప్రాంతం క్రమంగా పైకి లేచి, చివరికి శేషాచలం కొండలు తన ప్రస్తుత రూపాన్ని దాల్చాయి.
భౌగోళిక ప్రాముఖ్యతతో పాటు, ఈ పరిశోధన శేషాచలం కొండల సమృద్ధమైన చరిత్రకు మరో కొత్త అధ్యాయాన్ని జోడిస్తుంది.
రాతి పొరలలో నిక్షిప్తమైన ఈ శిలాజాలను గుర్తించిన ప్రకృతి ఔత్సాహికుడు డాక్టర్ యమ్. గోవిందరాజ భాస్కర్, అసిస్టెంట్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ మాట్లాడుతూ, “శేషాచలం కొండల్లో సముద్రపు శిలాజాలు ఉండడం వల్ల ఈ ప్రాంతం ఒకప్పుడు సముద్రానికి దిగువన ఉండేదన్నదానికి బలమైన సాక్ష్యాన్ని అందిస్తుందన్నారు.
ఇది భారత ఉపఖండంలో మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రపు లోతుల్లో ఉండేదని సూచించే గత భౌగోళిక అధ్యయనాలకు అనుగుణంగా ఉంది” అని తెలిపారు.
ఈ సంచలనాత్మక ఆవిష్కరణ పరిశోధకులలో మరియు పర్యావరణవేత్తలలో ప్రగాఢ ఆసక్తిని రేకెత్తించింది, ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశంలోని ప్రాచీన వాతావరణ పరిస్థితులను, భౌగోళిక పరిణామాలను అర్థం చేసుకోవడంలో కీలకంగా మారుతోంది.
కార్బన్ డేటింగ్ మరియు స్ట్రాటిగ్రాఫిక్ విశ్లేషణల వంటి తదుపరి అధ్యయనాలు, ఈ ప్రాంతం సముద్ర వాతావరణం నుండి ప్రస్తుత భౌగోళిక రూపానికి ఎలా మారిందో స్పష్టమైన కాలక్రమాన్ని వెల్లడించగలవని నిపుణులు భావిస్తున్నారు.
ఈ శేషాచల కొండలు ఇప్పటికే పురాతన దేవాలయాలతో వైవిధ్యమైన వృక్షజంతు సంపదతో బయోస్పియర్ రిజర్వ్గా విశేష గుర్తింపు పొందాయి. ఈ తాజా కనుగొల్పుతో శేషాచలం ప్రాంతం మరింత శాస్త్రీయ ఆసక్తికి కేంద్రంగా మారుతోంది.
శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఈ పరిశోధన ద్వారా భారత ఉపఖండ భౌగోళిక పరిణామాలలో శేషాచలం కొండల స్థానాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆసక్తి చూపుతారు అదనంగా, ఈ ప్రాంతంలో మరిన్ని సముద్రపు శిలాజాల ఉనికిని నిర్ధారించేందుకు పరిశోధక బృందం భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేపట్టాలని యోచిస్తోంది.
ఈ ఆవిష్కరణ ధృవీకరించబడితే, శేషాచలం కొండలు చరిత్రపూర్వ కాలంలో సముద్ర వాతావరణాలపై జరుగు పరిశోధనల్లో కీలకమైన ప్రదేశంగా మారవచ్చు.
పరిశోధనలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కనుగొల్పు మన భూమి యొక్క నిరంతర మార్పులను మరియు మిలియన్ల సంవత్సరాలుగా శిలలలో దాగి ఉన్న అపూర్వ గాథలను వెలుగులోకి తెచ్చే అవకాశాన్ని అందిస్తోంది.
బాలపల్లి ఫారెస్ట్ రేంజర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, శేషాచలం అడవులు అనేక నిగూఢ రహస్యాలను కలిగి ఉన్నాయని, వీటిపై మరింత లోతైన పరిశోధనలు జరిపితే, మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కొండల విశేషాలను భవిష్యత్ తరాలకు అందించవచ్చని తెలిపారు.
ఇది కూడా చదవండి
తిరుమల కొండల్లో శ్రీలంక సర్పాలు...
తిరుపతి జనావాసాల్లోకి చిరుత పులులు ఎందుకు వస్తున్నాయి?