ముందు ముందు కెసిఆర్ కు మరిన్ని సవాళ్లు

ఇప్పుడు జరిగింది కాస్తే..ముందు చాలా ఉంది.. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. తను పూర్తిగా ఓడిపోలేదని చెప్పేందుకు కెసిఆర్ కు మరొక అవకాశం

Update: 2023-12-11 09:06 GMT
KCR (File)

అసెంబ్లీ ఎన్నికలయితే ముగిశాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌ ‌రెడ్డి(CM Revanth)ముఖ్యమంత్రి అయ్యారు. పాలన చురుగ్గా సాగుతోంది. మరో యుద్ధానికి రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. 

లోక్‌సభ (Lok Sabha), ఎమ్మెల్సీ(MLC), స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్‌ ‌స్థానాలకు, మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిల్లో ఆయా పార్టీలు తమ బలాన్ని పెంచుకోనున్నాయి. ఇది తానింకా పూర్తిగా ఓడిపోలేదుని చాటుకునేందుకు బిఆర్ ఎస్ కు ఇది మంచి అవకాశం. రాష్ట్ర రాజకీయాల మీద మరింత పట్టు సాధించేందుకు కాంగ్రెస్ కుమరొక ఆవకాశం. తనకు తెలంగాణలో పట్టుదొరికిందని నిరూపించుకునేందుకు బిజెపి కూడ ఈ ఎన్నికలు మరొక అవకాశం. ఇవన్నీ లోక్ సభ ఎన్నికలకు ముందు వస్తున్నందున, వీటి ప్రభావం పార్లమెంటు ఎన్నికల మీద తప్పకు ఉంటుందని చాలా  మంది పరిశీలకుల అభిప్రాయం.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు..

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) జనవరి లేదా ఫిబ్రవరిలో 12,750 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్లకు లేఖ కూడా రాసింది.

గతంలో మూడు దఫాలుగా..

గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో మూడు దశల్లో నిర్వహించారు. వారి పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించవచ్చని ఎస్‌ఈసీ అధికారులంటున్నారు. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కొత్త పంచాయతీలకు నిర్వహిస్తారా?

తెలంగాణలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి..ఫైల్‌ను గవర్నర్‌ ‌తమిళిసైకి పంపింది గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం. అది ఆమె దగ్గర పెండింగ్‌లో ఉంది. దానిపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే.. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎస్‌ఈసీ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.

బల నిరూపణలో పార్టీలు..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌రూరల్‌ ఏరియాలో సత్తా చాటలేకపోయింది. ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుని తమ బలాన్ని పెంచుకునే యోచనలో గులాబి నేతలున్నారు. తామేం తక్కువ కాదన్నట్లు.. కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఫలితాలు రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సహాయపడతాయి గనక.

బీజేపీ కూడా..

14 శాతం ఓట్ల శాతాన్ని పెంచుకున్న బీజేపీ కూడా.. ఈ సారి లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించే అవకాశం ఉంది.ఎస్‌ఈసీ లోక్‌సభ ఎన్నికల తర్వాత, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలను (ఎంపీటీసీ, జడ్పీటీసీ) నిర్వహించే యోచనలో ఉంది. మే, జూన్‌ మాసాల్లో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ల ఎంపిక జరిగిపోతుంది. ఇప్పటికైతే 80 శాతం మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ల్లో గులాబీ పార్టీ వాళ్లదే పైచేయిగా ఉంది. బీఆర్‌ఎస్‌ 7,600 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోగా కాంగ్రెస్‌ పార్టీ 2,700 పంచాయతీల్లో సత్తా చాటింది.

ఎమ్మెల్సీ పదవులకు సైతం..

కొంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో వారు తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. రాజేశ్వర్‌ రెడ్డి వరంగల్‌-ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్యే కోటాలో గెలిచారు. మరికొన్ని మాసాల్లో ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా, కొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించవచ్చు. ఎమ్మెల్సీల నామినేషన్‌కు సంబంధించి బీఆర్‌ఎస్‌ గతంలో ఇద్దరి పేర్లను గవర్నర్‌ ముందుంచింది. అయితే వారి అర్హతపై గవర్నర్‌ అభ్యంతరం తెలిపారు.

Tags:    

Similar News