తెలంగాణ ఎన్నికలు... ఏపీలో ప్రకంపనలు

ఏపీ ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటుందా?

Byline :  The Federal
Update: 2023-12-03 11:43 GMT
ap votars (file photo)

ఏపీ ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటుందా?

తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో ప్రకంపనలు సృష్టించాయి. కాంగ్రెస్‌ పార్టీ విజయంపై అప్పుడే ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తూ వ్యంగాస్త్రాలు విరురుతున్నాయి. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి ఏమిటని రాష్ట్రమంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానిస్తే కాంగ్రెస్, టీడీపీ మధ్య రహాస్యబంధం బయట పడిందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దుమ్మెత్తి పోశారు. టిడీపీ వారు కూడా ధీనిని ఘాటుగానే తిప్పికొట్టారు. నిరంకుశ ప్రభుత్వాలు ఎక్కడున్నా నేలపాలు కావాల్సిందేనని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. రేవంత్‌ విజయంపై తర్వాత మాట్లాడతానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం గమనార్హం.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో నేతలు బాణసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.తెలంగాణలో వచ్చిన మార్పు ఆంధ్రలో కూడా వస్తుందని ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత దేవరపల్లి రంగారావు వ్యాఖ్యానించారు, “ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచేందుకు తెలంగాణలో రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేసి విజయవంతమయ్యారు.అలాగే ఆంధ్రలో కూడా పార్టీ పునరుజ్జీవం పొందుతుంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ గెలుపుతో ఆంధ్రలో కాంగ్రెస్ పట్ల ప్రజల వైఖరిలో పెద్ద మార్పు వస్తుందని ఎపిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్అన్నారు. ఫెడరల్ – తెలంగాణతో తెలంగాణ ఫలితాల మీద మాట్లాడుతూ “ ఆంధ్ర ప్రదేశ్ ఒక వైపు తెలంగాణలో, మరొక వైపు కర్నాటకలో కాంగ్రెస్ ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ మీద తప్పక పడుతుంది. దళితులు, బిసి, పేదలు కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తారు. తెలుగుదేశం, వైసిసి ప్రభుత్వాల తీరు చూశాక, వారి పరిపాలనలో జరుగుతున్న అవకతవకలు చూశాక, ప్రజలు ప్రత్యామ్నాయం వైపుచూస్తున్నారు. వాళ్ల కాంగ్రెస్ వైపు వస్తారు,” అని గౌతమ్ అన్నారు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో నేతలు బాణసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.తెలంగాణలో వచ్చిన మార్పు ఆంధ్రలో కూడా వస్తుందని ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత దేవరపల్లి రంగారావు వ్యాఖ్యానించారు, “ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచేందుకు తెలంగాణలో రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేసి విజయవంతమయ్యారు.అలాగే ఆంధ్రలో కూడా పార్టీ పునరుజ్జీవం పొందుతుంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. బయటికి మద్దతు ప్రకటించకుండా లోలోపల తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు సపోర్టు చేసింది. ఇలాగే తెలంగాణ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి సహకరిస్తుందా అనేది చర్చనీయంగా ఉంది. దక్షిణాది  ఇపుడు పూర్తిగా బిజెపిని తిరస్కరించనట్లు కావడంతో బిజెపి పట్ల తెలుగుదేశం పార్టీదోరణి మారుతుందా అనేది కూడా చర్చల్లో ఉంది.

తెలంగాణలో రంగారెడ్డి జిల్లా, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ బలం తగ్గలేదు. నిజంగా ఆంధ్రప్రాంతానికి చెందిన వారు సిటీలో, రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో ఎక్కువగానే ఉన్నారు. వీరంతా కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఉంటే ఈ రెండు ప్రాతాల్లోనూ కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చేవి.  హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న ఆంధ్రా సెటిలర్లు చాలా మటుకు వ్యాపారస్థులు కావడంతో వాళ్లు బిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఓటేసేందుకు జంకి ఉండవచ్చు.  ఎందుకంటే, మళ్లీ  బిఆర్ ఎస్ అధికారాంలోకి వస్తే సమస్యలు ఎదురవుతాయి. ఈ ధోరణి వల్లే  హైదరాబాద్ పరిసరాల్లో బిఆర్ ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయని రాజకీయ వ్యాఖ్యాత దొంతి నరసింహారెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో ఉంచుతుంది. వైఎస్సార్‌సీపీలో ఉన్న వారంతా దాదాపు కాంగ్రెస్‌ వాదులే. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి వారంతా వైఎస్‌ జగన్‌ వైపు నిలిచారు. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలన చూసిన తరువాత ఓటర్ల నాడి ఎలా ఉంటుందనేది ఆలోచించాల్సిందే. కాంగ్రెస్‌ అభ్యర్థులకు గతంకంటే కాస్త ఓట్ల శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

సామాన్య ఓటర్లు తమ ఓటును ఎవరికి వెయ్యాలనే విషయంలో కాస్త గోప్యతను పాటిస్తున్నారు. తటస్తులు, కాంట్రాక్టర్లు, ఇన్‌కంట్యాక్స్‌ పేయర్స్, ఉద్యోగ వర్గాల్లో కొంతమంది, ఒక సామాజిక వర్గానికి చెందిన వారిలో ఎక్కువ శాతం వైఎస్‌ జగన్‌ పాలనను వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం జగన్‌ తనకు పెద్దల ఓట్లు వద్దని, తన వల్ల సాయం పొందామని భావిస్తేనే ఓట్లు వేయాలంటూ సభల్లో పిలుపు నిస్తున్నారు. ఇది పెద్దోళ్లకు, పేదోళ్లకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధమని వర్ణిస్తున్నారు.
ఇటువంటి పరిణామాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక్కటై ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. తెలంగాణ పరిస్థితులు వేరు, ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు అనే వాదన కూడా ఉంది. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ పాత్ర కూడా మరువలేనిదనే వాదన ఉంది. నిజంగా జనసేనకు తెలంగాణలో బలం ఉంటే కనీసం ఒక్కసీటైనా వచ్చి ఉండాలి. లేదా డిపాజిట్లైనా దక్కించుకోవాలి. అదేదీ తెలంగాణ ఎన్నికల్లో కనిపంచలేదు.
కాబట్టి తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉండే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కర్యదర్శి కెవివి ప్రసాద్‌ అన్నారు. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓటును ఎలా రాబట్టుకోవాలనేది ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనపై ఉంది. ఆ ఓటును రాబట్టుకోలేని పక్షంలో ఎవరి బలాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News