వీళ్లు వెలుగులు పంచారు! ప్రభుత్వం చీకటి నింపింది!
వెలుగులు పంచిన గిరిజన మహిళల జీవితాల్లో చీకటి వ్యథ!;
రెక్కాడితే కానీ డొక్కాడని అతి సాధారణ గ్రామీణులు, నిరంతరం బతుకు పోరాటంలో నలిగిపోతున్న స్త్రీలు.... ఎవరికీ పట్టని, ఆదీవాసీలు కూడా ఒక జలవిద్యుత్కేంద్రమే కట్టారు. ఆ మహిళలకు అండగా,చేదోడు వాదోడుగా నిలిచింది AP రాష్ట్ర ప్రభుత్వం. ఏకంగా ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వారిని సెక్రటేరియట్కి ఆహ్వానించి, వారితో ఎంఓయు కుదుర్చుకొని జలవిద్యుత్ కేంద్రానికి వారిని యజమానులుగా మార్చారు.
వేటమామిడి జలవిద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ గేట్
ఇదంతా 2006లో జరిగింది. నిర్మాణ పనులు పూర్తి అయి, 2010 నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. అలా వారు ,1.2 మెగావాట్ల సామర్థ్యం ( సుమారు 1000 నుండి 1200 ఇళ్లకు విద్యుత్ సరఫరా) కలిగిన చిన్న తరహా జల విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తు, ఏడాదికి కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని తెస్తున్నారు.
అయితే నీళ్ల నుండి విద్యుత్ తీస్తున్న వీరికి గత రెండేళ్లుగా కన్నీళ్లే మిగిలాయి.
రంపచోడవరం ఐటీడీఏ అధికారులు వారి గౌరవ వేతనం ఆపేశారు. ఊరి అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వారిని కేవలం సంతకాలకే పరిమితం చేసి, ప్రాజెక్ట్ అభివృద్ధి పనులకు దూరం పెడుతూ అంతులేని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది?
రాజమండ్రి నుండి వంద కిలోమీటర్ల దూరంలో అడ్డతీగల మండలంలో ఉంది వేట మామిడి గ్రామం. అక్కడ ఉన్న 500 కుటుంబాలంతా గిరిజనులే. చేపల వేట, వరి,జీడిమామిడి పంటలు వీరి జీవనాధారం.
వేటమామిడిలో జలవిద్యుత్ కేంద్రం నిర్వహణలో గిరిజన మహిళలు
అక్కడే ప్రవహిస్తున్న ఏలేరు నదిపై ఈ హైడల్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రణాళిక మొదలైంది.
వేటమామిడి గ్రామం పక్కనుండి పారుతున్న ఏలేరు నది
ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన గ్రామాలలో సహజంగా ఏర్పడిన నదులు, వాగులు, వంకలలో ప్రవహించే నీళ్ళ నుండి విద్యుత్ ఉత్పత్తిచేయడం, ఆ ఆదాయంతో స్థానిక గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచి వారి గ్రామాల అభివృద్ధికి తోడ్పడేలా మినీ హైడల్ పవర్ ప్రాజెక్టులను స్థాపించాలనే లక్ష్యంతో ‘ ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యుత్ సంస్థ’ ఏర్పాటయింది.
రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఏలేరు నదిపై వేట మామిడి, మిట్టపాలెం, పింజరికొండ గ్రామాల వద్ద 1.20 మె.వా. సామర్థ్యంతో, 3 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టారు.
నాబార్డ్ ఆర్థిక ఆసరా
ఎపి ట్రిప్కో సంస్థ జలవిద్యుత్ ప్రాజెక్టురూపకల్పన అనంతరం ఆర్థిక నిధులు కోసం నాబార్డ్ను సంప్రదించగా, రాష్ట్రంలోని పలు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటునందిస్తున్న జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ట్రిప్కో సంస్థకు రుణం ఇవ్వడానికి ఆనాటి నాబార్డు సీజీఎం పాలాది మోహనయ్య ముందుకు వచ్చారు.
‘ఈ మినీ జలవిద్యుత్ కేంద్రం వల్ల గిరిజన మహిళలకు కొంత చేయూత, వారి గ్రామాలు అభివృద్ధిని నిధులు అందుతాయనే ఉద్దేశ్యంతో నాబార్డ్ ఈ ప్రాజెక్ట్కు సహకరించడానికి ముందుకు వచ్చింది. ఆ మహిళలు పెద్దగా చదువుకోక పోయినా ప్రాజెక్ట్ని సూపర్ వైజ్ చేయడానికి తగిన శిక్షణ ఇచ్చారు. వారి నిర్వహణలో విజయవంతంగా ఉత్పత్తి మొదలైంది.
ఆ సందర్భంగా వారిని హైదరాబాద్లోని నాబార్డ్ కార్యలయానికి ఆహ్వానించి సత్కరించాం.’’ అన్నారు పూర్వ నాబార్డ్ సీజీఎం మోహనయ్య గారు.
ప్రాజెక్ట్ నిర్వాహణ గిరిజన మహిళలకే...
పవర్ ప్రాజెక్టుతో స్ధానిక గిరిజనులు స్వయంసమృద్ధి సాధించాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దీని కోసం జలవిద్యుత్ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను 19 మంది గిరిజన మహిళలతో ఏర్పాటయిన ‘ ట్రైబల్ వుమెన్ పవర్ ప్రాజెక్టుకమిటీ అసోసియేషన్ ఆఫ్ది వేటమామిడి’ కి ప్రభుత్వం అప్పగించింది.
విద్యుత్ ఉత్పత్తి, యంత్రపరికరాల నిర్వహణ,పవర్ హౌస్ నిర్మాణం, టర్బైన్ను పనిచేయించడం, పరిశరాలను పరిశుభ్రంగా ఉంచడం లాంటి విషయాల్లో మహిళలకు అవగాహన కల్గించడానికి, చెట్టిపేట, నిడదవోలు ప్రాంతాల్లోని జలవిద్యుత్ కేంద్రాలను ప్రత్యక్షంగా చూపించడం ద్వారా శిక్షణ అందించారు. మహిళలకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సాంకేతిక విషయాల పై అవగాహన కోసం బిహెచ్ఈఎల్, నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నైవేలీ సంస్థల సహకారాన్ని ఎపీ జెన్కో తీసుకుంది. వీరికి తగిన చదువు లేనప్పటికీ సాంకేతిక అంశాల మీద కనీస అవగాహనను కలిగించి నిపుణుల సహకారంతో సూపర్ వైసింగ్ చేయడం వారికి నేర్పారు. పవర్ హౌస్ నిర్మాణం పూర్తియిన అనంతరం 2010 నుంచి జలవిద్యుత్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి మొదలైంది.
మూడు గ్రామాలు 3.6 మె.వా విద్యుత్
ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యుత్ సంస్థ (ట్రిప్కో),తూర్పుగోదావరిజిల్లా. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఏలేరు నది పై మిట్టపాలెం,వేట మామిడి,పింజరికొండ వద్ద చిన్న తరహా జల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు.
ఇదీ ఒప్పందం
2006, డిసెంబర్ 5న గిరిజన శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో మూడు ప్రాజెక్టులను గిరిజన మహిళలతో ఏర్పడిన ప్రాజెక్టు కమిటీలకు అప్పగిస్తూ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ), ట్రిప్కోలు ప్రాజెక్టు కమిటీలలతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రాజెక్టుల నుండి వచ్చే నికర ఆదాయం స్థానిక గిరిజన గ్రామాల అభివృద్ధికి వినియోగించాలన్నది ఒప్పందంలో కీలకాంశం.
ఈ ప్రాజెక్ట్ వెనుక మహిళా ఐఎఎస్
‘‘మా గ్రామం పక్కనుండి పారుతున్న ఏలేరు నది లో దుస్తులు ఉతుక్కోవడం, చేపలు పట్టుకోవడమే మాకు తెలుసు. మా పంటపొలాలకు చాలా దిగువ భాగంలో నది ఉండటంతో వ్యవసాయానికి కూడా ఈ నీళ్లు పనికిరావు. కానీ ఈ నీళ్లతోనే కరెంట్ తీయవచ్చు అని తెలిశాక మేమంతా ఆశ్చర్యపోయాం.
కొన్నేళ్ల క్రితం మా ప్రాంతంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు జలవిద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సర్వేలు చేయసాగారు. ఆ సమయంలో ఛాయారతన్ అనే గిరిజనశాఖ ఉన్నతాధికారి అడ్డతీగల వచ్చి మాతో గ్రామసభ పెట్టించి... ‘‘ మీ ప్రాంతంలో గిరిజనేతరులు ఎలాంటి కంపెనీలు పెట్టకూడదు. ప్రభుత్వమే విద్యుత్ప్రాజెక్టు ఏర్పాటు చేసి మీకు అప్పగిస్తారు. దానిని మీరే నిర్వహించుకోండి.వచ్చిన ఆదాయాన్ని మీ ఊరు బాగు కోసం ఖర్చు పెట్టండి.’’ అని ఆమె మాకు చెప్పారు. దాంతో మా ఊరి పెద్దలంతా ఆలోచించి ఈ ప్రాజెక్టు నిర్వహించాలని నిర్ణయించారు.ఒక కమిటీగా ఏర్పడి 19 మందిని సభ్యులుగా ఎన్నుకున్నాం. ఇందులో మెజారిటీ సభ్యులు ఆడవారే.
పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను మేం దగ్గరుండి చేయించాం. యంత్రాలను ఎలా నిర్వహించాలో తెలుసుకున్నాం. కరెంట్ ఉత్పత్తి మొదలైంది. నిర్వహణ ఖర్చులు పోనూ వచ్చిన ఆదాయాన్ని మా గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలనేది మా కమిటీలో తీర్మాణం చేశాం.’’ అన్నారు, ట్రైబల్ వుమెన్ పవర్ ప్రాజెక్టుకమిటీ అసోసియేషన్ ఆఫ్ది వేటమామిడి అధ్యక్షురాలు బలువు సత్యవతి.
ట్రైబల్ వుమెన్ పవర్ ప్రాజెక్టుకమిటీ అసోసియేషన్ ఆఫ్ది వేటమామిడి అధ్యక్షురాలు బలువు సత్యవతి.
ఈ విద్యుత్ని ఎవరు కొంటారు...?
ఈ మూడు ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు మండల విద్యుత్ పంపిణీ సంస్థతో ప్రాజెక్టు కమిటీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఒక్క యూనిట్కి రూ.2.49పైసల చొప్పున సెంట్రల్పవర్డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి విక్రయించాడానికి ఆనాడు ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీని వల్ల సంవత్సరానికి సుమారు కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుంది. విద్యుత్ అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను ఐటిడిఏ కి అందచేస్తారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ తో పాటు గిరిజన మహిళల కమిటీకి చెక్ ఫవర్ కలిపించారు. వచ్చిన లాభాలలో కొంత శాతం వారి గ్రామాభివృద్ధికి వినియోగించాలి.
నెలకు రెండు లక్షల ఆదాయం
‘‘ మాది తణుకు రాతి పాలెం గ్రామం. అక్కడి నుండి వేట మామిడి రావాలంటే రహదారులు లేవు. అడ్డంగా పారుతున్న ఏలేరు వాగును మెడలోతు నీళ్లలో జాగ్రత్తగా దాటుకుంటూ రావాలి. మాకు ఇది రోజూ అలవాటయిపోయింది. మా ప్రాజెక్టులో 12మంది టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు.వీరి జీతాల కోసం నెలకు రూ.65 వేలు ఖర్చు అవుతుంది. మేం ఉత్పత్తి చేసే కరెంట్ పై నెలకు సుమారుగా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. దాంతో మా గ్రామాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నాం.కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు.’’ అన్నారు ప్రాజెక్టు కమిటీ ట్రెజరర్.బట్టురాజేశ్వరి.
గ్రామాభివృద్ధి నిధులు, గౌరవ వేతనం ఆపేశారు
‘‘ ఉత్పత్తి మొదలు అయ్యాక, మాకు ఒక్కొక్కరికీ నెలకు 1000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చేవారు.అది కూడా రెండేళ్ల నుండి ఆపేశారు. కనీసం ప్రాజెక్టువల్ల వచ్చే ఆదాయంలో కొంత ఇస్తే, వేటమామిడి గ్రామంలో రోడ్లు, పాఠశాల, మరుగుదొడ్లు అభివృద్దిని చేపట్టాలనుకున్నాం కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం మాకు సహకరించలేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు... ఒక సారి ఏవో ఖర్చుల కోసం నన్ను సంతకం పెట్టమన్నారు. మాకు ఒక్క పైసా ఇవ్వనపుడు ఎందుకు సంతకం పెట్టాలి అని పెట్టలేదు. అప్పటి నుండీ మా పట్ల ఇలా వ్యవహరిస్తున్నారు.
పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం మా చుట్టూ తిరిగి, మాతో సొసైటీ పెట్టించారు.
మా గ్రామానికి ఏదో మేలు జరుగుతుందని అప్పుడు అందరం ముందుకు వచ్చాం.
ఇపుడు మా అవసరం తీరిపోవడం తో పక్కన పెట్టేస్తున్నారు. ’ అని ఆవేదనగా అన్నారు ట్రైబల్ వుమెన్ పవర్ ప్రాజెక్టుకమిటీ అసోసియేషన్ ఆఫ్ది వేటమామిడి
అధ్యక్షురాలు బలువు సత్యవతి.
గౌరవ వేతనం ఎందుకు ఆపారో తెలీదు.
గిరిజన మహిళల సమస్యలను ట్రిప్కో ఇడి.దృష్టికి తీసుకెళ్లాం.
‘‘ ఈ పవర్ ప్రాజెక్ట్ కోసం గిరిజన మహిళలతో సొసైటీని ఏర్పాటు చేయించిన మాట వాస్తవమే.ప్రాజెక్ట్కి వారే యజమానులు. విద్యుత్ ఉత్పత్తిలో వచ్చిన ఆదాయంలో నుండి వారికి గౌరవ వేతనం, గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఉంది. అయితే వచ్చిన ఆదాయం సొసైటీ తరపున రంపచోడవరం ఐటీడీఏ పీఓ గారికి నేరుగా పంపిస్తున్నాం. ఆయన వారితో మాట్లాడి వారి గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పనులు చేయాలి. ప్రాజెక్ట్ ఆఫీసర్, అసోసియేషన్ సభ్యులు చర్చించుకొని నిర్ణయించుకోవాలి.వారి గౌరవ వేతనం ఎందుకు ఆపారో మాకు తెలీదు. ఆ ప్రాజెక్ట్ విషయంలో మా బాధ్యత కేవలం టెక్నికల్ సపోర్ట్ వరకు మాత్రమే.’ అన్నారు ట్రిప్కో ఇడి. ప్రభాకర్.
ఇదీ విద్యుత్ వెలుగులు పంచుతున్న గిరిజన మహిళల జీవితాల్లోని చీకటి కథ!
మహిళలకు అవార్డులు
హైడల్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న మహిళలకు ప్రభుత్వం నుండి నిరాధరణ ఉన్నప్పటికీ సమాజం మాత్రం మర్చిపోకుండా గౌరవిస్తూనే ఉంది.దానికి నిదర్శనమే వారికి దక్కిన గుర్తింపు.
‘‘ హైదరాబాద్, శిల్పారామంలో 2005లో జరిగిన గిరిజన మేళాలో మేం ప్రదర్శించిన వేటమామిడి ప్రాజెక్టు మోడల్కి ఫ˜స్ట్ఫ్రైజ్ వచ్చింది. అలాగే హైదరాబాద్లోని నాబార్డ్ సంస్ధ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మా అసోసియేషన్ సభ్యులందరినీ పిలిచి సత్కరించారు. ఆ ఉత్సాహంతో ఎన్ని సమస్యలున్నా పవర్ప్రాజెక్టు నిర్వహిస్తున్నాం. మాలో ఎవరు పెద్దగా చదువుకోక పోయినా, మాకు ఇచ్చిన శిక్షణ వల్ల ప్రాజెక్టు నిర్వహణలో ఇబ్బందులు లేకుండా సూపర్ వైజింగ్ చేస్తున్నాం ’’ అన్నారు ఆ మహిళలు.
ఈ ప్రాజెక్టు వల్ల గ్రామానికి ఏం చేయవచ్చు ?
జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటు వల్ల ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకున్న, పర్యావరణ పరంగా వలస పక్షులకు నిలయంగా మారుతుంది. భూగర్భజలాలు పెరుగుతాయి.. జలాశయంలో నిల్వ నీటిలో పెరిగే జలచరాలు అనేక వలస పక్షులకు ఆహారంగా అందిస్తాయి.