భారత్తో త్వరలో ‘‘బిగ్డీల్’’..
సంకేతాలిచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..;
అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చైనా(China)తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. భారత్తోనూ ‘‘బిగ్ డీల్" ఉండబోతుందన్న సంకేతాలిచ్చారు. ఇదే సందర్భంలో మరో విషయం కూడా స్పష్టం చేశారు. తమ దేశం అందరితో ఒప్పందాలు చేసుకోదని పేర్కొన్నారు. భారత్, అమెరికా అధికారులు నాలుగు రోజుల పాటు గోప్యంగా చర్చలు జరిపిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇరు దేశాధికారుల మధ్య జరిగిన చర్చల్లో సుంకం సడలింపు ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. పరిశ్రమల ఉత్పత్తులు, ఆటోమొబైల్స్ ముఖ్యంగా విద్యుత్ వాహనాలు (EVs), పెట్రోరసాయన ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, ఆపిల్, ట్రీ నట్స్, జన్యుపరంగా మార్పిన చేసిన పంట ఉత్పత్తులపై మినహాయింపు ఇవ్వాలని అగ్రరాజ్యం భారత్ను కోరినట్లు తెలుస్తోంది. అలాగే భారత్ కూడా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, దుస్తులు, ప్లాస్టిక్లు, రసాయనాలు, నూనె గింజలపై రాయితీ కోరినట్లు సమాచారం. భారత్, అమెరికా మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుత $190 బిలియన్ల నుంచి 2030 నాటికి $500 బిలియన్లకు పెంచడమే బిగ్ డీల్ లక్ష్యం.
వాస్తవానికి ఏప్రిల్ 2న భారతీయ వస్తువులపై అమెరికా అదనంగా 26 శాతం పరస్పర సుంకాన్ని విధించింది. కానీ దానిని 90 రోజుల పాటు నిలిపివేసింది. అయితే అమెరికా విధించిన 10 శాతం బేస్లైన్ సుంకం అమలులో ఉంది. అదనపు 26 శాతం సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది.
కాగా భారత్, అమెరికా ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే వాణిజ్య ఒప్పందాన్ని రూపొందిస్తున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.